మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎలక్షన్ కోడ్) ఉల్లంఘించకుండా జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల నియమావళి తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలో రాజకీయ పార్టీల నాయకులు నిబంధనలు, నియమావళిని స్పష్టంగా వివరించారు. జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా చేపట్టకూడని కార్యక్రమాలతో పాటు వ్యవహరించాల్సిన తీరుపై కలెక్టర్ రాజకీయ పార్టీల నాయకులకు తెలియజెప్పారు.
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందం ఎల్లప్పుడూ పర్యటిస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు పలు సందేహాలను సమావేశంలో వ్యక్తం చేయగా అందుకు సంబంధించి వారి సందేహాలను కలెక్టర్ అమోయ్ కుమార్ నివృత్తి చేశారు. అలాగే సీ విజిల్ యాప్ను వినియగించుకోవాలని, అన్ని రాజకీయ పార్టీల వారు తమ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాల్సిందిగా సమావేశంలో కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.