- ఇక నర్సింగ్ డాక్టర్గా స్టాఫ్ నర్సులు
- రైతులు, కూలీల పిల్లలు కూడా డాక్టర్ చేసే అవకాశం ఇచ్చిన కేసిఆర్
- సిద్దిపేటలో వెయ్యి పడకల ప్రభుత్వ దవాఖానను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ, నేడు కరువును ఎరగనోల్లం అయ్యామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. గురువారం సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…ఇక ప్రాథమిక చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందించబడతాయన్నారు. స్టాఫ్ నర్స్ల పేరు మారుస్తూ నర్సింగ్ డాక్టర్గా పిలుస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాకు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిర్మించడం వల్ల కార్మికుల పిల్లలు, పేద పిల్లలు ఈరోజు డాక్టర్లుగా తయారవుతున్నారన్నారు. 175 సీట్లు సిద్ధిపేట మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందుతారు. ఇందులో 25 శాతం సీట్లు వివిధ రాష్ట్రాల నుంచి వొచ్చి చదువుతున్న వారున్నారన్నారు. దిల్లీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వొచ్చి చదువుతున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఏంటో అర్థం అవుతుందన్నారు.
గతంలో సిద్దిపేట మెడికల్ కాలేజ్ నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లకు పంపించేవారని, కానీ ఇకపై నుండి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయన్నారు. నూతన క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, ఇకనుండి క్యాన్సర్ చికిత్స కూడా సిద్ధిపేటలోనే అందించబడుతుందన్నారు. ఈ హాస్పిటల్లో 40 పడకల డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 15 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందులో 8 మార్జిలర్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించుకున్నామని, 100 ఐసీయూ బెడ్లు పూర్తి సామర్ధ్యంతో ప్రైవేట్కి దీటుగా వైద్య సేవలు అందిస్తామని, 30 పడకలతో ఎమర్జెన్సీ వార్డు, 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాకు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 875 మంది వైద్య విద్యార్థులు ఉంటారని, 13 డిపార్ట్మెంట్లలో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మరో 3 నూతన పీజీ సీట్లు ఏర్పాటు కాబోతున్నాయని, ప్రతి ఏడాది 62 మంది పీజీ విద్యార్థులకు కూడా చదివే అవకాశం ఉందన్నారు.
సంపన్నుల పిల్లలే డాక్టర్ చదువు చదవాలన్న నానుడిని మారుస్తూ రైతులు, కూలీల పిల్లలు కూడా ఎంబీబీఎస్ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చాడన్నారు. నర్సింగ్, బి ఫార్మసీ కాలేజ్లు సిద్ధిపేటలో ఉన్నాయనీ, 280 మంది డాక్టర్లు 24 గంటలు సేవలు అందిస్తారన్నారు. వీరితోపాటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న 150 మంది డాక్టర్లు కూడా సేవలు అందిస్తారనీ, ప్రాథమిక చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందించబడతాయన్నారు. ఒక ప్రాంతానికి కావాలిసిన కలలను సాకారం చేసుకున్నామని, సిద్దిపేటను జిల్లా చేసుకున్నామని, గోదావరి నీళ్లు తెచ్చుకున్నామని, రైల్ కూడా తెచ్చుకున్నామనీ హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా వేయి పడకల హాస్పిటల్ మనకు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ, సిద్దిపేట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ రఘుతం రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, అడిషనల్ కలెక్టర్ గిరిమ అగర్వాల్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.