కొరోనా లక్షణాలున్న అనుమానితులకు పరీక్షలు నిలిపివేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించడం, ల్మాబ్, నమూనా సేకరణ కేంద్రాలను శానిటైజేషన్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న దృష్ట్యా 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి కొరోనా పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఈనెల 16 నుంచి ఇప్పటి వరకూ 36 వేళ శాంపిళ్లను సేకరించామనీ, ప్రస్తుతం 8253 శాంపిళ్లు వివిధ ల్యాబ్లలో పరీక్షల కోసం పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.
ఒక శాంపిల్ను 48 గంటల లోపు పరీక్ష చేయాలనీ, అప్పటి వరకు నిర్ణీత ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలనీ, వీటిని పరీక్ష చేయకుండా కొత్త శాంపిల్స్ను సేకరిస్తే పాట వాటిని నిల్వ చేయడం ఇబ్బందిగా మారిందని తెలిపింది. మరోపక్క ఎక్కువ రోజుల తరువాత పరీక్షలు చేస్తే ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న పరీక్షలు పూర్తి చేయడం, ల్యాబ్లు, నమూనాల కేంద్రాలను శానిటైజేషన్ చేయడం కోసం రెండు రోజుల పాటు ప్రత్యేక శిబిరాల ద్వారా కోరోనా అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరించడం నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. ఆసుపత్రులలో కొరోనా లక్షణాలు ఉన్న వారికి యధావిధిగా పరీక్షలు జరుగుతున్నాయనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. అయితే, కొరోనా పరీకలు అవసరం ఉన్న వారికి నిరంతరం పరీక్షలు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.