- పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నాం
- కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్
కొరోనా వ్యాక్సిన్ అందుబాటుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 3 నుంచి 4 నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వొస్తుందన్నారు. 2021లో మంచి వార్తను వింటామని అన్నారు. కొరోనా అనంతరం హెల్త్ కేర్ అంశంపై ఫిక్కీ ఎఫ్ఎల్వో వెబినార్లో పాల్గొన్న హర్ష వర్దన్ వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. ‘మరో మూడు నుంచి నాలుగు నెలల్లో కొరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని నమ్మకంగా ఉన్నాం. సైంటిఫిక్ డేటాను అనుసరించి టీకా పంపిణీ జరుగుతుంది. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్లో వృద్ధులు, అనారోగ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి బ్లూప్రింట్ను సిద్ధం చేయడానికి ఈ-వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను సృష్టించాం.
వొచ్చే ఏడాది అందరికీ మంచి జరుగుతుందని, చాలా మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాం’ అని హర్షవర్దన్ పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కొరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే సెకండ్ వేవ్ మొదలైంది. వైరస్ను విజయవంతంగా ఎదుర్కునేందుకు అనేక కంపెనీలు వ్యాక్సిన్ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ట్రయల్స్లో ఉన్నాయి. ట్రయల్స్ దశలో ఉన్న టీకాలు అందుబాటులోకి రావడానికి నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని ప్రపంచ దేశాలు సెకండ్ వేవ్ను వ్యాక్సిన్ లేకుండా ఎదుర్కోవలసిందేనని అన్నారు. వ్యాక్సిన్ వొస్తుందని నిబంధనలు పక్కన పెడితే దానివలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వొస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ హెచ్చరించారు.