పిడుగుపాటుకి ఇద్దరు…రోడ్డు ప్రమాదంలో ఇద్దరు..జలపాతంలో పడి ఒక్కరు..
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్పై పిడుగు పడడంతో ఇద్దరు యువకులు కాలి బూడిదయ్యారు. మంచిర్యాల రైల్వే వంతెన వద్ద బైక్పై పిడుగు పడింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇక తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతంలో ఆదివారం గల్లంతైన ప్రతాప్ చౌదరి(17) అనే యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైందని తిర్యాణి ఎస్సై రామారావు తెలిపారు.
ప్రతాప్ చౌదరి తన స్నేహితులతో కలిసి చింతల మదర జలపాతం అందాలను చూడడానికి రాగా ప్రమాదవశాత్తు జలపాతంలో పడి గల్లంతయ్యాడు. తన తోటి స్నేహితులు తమకు తెలపగానే ఆదివారం సాయంత్రం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టామన్నారు. చీకటి పడడంతో సాయంత్రం గాలింపు చర్యలు నిలిపి వేసి తిరిగి సోమవారం ఉదయం ప్రారంభించగా జలపాతంలో ప్రతాప్ చౌదరి మృతదేహం లభ్యమైంది ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రమంతాపూర్ వద్ద ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది.
దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.