- నా పేరుతో బోగస్ లేఖ సృష్టించి వరద సాయాన్ని ఆపారు
- లేఖపై దర్యాప్తు చేసి నిజాలు తేల్చాలి
- రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
ఎన్నికల సంఘానికి తాను లేఖ రాసానని అంటున్న కెసిఆర్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వొచ్చి ప్రమాణం చేయాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు సవాల్ చేశారు. తాను శుక్రవారం మధ్యాహ్నం ఆలయం వద్దకు వొస్తానని, నిజమైన హిందువు అయితే కెసిఆర్ రావాలన్నారు. తనపేరుతో లేఖ సృష్టించి వరదసాయాన్ని నిలిపివేయించిన కెసిఆర్ అబద్దాల పుట్ట అన్నారు. పార్టీ నాయకులు డికె అరుణ, ఎంపి సోయం బాపూరావు తదితరులతో కలసి ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన వి•డియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరద బాధితులకు ఇంటికి రూ.25 వేలు ఇస్తామన్నారు.
ఎంత నష్టం వొస్తే అంత లెక్క గట్టి ఇస్తామన్నారు. నష్టపోయిన కార్లు, బైక్లు ఇప్పిస్తామన్నారు. తన లేఖకు సంబంధించి విచారణచేయించాలని, లేకుంటే కేసీఆర్ చార్మినార్ బాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. తాను వరద సాయం ఆపానని కేసీఆర్ నిరూపించాలన్నారు. వరద సాయం ఆపలేదని తాను అమ్మవారిపై ప్రమాణం చేస్తానన్నారు. కేసీఆర్ ప్లాన్ ప్రకారమే తన పేరుతో లేటర్ రాయించారన్నారు. ఒక జాతీయ పార్టీ లేఖనే ఫోర్జరీ చేశారంటే…ఇక ప్రజల ఆస్తులకు భరోసా ఏంటి అన్నారు. ‘కేసీఆర్ నిజంగా హిందువైతే..నకిలీ లేఖపై ప్రమాణం చేయడానికి శుక్రవారం 12 గంటలకు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణానికి రావాలి..లేదంటే క్షమాపణ చెప్పాలి’ అని సంజయ్ డిమాండ్ చేశారు.