తాజాగా ఒకటి జామ్నగర్లో, మరొకటి ముంబయిలో గుర్తింపు
జింబాబ్వే నుండి జామ్నగర్ వొచ్చిన వ్యక్తిలో గుర్తింపు
ఒమిక్రాన్కు విభిన్న టీకా అవసరం లేదు : డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాధన్
దేశంలో ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ గుర్తింపబడగా తాజాగా హైరిస్క్ దేశమైన జింబాబ్వే నుండి రాష్ట్రానికి వొచ్చిన కొద్ది రోజుల తర్వాత, గుజరాత్లోని జామ్నగర్ నగరంలో 72 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ కొరోనా వైరస్ బారిన పడ్డాడని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఇక ముంబయిలో మరొకరికి ఒమిక్రాన్గా గుర్తించారు. కర్ణాటకలో ఇంతకుముందు ఇద్దరు వ్యక్తులకు ఈ తరహా వైరస్ సోకినట్లు కనుగొనబడినందున, దేశంలో మొత్తంగా కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. జింబాబ్వే నుంచి వొచ్చిన వ్యక్తి ఒమిక్రాన్ వేరియంట్కు పాజిటివ్గా తేలిందని గుజరాత్ ఆరోగ్య కమిషనర్ జై ప్రకాష్ శివరే ధృవీకరించారు. ఆ వ్యక్తి నవంబర్ 28న జింబాబ్వే నుండి గుజరాత్కు రాగా డిసెంబర్ 2న కొరోనా వైరస్ పాజిటివ్గా గుర్తించారు.
ఆ తర్వాత అతని నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. జామ్నగర్కు చెందిన ఆ వ్యక్తి గత కొన్నేళ్లుగా జింబాబ్వేలో నివసిస్తున్నాడు. తన మామగారిని కలిసేందుకు రాష్ట్రానికి రాగా అతనికి జ్వరం వొచ్చిన తరువాత, అతని డాక్టర్ అతనికి ఆర్టి-పిసిఆర్ పరీక్ష చేయమని సలహా ఇవ్వగా, తన నివేదిక కోవిడ్ పాజిటివ్గా వొచ్చిందని ప్రైవేట్ లాబొరేటరీ గురువారం పౌర అధికారులకు సమాచారం అందించిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత, ఆ వ్యక్తిని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు ఖరాడీ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) ఇప్పటికే కొరోనా వైరస్ ఆందోళనకర రూపాంతరంగా గుర్తించింది. కేంద్రం ప్రభుత్వం జాబితా ప్రకారం యుకె, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్ మరియు ఇజ్రాయెల్తో సహా యూరోపియన్ దేశాలు హైరిస్క్ దేశాలుగా గుర్తించబడ్డాయి.
ఒమిక్రాన్కు విభిన్న టీకా అవసరం లేదు : డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాధన్
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, అయితే ఈ వేరియంట్ కోసం ప్రత్యేకంగా భిన్నమైన టీకా అవసరం ఉండబోదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాధన్ పేర్కొన్నారు. కొరోనా వైరస్ ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ తేలికపాటి లక్షణాలను కలిగిఉంటుందా..అసలు దీని మూలాలపై నెలకొన్న సందేహాలు వంటి అంశాలు ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదని ఆమె అన్నారు. ఒమిక్రాన్ ప్రాబల్య వేరియంట్గా మారే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 99 శాతం ఇన్ఫెక్షన్స్కు డెల్టా వేరియంట్ కారణమవుతుందని, కొద్దినెలల్లో డెల్టా కంటే ఒమిక్రాన్ ద్వారా అధిక ఇన్ఫెక్షన్లు సంక్రమిస్తాయని ఐరోపా యూనియన్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని సౌమ్య స్వామినాధన్ పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాలో కేసులు రోజూ రెట్టింపవుతున్నాయని ఇది ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనేది వెల్లడిస్తుందని చెప్పారు. తాజా వేరియంట్ను ఎదుర్కొనేందుకు మనం భయాన్ని వీడి అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. పలు కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేకపోవడం, స్వల్ప లక్షణాలు బయటపడుతున్న క్రమంలో ఈ దశలో ఒమిక్రాన్ ప్రభావంపై డబ్ల్యూహెచ్ఓ నిర్ధిష్టంగా అంచనా వేయలేదని చెప్పుకొచ్చారు. యాంటీబాడీలపై ఒమిక్రాన్ ప్రభావంపై కూడా మనం అప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని అన్నారు. గతంలో ఇన్ఫెక్షన్ సోకడం ద్వారా సమకూరిన సహజ రోగనిరోధక శక్తిని ఒమిక్రాన్ కొంత అడ్డుకోగలుగుతున్నట్టు కనిపిస్తుందని చెప్పారు. ఒమిక్రాన్ సోకినవారు తీవ్ర అనారోగ్యానికి గురికావడంలేదని అంటే టీకాలు ఇప్పటికీ రక్షణ కల్పిస్తున్నాయని మనం ఆశించవచ్చని ఆమె పేర్కొన్నారు.