Take a fresh look at your lifestyle.

కేసీ ఆర్‌ బీమా…ప్రతి ఇంటికీ ధీమా

తెల్ల రేషన్‌ కార్డు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా
తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ సన్న బియ్యం
ఆసరా పెన్షన్లు రూ. 3 వేలకు పెంపు…దశల వారీగా రూ. 5 వేలకు
దివ్యాంగుల పెన్షన్లు వెంటనే రూ 5 వేలకు పెంపు…దశల వారీగా రూ. 6 వేలకు
రైతు బంధు సాయం రూ.12 వేలకు పెంపు…దశల వారీగా రూ.16 వేలకు
అర్హులైన మహిళలందరికీ రూ. 3 వేల జీవన భృతి
అర్హులైన పేద మహిళలలకు, అక్రెడిటెడ్‌ జర్నలిస్టులకు రూ. 400లకే గ్యాస్‌ సిలిండర్‌
కేసీఆర్‌ ఆరోగ్య రక్ష కింద ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ. 15 లకు పెంపు
ఇంటి జాగా లేని నిరు పేదలందరికీ ఇండ్ల స్థలాలు
అగ్రవర్ణ పేదలకు నియోజక వర్గానికి ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌
ఉద్యోగుల సీపీఎస్‌పై అధ్యయన కమిటీ
అనాథ పిల్లలకు ప్రత్యేక పాలిసీ
బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను విడుదల చేసిన పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్‌
గతంలో మ్యానిఫెస్టోలో పెట్టని 90 శాతం పనులు చేశామని వెల్లడి

తాము మళ్లీ అధకారంలోకి రాగానే కేసీఆర్‌ బీమా…ప్రతి ఇంటికీ ధీమా పేరున తెల్ల కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 93 లక్షల కుటంబాలకు పైగా లబ్ది చేకూరనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు లక్షా 10 వేల కుటంబాలు ఉండగా అందులో దాదాపుగా 93 లక్షల కుటంబాలకు పైగా అంటే 90 శాతం కుటంబాలు తెల్ల రేషన్‌ కలిగి ఉన్నారని, వారందరికీ ప్రస్తుతమున్న రైతు బీమా తరహాలో ఎల్‌ఐసీ ద్వారా కేసీఆర్‌ బీమా..ప్రతి ఇంటికీ ధీమా పేరున రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ భవన్‌లో న్విహించిన మీడియా సమావేశంలో వొచ్చే ఎన్నికల్లో గెలిస్తే పార్టీ నెరవేర్చే హామీలకు సంబంధించి మ్యానిఫెస్టోను కేసీఆర్‌ విడుదల చేశారు. కాంగెస్‌ ఆరు గ్యారంటీల పేర పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన అనంతరం పాల్గొన్న ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావులు దానిని తలదన్నే విధంగా తమ మ్యానిఫెస్టో ఉండబోతుందని, అది చూసి ప్రతి పక్షాలకు దిమ్మతిరుగడం ఖాయమని, కేసీఆర్‌ ఆ పని మీదనే ఉన్నారని చెప్తుండడంతో అన్ని వర్గాల ప్రజల్లో బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోపై అత్యంత ఉత్సుకత నెలకొంది. ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ ఆదివారం సీఎం కేసీఆర్‌ తమ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ…తెలంగాణ ఏర్పడ్డనాడు అలుముకున్న పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత గొప్ప అధ్యయనం చేసిన తర్వాత మంచి పాలసీలు రూపొందించుకున్నామని, వెనుకబడేయబడ్డ తెలంగాణ బాగుపడాలంటే సంపద పెంచాలె…ప్రజలకు పంచాలె అని నిర్ణయించుకున్నామని, ఆ దిశలోనే బడ్జెట్‌ను దాదాపు 3 లక్షల కోట్లకు తీసుకపోయినమని, జీఎస్డీపీ రెండున్నర రెట్లు పెంచినమని, తలసరి ఆదాయం పెంచినమని, సంక్షేమానికి…అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చినమని దాంతో సంక్షేమంలోనూ, క్యాపిటల్‌ వ్యయంలోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. గంగా జమునా తహజీబ్‌ను తలపించే విధంగా గత పదేళ్ల కాలంలో ఒక చిన్న మత సంఘర్షణ జరుగలేదని అన్నారు. అన్ని రంగాల్లో దేశాన్ని నంబర్‌ వన్‌గా నిలిపామని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం బెస్ట్‌ ఎకనమిక్‌ పాలసీ, బెస్ట్‌ పవర్‌ పాలసీ, బెస్ట్‌ డ్రిరకింగ్‌ వాటర్‌ పాలసీ, బెస్ట్‌ ఇరిగేషన్‌ పాలసీ, బెస్ట్‌ అగ్రికల్చర్‌ పాలసీ, బెస్ట్‌ దళిత్‌ పాలసీ, బెస్ట్‌ వెల్ఫేర్‌ పాలసీ, బెస్ట్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ, బెస్ట్‌ హెల్త్‌ పాలసీ, బెస్ట్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ, బెస్ట్‌ హౌసింగ్‌ పాలసీ విజయవంతంగా అమలవుతున్నాయని, ఈ పాలసీలన్నీ యూథావిధిగా కొనసాగిస్తమని, కాలానుగుణంగా ఉద్దీపనలిస్తూ, ఉన్నతీకరించుకుంటామని స్పష్టం చేశారు. గతంలో తాము కేవలం మ్యానిఫెస్టోలో పెట్టని రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, మ్యానిఫెస్టోలో పెట్టని 90 శాతం పనులు చేశామని అన్నారు. దాని కొసాగింపుగానే బీఆర్‌ఎస్‌ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కొన్ని కొత్త హామీలు ప్రకటిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.
ఎల్‌ఐసీ ద్వారా కేసీఆర్‌ బీమా..ప్రతి ఇంటికి ధీమా పేర రూ. 5 లక్షల బీమా
రాష్ట్రంలో తెల్లకార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలోనే ఎల్‌ఐసీ ద్వారా 5 లక్షల రూపాయల జీవితబీమా కల్పిస్తామని కేసీఆర్‌ దెల్లడిరచారు. దానికా వందశాతం ప్రీమియం ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తామని, తద్వారా పేదలకు ఎనలేని మేలు చేయడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ బలోపేతానికి దోహదపడతామని తెలిపారు.
అన్నపూర్ణ పథకం కింద అందరికీ సన్న బియ్యం
తెలంగాణ రాంగనే రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఆకలితో అలమటించవద్దని రేషన్‌ బియ్యం కోటాను పెంచుకున్నామని, దాంతో పేదలు సంతోషపడ్డరని, బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే రేషన్‌ షాపుల ద్వారా తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నామని కేసీఆర్‌ అన్నారు.
ఆసరా పెన్షన్లు రూ. 3000లకు, దశల వారీగా రూ. 5000 లకు పెంపు
విధివంచితులైన అన్నార్తులను, దీనార్తులను, అసహాయులను ఆదుకోవడం మన సామాజిక బాధ్యత అని, అమెరికా, బ్రిటన్‌ వంటి అగ్ర దేశాల్లోనూ సోషల్‌ సెక్యూరిటీ పెన్షన్లు ఇస్తరని, గతంలో భారతదేశంలో పేదలకిచ్చే పెన్షన్లు ఒక జోక్‌ లాగా ఉండెనని, ఎడమ చేత్తోటి విదిలించినట్లు నామ మాత్రంగా 20 నుంచి 70 రూపాయలు ఇచ్చేదని, గరిష్టంగా 200 ఇచ్చిన్రని, అవి కూటికి రాకపోవు, గుడ్డకు రాకపోవని, పేదల పట్ల గౌరవంతో పింఛన్లను వేల రూపాయలకు తీసుకపోయింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని కేసీఆర్‌ అన్నారు. ఇవాళ తాను రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ల లబ్దిదారులందరికీ ఒక తీపికబురు చెబుతున్నానని, బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆసరా పెన్షన్లను ఐదేండ్లలో 5 వేల రూపాయలకు తీసుకపోతమని హామీ ఇస్తున్నానని ప్రకటించారు. ఇపుడు ఇస్తున్న రూ. 2,016 లను వెంటనే 3,016 రూపాయలకు పెంచుకుంటమని, దశలవారీగా ఐదు సంవత్సరాలకల్ల 5 వేల రూపాయలకు పెంచుతమని హామీ ఇచ్చారు.
దివ్యాంగుల పెన్షన్లు వెంటనే రూ 5 వేలకు పెంపు…దశల వారీగా రూ. 6 వేలకు
ఇక దివ్యాంగుల పెన్షన్‌ ఈ మధ్యనే 4,016 రూపాయలకు పెంచినమని, దశలవారీగా రాబోయే ఐదేళ్లలో 6,016 రూపాయలకు పెంచుతమని హామీ ఇచ్చారు సిఎం కేసీఆర్‌. ఇట్లా దశలవారీగా పెంచుకుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద భారం ఒకేసారి పడదని, సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత, బాధ్యతతోని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీలిస్తున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.
దశల వారీగా రైతుబంధు సాయం రూ.16 వేలకు పెంపు
దేశంలో రైతులకు పంట పెట్టుబడికి ప్రభుత్వం సాయం చేయాలనే ఆలోచన తమకన్నా ముంసఱ ఎవ్వరూ చేయలేదని, రైతుబంధు సృష్టికర్తనే బీఆర్‌ఎస్‌ అనిఈ పథకం ఎన్నికల వాగ్దానం కాదని, మ్యానిఫెస్టోలో పెట్టింది కాదని, రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి, వ్యవసాయాన్ని స్థిరీకరించాలని ఆలోచించి, నిబద్ధతతో, నిజాయితీతో రైతుబంధు పథకం తెచ్చినమని, కనుక, పెట్టింది మేమే….పెంచేది మేమే అని కేసీఆర్‌ వాఖ్యానించారు. ఇప్పుడు రైతుబంధు కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఏటా 10,000 రూపాయలను బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12,000 రూపాయలకు పెంచుతుందని హామీ ఇచ్చారు. వొచ్చే ఐదేండ్లలో రైతుబంధు సహాయాన్ని దశలవారీగా క్రమంగా పెంచుతూ.. గరిష్టంగా ఎకరానికి ఏటా 16,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇస్తున్నామని తెలిపారు. ఇక ధాన్యం కొనుగోలు పాలసీని యథావిధిగా కొనసాగిస్తామన్నారు.
సౌభాగ్య లక్ష్మి పేర అర్హులైన మహిళలందరికీ నెలకు 3 వేల జీవన భృతి
బీఆర్‌ఎస్‌ మొదటి నుంచీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని, చాలా పథకాల ప్రయోజనాలు మహిళల పేర్లమీదనే అందిస్తున్నదని, అదే క్రమంలో ఇవాళ మానవీయమైన మరో మంచి పథకాన్ని హామీ ఇస్తున్నామని, బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతినెలా 3,000 రూపాయల జీవన భృతిని అందిస్తుందని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.
మహిళలలకు, అక్రెటిటెడ్‌ జర్నలిస్టులకు రూ.400 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌
కేంద్రంలో ఉన్న బీజేపీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను విపరీతంగా పెంచి, సామాన్యుల మీద మోయలేని భారం వేస్తున్నదని, ఈ భారం తప్పించాలని మహిళల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో బీఆర్‌ఎస్‌ మానవీయ కోణంతో మరో హామీని ప్రకటిస్తున్నదని, బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలకు, అక్రెడిటెడ్‌ జర్నలిస్టులకు 400 రూపాయలకే గ్యాస్‌ సిలిండరును అందిస్తుందని, మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
కేసీఆర్‌ ఆరోగ్య రక్ష కింద ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ. 15 లక్షలకు పెంపు
బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, సామాన్యులకు కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అత్యధిక శాతం ప్రజలకు మునుపటికన్నా ఎక్కువ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలందిస్తున్నదని, అందులో భాగంగా ఇపుడు 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని, బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ ఆరోగ్యరక్ష పేరున ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఇంటి జాగా లేని పేదలకు ఇండ్ల స్థలాలు
రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్‌ఎస్‌ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్‌ పాలసీ చక్కగా ఉంది కనుక దాన్ని అలాగే కొనసాగిస్తామని తెలిపారు.
అగ్రవర్ణ పేదలకు నియోజక వర్గానికి ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌
తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్‌ విద్యకు పెద్దపీట వేస్తున్నదని, ఈ విధానం సత్ఫలితాలను సాధిస్తున్నదని, రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్‌ విద్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఆ దిశగా అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు :
రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీ కేసీఆర్‌ ఇచ్చారు.
ఉద్యోగుల సీపీఎస్‌ పై అధ్యయన కమిటీ
సీపీఎస్‌ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారని, దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తామని, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.
వీటితో పాటు అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తామని, మిగితా వారికి కూడా అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తామని, మైనారిటీ సంక్షేమానికి నిధులు మరింత పెంచుతామని, ప్రస్తుతమున్న మైనారిటీ రెసిడెన్షియల్‌ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని కేసీఆర్‌ హామీనిచ్చారు.

Leave a Reply