ఒక వైపు గోలకొండపైన కాషాయ జంఢాను ఎగురవేసేందుకు భారతీయ జనతాపార్టీ వ్యూహ రచన చేస్తుంటే, ఆ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తన పంథా మార్చుకుంటోంది బిజెపి. రాష్ట్రంలో కేంద్ర నాయకుల పర్యటనలతోపాటు, రాష్ట్రపార్టీ రథసారథిని కూడా మార్చే ఆలోచనలో ఉంది. వివిధ పార్టీలనుండి వొచ్చినవారి అలకలు తీరుస్తూ వారికి పార్టీ పరమైన పదవులు కట్టబెడుతూ, రానున్న ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోదీని వరంగల్కు తీసుకువొస్తున్నారు. ఇక్కడ కాజీపేటలో వ్యాగన్ పిరియాడికల్ ఓవర్ హాలింగ్ (పివోహెచ్) వర్క్షాపును, టెక్స్టైల్ పార్క్ భూమిపూజ కార్యక్రమాలకుగాను ప్రధాని వొస్తున్నారు. ఒకవిధంగా రాబోయే ఎన్నికలకు ప్రధాని ఈ పర్యటన నాంది కాబోతోందనుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను తెలంగాణలో జరుగకుండా ఆ పార్టీ పకడ్బందీగా పథకరచన చేసే దిశగా పావులు కదుపుతోంది.
వాస్తవంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ను తోసి ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించింది. బిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న బిజెపిలో గత కొంతకాలంగా స్థబ్ధత ఏర్పడింది. ఒకపక్క ఆ పార్టీలో చేరికలు నిలిచిపోగా, మరో పక్క వివిధ పార్టీలనుండి ఆ పార్టీలో చేరినవారు కొంత అసంతృప్తితో ఉండటం లాంటి పర్యవసానాల నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంటూ వొచ్చింది. పాదయాత్రలు, బహిరంగ సభలు సమావేశాలు, పలువురి చేరికలతో ఆపార్టీలో నూతనోత్సాహం పెల్లుబికింది. దీంతో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుంద •నుకున్నదల్లా అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో ఇప్పుడు పోటీ కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్యనే ఉండే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అదే విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. తమకు బిజెపి ఎంత దూరమో, బిఆర్ఎస్ కూడా అంతే దూరమన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనంటున్న బిజెపి ఆరోపణలను తిప్పి కొడుతూ వాస్తవంగా బిఆర్ఎస్ బిజెపిలే ఒక•ని కాంగ్రెస్ పేర్కొంటున్నది. అవి ఒకతాను బట్టే అంటోంది కాంగ్రెస్. అంతేకాదు బిఆర్ఎస్కు కొత్త నామకరణం చేసింది కూడా.. బిఆర్ఎస్ అంటే ‘బిజెపి రిస్తేదార్ పార్టీ’ అంటూ, బిజెపి కనుసన్నల్లోనే బిఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందంటూ నిన్నటి ఖమ్మం సభలో రాహుల్ ఆరోపించారు. బిఆర్ఎస్ అన్నది ఒక విధంగా మోదీ చేతిలో రిమోట్ లాంటిదంటున్న రాహుల్ బిఆర్ఎస్ తప్పిదాలపై చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. దిల్లీ లిక్కర్ స్కాంలో కెసిఆర్ కూతురు ఉన్నప్పటికీ ప్రధాని మోదీ ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన ఎత్తి చూపుతున్నారు. ఇది వారి బంధాన్ని చెప్పకనే చెబుతున్నదంటారాయన.
ఈ రెండు పార్టీలు ఒకటేనన్న విషయం తేటతెల్లం కావడంతో ఎవరూ ఆ పార్టీలో చేరేందుకు ఇష్టపడడంలేదనేందుకు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటివారిని బిజెపి కేంద్ర నాయకత్వం ఎంత ప్రలోభపెట్టినా వారు కాంగ్రెస్లో చేరకపోవడాన్ని ఆయన ఊటంకించారు. కర్ణాటక•లో బిజెపిని ఏవిధంగా తుడిచి పెట్టామో, తెలంగాణలో బిఆర్ఎస్ పనికూడా అలానే అయిపోతుందని ఖమ్మం సభలో రాహుల్ పేర్కొన్న తీరు ఆ పార్టీవర్గాల్లో ఆత్మస్తైర్యాన్ని పెంచేదిగా ఉంది. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం సభనుండే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిందని చెప్పవొచ్చు. ఈ తొమ్మిదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద సభ ఇంతవరకూ నిర్వహించలేదు.. ఒక వైపున భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, మరో పక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరికతో ఆ సభ ద్విగుణీకృత ఉత్సాహంగా కొనసాగింది. ఖమ్మం వాస్తవంగా కమ్యూనిస్టులకు ఎంత బలమైనదో, కాంగ్రెస్ పార్టీకి కూడా అంత బలం ఉన్న ప్రాంతం. పైగా పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి పది మందిని తానే నెగ్గించుకుంటానని మొదటినుండి చెబుతున్నాడు. దానికి తగినట్లు ఖమ్మంలో ఒక విధంగా ఆయన బలప్రయోగం చేశాడనే చెప్పాలే. ఇక్కడి నుండే బిఆర్ఎస్కు పతనం మొదలవుతుందని నాయకగళం చెబుతున్నది.