- బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు
జాతీయ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల..
ఎన్నికల సమరశంఖం.. - సభపై మంత్రులతో సిఎం సమీక్ష.. క్షేత్ర స్థాయిలో ఏర్పాట్ల పరిశీలన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సమర శంఖం పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రేపు తుక్కుగూడ వేదికగా ‘జన జాతర’ పేరుతో బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలకు ఈ సభ ద్వారా సమరశంఖం పూరించడం తో పాటు జాతీయ స్థాయిలో పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం సిఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభ నిర్వహణపై మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖలతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం సిఎం సభా ప్రాంగణానికి వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించనున్న మ్యానిఫెస్టో ప్రకటనకు తెలంగాణ రాష్ట్రం వేదిక కావడం విశేషమని, మ్యానిఫెస్టో దేశ దశ, దిశ మార్చనుందని పార్టీ నేతలు చెబుతున్నారు.