- దళితబంధు పుట్నాలు, బఠాణీల పంపిణీ కాదు…
- సంపద పెంచాలన్నది, పేదరిక నిర్మూలన లక్ష్యం
- దళిత పారిశ్రామకవేత్తలకు పూర్తి సహకారం
- ఉన్నత విద్యావంతులు స్వయం ఉపాధి రంగాలను ఎంచుకోవాలి
- డిక్కీ సదస్సులో మంత్రి కెటిఆర్
- ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేని ప్రధాని..ఆయనను ఏమంటారంటూ ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్గా మారిందని, అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే అందరికీ ఉపాధి కల్పన సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధును పుట్నాలు, బఠాణీల మాదిరిగా పంచేందుకు పెట్టలేదని పేర్కొన్నారు. సంపద పునరుత్పత్తి కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఉద్ఘాటించారు. పేదరిక నిర్మూలన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. దళితబంధు ద్వారా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని అర్థవంతంగా అమలుచేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని, అందుకే దళితబంధు స్కీమ్ను తీసుకొచ్చారని చెప్పారు. ఇది తెలియక కొంతమంది విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తుందని కేటీఆర్ అన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆశిస్తున్న వారికి అనుకూలమైన వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ సైఫాబాద్లో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడల్ కేరీర్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..అమెరికా ప్రభుత్వాన్ని నడుపుతున్న జో బైడెన్ కావొచ్చు.. దేశాన్ని నడుపుతున్న ప్రధాని మోదీ కావొచ్చు.. రాష్ట్రాన్ని నడుపుతున్న సీఎం కేసీఆర్ కావొచ్చు..అందరి ముందున్న అతి పెద్ద సవాల్ ఏంటంటే.. ఉపాధి కల్పన, నిరుద్యోగం అని తెలిపారు. ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు చదువుకొని విద్యావంతులు అవుతున్నారు. వారి విద్యకు, అర్హతకు తగ్గ ఉపాధి కల్పించడం అంటే ప్రతి ప్రభుత్వానికి అది పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పన పరిమితం గానే ఉంటుందని తెలిపారు. మిగతా వారు స్వయం ఉపాధి అవకాశాల వైపు వెళ్లాలని, పారిశ్రామిక వేత్తలుగా మారాలని సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేసిందన్నారు. పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఒక్కొక్కరూ ఒక్క దేవుడిని నమ్ముతారు. కానీ వాస్తవం ఏంటంటే..దేవుడి అందర్నీ సమానంగానే పుట్టించారు. అందరికీ ఒకటే రక్తం, ఒకటే బుర్ర ప్రసాదించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంకో వాస్తవం ఏంటంటే.. ఉద్యోగవకాశాలు మాత్రం అందరికీ ఒకే రకంగా ఇవ్వలేదు.
దేవుడు మనిషిని పుట్టిస్తే.. ఆ మనిషి మతాన్ని, కులాన్ని పుట్టించాడు. ఈ విషయాన్ని కొంత మంది ఒప్పుకోవచ్చు..ఒప్పుకోకపోవచ్చు. మనిషి పుట్టించిన కులం, మతం ఆధారంగా మనల్ని మనం విభజించుకొని జీవనం గడుపుతున్నాం. ఇవి మనం చేసుకున్న కార్యక్రమాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా మనకు కనపడేది రెండే రెండు కులాలు..ఒకటి డబ్బున్నవాడు..రెండోది డబ్బు లేనివాడు. దళితుల్లో కూడా డబ్బున్న వారి పరిస్థితి ఒకటి. డబ్బు లేని వారి పరిస్థితి ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇద్దరే కనబడుతారు.. ఒకటి డబ్బున్నవాడు.. రెండోది డబ్బు లేని వాడని కేటీఆర్ తెలిపారు. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. దేశంలోని ఇతర రాష్టాల్రకు స్ఫూర్తివంతంగా మారాయని డిక్కీ ప్రతినిధులు చెప్తుంటే ఆనందం వేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 8 ఏళ్లలో తీసుకున్న విధాన నిర్ణయాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తివంతంగా మారాయని ప్రముఖ ఎంటప్రెన్యూర్ మిలింద్ కాంబ్లే ఈ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తుచేశారు. దళితుల్లో ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు డిక్కీ ముందుకు రావడాన్ని కేటీఆర్ ప్రశంసించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట నుంచి 30 మంది కలిసి సమష్టిగా రూ.3 కోట్లతో ఫ్యాబ్రికేషన్ యూనిట్, సోడా మేకింగ్ యూనిట్ ఏర్పాటుచేస్తామని ఇటీవల ముందుకొచ్చారని కేటీఆర్ చెప్పారు. ఆ రెండు యూనిట్ల ఏర్పాటుకు భూమి కేటాయించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. 1988-89లోనే దళితులపై అధ్యయనం చేసేందుకు ‘దళిత చైతన్య జ్యోతి’ కార్యక్రమాన్ని ఆనాడు ఎమ్మెల్యే హోదాలో కేసీఆర్ నిర్వహించారని తెలిపారు. సిద్ధిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి దళిత వర్గానికి చెందిన దానయ్యకు అప్పట్లో అవకాశం కల్పించింది కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. 1985లోనే సిద్ధిపేటకు హరితహారం కార్యక్రమాన్ని నాడు ఎమ్మెల్యే హోదాలో సీఎం కేసీఆర్ నిర్వహించారు. అప్పట్లో ఒకే రోజు పదివేల మొక్కలు నాటించారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్నే తెలంగాణకు హరితహారంగా తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధప్రదేశ్లో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే కేసీఆర్. 1996 -1997లోనే కేసీఆర్ 65 కిలోవి•టర్ల దూరంలోని లోయర్ మానేరు డ్యామ్ నుంచి సిద్ధిపేటకు నీళ్లను తీసుకొచ్చారు. సిద్ధిపేటలోని ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి నీటిని అందించి..‘మంచినీళ్ల పండుగ’ అనే కార్యక్రమాన్ని కేసీఆర్ నిర్వహించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్నే ‘మిషన్ భగీరథ’ పేరుతో తీసుకొచ్చారని కేటీఆర్ వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, డిక్కీ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్, డిక్కీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేని ప్రధాని..ఆయనను ఏమంటారంటూ కెటిఆర్ ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీపై మరోమారు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేని ప్రధానిని వి•రేమంటారు? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో చొరబాటుదారులను నియంత్రించలేని ప్రధానిని వి•రేమంటారు? ఇలాంటి ప్రధానిని ఏమని పిలుస్తారని నాలుగు ఆప్షన్లను కేటీఆర్ ట్వీట్ చేశారు. మరోవైపు కెటిఆర్ పిలుపుతో పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళన బాటపట్టింది. పాల ఉత్పత్తులపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధించిందని, బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ సందర్భంగా రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తులపై పన్ను విధించడంతో జరిగే నష్టాన్ని వివరించాలన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో రైతులను ముఖ్యంగా పాడి రైతులను భాగస్వాములుగా చేసారు.