Take a fresh look at your lifestyle.

కక్ష సాధింపు చర్యలను మానుకుని తాండూరు అభివృద్ధికి కృషి చేయాలి

కక్షపూరితంగా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు.
ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన నమ్మక ద్రోహులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం.
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: కక్ష సాధింపు చర్యలను మానుకొని తాండూరు అభివృద్ధికి కృషి చేయాలని కక్షపూరితంగా వ్యవహరించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని తాండూరు బీఆర్ఎస్ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నేర్చుకుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని అన్నారు. బుధవారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ నా హయాం లో జరిగిన అభివృద్ధి తాండూరు ప్రజలందరికీ తెలిసిందే నన్నారు. రూ. 1670 కోట్ల నిధులతో అన్ని విధాలా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాలని నిధులు మంజూరు చేయిస్తే, కక్ష పూరిత రాజకీయాలతో అభివృద్ధి పనులను నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. నియోజక వర్గం లో మేము తెచ్చిన పనులను , ప్రారంభమైన పనులను నిలిపి వేయాలని చూడటం అభివృద్ధిని అడ్డుకున్నట్లేనన్నారు. 40 ఏళ్లు గా జరగని అభివృద్ధిని నా హయాం లో పూర్తి చేయాలని ఎంతో కష్టపడి నిధులు మంజూరు చేయించాను అన్నారు. కానీ అభివృద్ధి పనులను ఆపేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు విరమించుకోవాలని అన్నారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జి, ఇండస్ట్రియల్ పార్క్, మార్కెట్ యార్డు నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో నిధులు తీసుకు వచ్చానన్నారు.ఒకవేళ మా విజ్ఞప్తి ని కాదని, పనులను నిలిపివేస్తే తాండూరు ప్రజల ఆగ్రహావేశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం లోను కావాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే డి ఎఫ్ ఎం టి నిధులకు సంబంధించిన పనులను నిలిపివేయాలని తాండూర్ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోందన్నారు. ప్రజల కోసం పని చేయాలే తప్ప, కక్ష పూరిత రాజకీయాలు చేయరాదన్నారు. ఆరు గ్యారెంటీ లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇంత వరకు వాటిని అమలు చేయడం లేదన్నారు. రుణ మాఫీ పై ఏ ప్రకటన లేదనీ, బ్యాంకుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారన్నారు. రైతు బంధు ఇంకా ఎప్పుడు వస్తుందని ప్రజల తరుపున తాను అడుగుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ పట్టణ అధ్యక్షులు అప్పు మార్కెట్ కమిటీ చైర్మన్  వీణ శ్రీనివాస్ చారి యాలాల బషీరాబాద్ పెద్దేమోల్ మండల నాయకులు రవీందర్ రెడ్డి నర్సిరెడ్డి కోహీర్ శ్రీనివాస్ గౌతపూర్ సర్పంచ్ రాజప్ప గౌడ్ కౌన్సిలర్లు వెంకన్న గౌడ్ మహంకాల్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply