- హంగ్ వొస్తుందని బిఎల్ సంతోష్ చెప్పడాన్ని బట్టి ఆ రెండు ఒక్కటే అని స్పష్టమయింది
- ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా దేశంలో పాలన
- క్రైస్తవ హక్కుల సమావేశలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
- పాల్గొన్న సీనియర్ పార్టీ నేతలు చిదంబరం, థాక్రే తదితరులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం నేడు దేశంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా పాలన సాగిస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన భరొసా ఇచ్చారు. శనివారం సికింద్రాబాద్ హరిహర కళా భవన్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ హక్కుల సమావేశలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ అనిల్ థామస్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తమ పార్టీ అధికారంలోకి వొస్తే క్రిస్టియన్ మైనారిటీల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. క్రిస్టియన్ మైనారిటీల డిమాండ్లను అమలు చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాన్నారు.
రాష్ట్రంలో హాంగ్ వొస్తదని, బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందని బీఎల్ సంతోష్ చెబుతున్నారని, కాంగ్రెస్, బీజేపీ కలవవు అని అందరికీ తెలుసని, హాంగ్ వొస్తే కలవబోయేది బీజేపీ, బీఆరెస్లేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ, బీఆరెస్ కుట్ర చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. కర్ణాటకలో మైనారిటీలు కాంగ్రెస్ వైపు నిలబడ్డందుకే అక్కడ మైనారిటీల సంక్షేమం కోరే ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తెలంగాణలోనూ మైనారిటీలు కాంగ్రెస్కు అండగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, కేటీఆర్లు సోనియాను దూషిస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ను నిందిస్తుందని అన్నారు. బీజేపీ, బీఆరెస్ది ఫెవికాల్ బంధమని తెలుసని, కానీ ఎంఐఎం ఎందుకు కాంగ్రెస్ను దూషిస్తుందో చెప్పాలన్నారు.
పదవులు త్యాగం చేసినందుకా? దళితుడిని జాతీయ అధ్యక్షుడిని చేసినందుకా అని రేవంత్ ఎంఐఎంను ప్రశ్నించారు. బీజేపీ, బీఆరెస్ దళితుడిని పార్టీ అధ్యక్షుడిని చేయడమేమో గాని దళితుడైన కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్లో కూర్చుంటేనే కేసీఆర్ సహించలేరన్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపుతిప్పేవిగా ఉంటాయన్నారు. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్ అని, 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వొచ్చిందని, 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వొస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వొస్తేనే బడుగులు బలహీన వర్గాలు, మైనారిటీలకు మేలు జరుగుతుందని రేవంత్ ఆశ్వాసం ఇచ్చారు. కేసీఆర్, మోదీ అపూర్వ సోదరులని, వొచ్చే ఎన్నికల్లో ఆ ఇద్దరికీ సరియైన రీతిలో బుద్ది చెప్పాలన్నారు. సోనియాగాంధీని విమర్శించే నాయకులు ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.