- అతి పెద్ద ఫార్మాసిటీ నిర్మాణం
- ఏడేళ్లలో 25 వేల కోట్ల పెట్టుబుడుల రాక
- రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం మరింత బలోపేతం
- బయో ఏషియా 20వ సదస్సును ప్రారంభించిన మంత్రి కెటిఆర్
- మూడు రోజులపాటు జరుగనున్న సదస్సు
- 50 దేశాల నుంచి పాల్గొననున్న 2 వేల మంది ప్రముఖులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : లైఫ్సైన్సెస్ రంగానికి ప్రపంచ హబ్గా హైదరాబాద్ నగరం అవతరించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లైఫ్సైన్సెస్, ఫార్మా రంగ పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా 20వ సదస్సును శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటి.రామారావు ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ) వేదికగా జరుగుతున్న ఈ సదస్సు నేటి నుంచి మూడు రోజులపాటు కొనసాగనుంది. ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తుతరానికి మార్గదర్శనం అనే నినాదంతో బయో ఏషియా సదస్సు 2023 నిర్వహిస్తున్నామన్న మంత్రి కేటీఆర్..హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్ లార్జెస్ట్ ఫార్మా హబ్ నిర్మాణం జరుగుతుందన్నారు. గత 7 సంవత్సరాల కాలంలో 3 బిలియన్ డాలర్లకుపైగా(25 వేల కోట్లు) పెట్టుబడులు వొచ్చాయన్నారు. ఇక్కడ 800కుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఉన్నాయని, వీటి విలువ 50 బిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు.
ప్రపంచంలోనే మూడింట ఒకవంతు టీకాల ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే జరుగుతుండగా, దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతుందని చెప్పారు. టాప్-10 ప్రపంచ ఫార్మా కంపెనీల్లో నాలుగు కంపెనీలు మన రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లో 20కిపైగా లైఫ్సైన్సెస్, మెడ్టెక్ ఇంక్యుబేటర్లు ఉన్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. అందులో బయో ఏషియా సదస్సు కూడా ఒకటన్న ఆయన…ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రతిష్టలున్న శాస్త్రవేత్తలు, మేధావులు ఏకమై రాబోయేతరానికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషిచేయాలని ఆయన కోరారు.
లైఫ్ సైనెస్స్ రంగంలో అద్భుత సేవలు అందించిన వ్యక్తులకు ప్రదానం చేసే ‘జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు’ ఈ ఏడాది ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్కు అందజేయనున్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన 19 బయో ఏషియా సదస్సుల ద్వారా ప్రపంచంలోని 100 కుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, మేధావులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు, నిపుణులను ఒకే వేదికపైకి తెచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, నేషనల్ హెల్త్ అథారిటీ అదనపు సీఈవో బసంత్ గార్గ్, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజులపాటు జరుగనున్న బయో ఏషియా సదస్సు
మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల నుంచి 2 వేలకు మందికిపైగా ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, ఫార్మా, మెడ్టెక్, ఆరోగ్య సంరక్షణ రంగాలపై నిపుణుల ప్రసంగాలు, బృంద చర్చలు జరుగనున్నాయి. వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక సమావేశాలు, ప్రపంచస్థాయి నిపుణులతో చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్స్, సీఈవో కాంక్లేవ్, స్టార్టప్ షోకేస్, బయోపార్క్ సందర్శనలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. రెండు రోజులపాటు లైఫ్సైన్సెస్, ఫార్మా, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తారు.
చివరి రోజు వివిధ కంపెనీలకు చెందిన ప్రదర్శన ఉంటుంది. జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తారు. హైదరాబాద్లో 20కిపైగా లైఫ్సైన్సెస్, మెడ్టెక్ ఇంక్యుబేటర్లు ఉన్నాయి. దేశంలోని మరే నగరంలో ఇన్ని లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు బయో ఏషియా సదస్సు ఎంతగానో దోహదపడుతుందని చెప్పవచ్చు. అలాగే, 50కిపైగా దేశాల నుంచి ప్రతినిధులు వొస్తున్నందున హైదరాబాద్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది.