సమైక్య పాలనలో దుర్భిక్షం… స్వపరిపాలనలో సుభిక్షం : మంత్రి హరీష్రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 15: నాటి సమైక్య పాలనలో దుర్భిక్షం ఉంటే…నేటి స్వపరిపాలనలో సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. శనివారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఛైర్మన్ చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్రావు సమక్షంలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రామాయంపేట కోమటిపల్లి, సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామం నుండి భారీగా బిఆర్ఎస్లో చేరికలు జరిగాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్లో చేరిన నేతలు, కార్యకర్తలకు మంత్రి హరీష్రావు గులాబీ కండువాను కప్పి బిఆర్ఎస్లోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడుతూ..సిఎం కేసీఆర్ నేతృత్వంలో స్వపరిపాలనలో సుభిక్షంగా అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందనీ, నాటి కాంగ్రెస్, టిడిపి పాలనలో 200రూపాయల ఉన్న పెన్షన్ను నేడు 2 వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. వికలాంగుల పెన్షన్ 3 వేల రూపాయల నుంచి 4 వేల రూపాయలకు పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. ఆడబిడ్డ పెళ్లికి కల్యాణ లక్ష్మి, కాన్పు అయితే కేసీఆర్ కిట్టు, బిడ్డ కడుపులో ఉన్నపుడు న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పథకంతో బిడ్డల త్రాగు నీటి కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచే బాధ తప్పిందనీ, ఆడపడుచులు ఆరుబయట కాలు పెట్టకుండా ఇంట్లోకే నల్లా నీళ్లు ఇస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని… మండుటెండలో కూడా క్రమం తప్పకుండా మంచినీళ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. రామాయంపేటను దశల వారీగా అభివృద్ధి చేసుకుందాం.. రోడ్లు, మురికి కాలువలకు నిధులు కావాలి అని ఎమ్మెల్యే పద్మ కోరగా…రెండు రోజుల్లో 20 కోట్ల రూపాయలు మంజూరు చేసి మీ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. రామయంపేట అభివృద్ధి మరింత చేసుకుందామనీ, ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. కొరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి సంక్షేమాన్ని ఆటంకం లేకుండా చేసుకున్నామనీ, మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయనీ, మీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మీ మధ్యలో ఉంటూ, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారనీ, వచ్చే ఎన్నికల్లో మరోసారి పద్మను ఆశీర్వదించాలని మంత్రి హరీష్రావు కోరారు.
మంత్రి హరీష్రావు సమక్షంలో భారీ చేరికలు..
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రామాయంపేటకు చెందిన ఇద్దరు మునిసిపల్ కౌన్సిలర్లు, సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామ మాజీ సర్పంచితో సహా పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి హరీష్రావు సమక్షంలో బిఆర్ఎస్లో చేరారు. వీరందరికి మంత్రి హరీష్రావు గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. రామయంపేట కోమటిపల్లి 2వ వార్డ్ కౌన్సిలర్ సుందర్ సింగ్ బిజెపికి పార్టీకి గుడ్ బై చెప్పారు. అదేవిధంగా 1వ వార్డు కౌన్సిలర్ ఓద్దే స్వామి నేతృత్వంలో కాంగ్రెస్ బిబిజెపి పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు దాదాపుగా 200 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమర్సింగ్, రవిందర్ సింగ్, గణేష్, సిద్దిరాములు, గావు వివేకానంద, అశోక్, యాదగిరి, రాజు, బైరం అశోక్, శ్రీనివాస్, బాబు, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. అదే విధంగా సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచులు, ప్రస్తుత ఉప సర్పంచులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో పటోళ్ల జయరాములు, సోల్కంపల్లి కృష్ణ, అంజనేయులు, లక్ష్మయ్య, శ్రీనివాస్గౌడ్, మన్నే మల్లేశం, దుర్గయ్య, సంయుద్దీన్ తదితరులు ఉన్నారు.