Take a fresh look at your lifestyle.

తెలంగాణ గుల్ల అంటూ అబద్ధాల ప్రచారం

  • శ్వేతపత్రాలకు ధీటుగా స్వేదపత్రాలు
  • కెసిఆర్‌ వుండి వుంటే ఆదానీ వొచ్చేవారా
  • పాలమూరుకు జాతీయ హోదా సాధించలేకపోయారు
  • కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కెటిఆర్‌ విమర్శలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 19 : తెలంగాణ గుల్ల అయ్యిందని గవర్నర్‌ తమిళి సైతో అబద్ధాలు చెప్పించారని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అందుకే రాష్ట్ర అభివృద్ధిపై గణాంకాలు, ఆధారాలతో స్వేదపత్రం విడుదల చేశామన్నారు. శుక్రవారం కెటిఆర్‌ విూడియాతో మాట్లాడుతూ…డిసెంబర్‌ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్‌ రెడ్డి అన్నారని, రుణాలు వసూలు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు ఇచ్చారని దుయ్యబట్టారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామన్నారని, ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా రాదని స్పష్టమైందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హావిూలు అమలు చేసేదాకా విడిచి పెట్టేదేలేదని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌`బిజెపి నాయకుల అసలు రంగు బయటపడుతుందని కెటిఆర్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అదానీని తిడితే సిఎం రేవంత్‌ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని ఆయన చురకలంటించారు. కెసిఆర్‌ ఉన్నంత కాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బిఆర్‌ఎస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. మన బలం, మన గళం, గులాబీ జెండా పార్లమెంట్‌లో ఉండాలని పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌  మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సవిూక్ష సమావేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన జరిగింది.

మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాలు సిద్దిపేట, మెదక్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్‌ చెరు, దుబ్బాక, గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కెటిఆర్‌ సవిూక్షించారు. ఆరు అసెంబ్లీ సీట్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థుల విజయంలో మాజీమంత్రి హరీష్‌ రావు కీలకపాత్ర పోషించారు. 2018లో కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరు సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక మెదక్‌ లోక్‌ సభ నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కేసీఆర్‌ బరిలోకి దిగకుంటే టికెట్‌ కోసం నేతలు ప్రయత్నిస్తున్నారు. వంటేరు ప్రతాప్‌ రెడ్డి, పద్మా దేవేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, శేరి సుభాష్‌ రెడ్డి, శివకుమార్‌ పేర్లు వినిపిస్తున్నాయి. సవిూక్షలో మాజీ మంత్రి హరీష్‌ రావు, పార్టీ జనరల్‌ సెక్రటరీ కే కేశవరావు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply