ఎస్ఎఫ్ఏ ఛాంపియన్షిప్లో 2 వేల మంది క్రీడాకారులు పోటీ
హిమాయత్నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఏ ఛాంపియన్షిప్ లో హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, చెస్, త్రోబాల్, అథ్లెటిక్స్, కబడ్డీ, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్లలో 2000 మందికిపైగా అథ్లెట్లు పోటీపడ్డారని ఎస్ఎఫ్ఏ నిర్వాహకులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడల పట్ల యువ క్రీడాకారులకు ఉన్న అంకితభావం, అభిరుచికి భారీ స్థాయిలో పాల్గొన్న ఈ క్రీడాకారులే నిదర్శనం అన్నారు. 13 వ రోజు విలువిద్య పోటీలకు 70 కంటే ఎక్కువ మంది ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొని, విల్లుతో తమ అభిరుచిని ప్రదర్శించినట్లు తెలిపారు. బాలుర అండర్-17 విభాగంలో తీవ్రమైన పోటీ జరిగిందని, ఈ పోటీలో రాష్ట్ర స్థాయి క్రీడాకారుడు రమావత్ రవి స్వర్ణం సాధించగా, జాతీయ స్థాయిలో పోటీ చేసిన హరిద్ కలేకర్ రజత పతకాన్ని సాధించినట్లు తెలిపారు. యూ-17 మహిళా విభాగంలో కూడా ఇదే తరహా పోటీ జరిగిందన్నారు. రాష్ట్ర-స్థాయి ఆర్చర్, మేఘన బంగారు పతకాన్ని సాధించినట్లు తెలిపారు. ఎస్ఎఫ్ఏ ఛాంపియన్షిప్లు కేవలం కొత్తవారికి వేదిక మాత్రమే కాదు, రాబోయే అథ్లెట్ల భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలుస్తాయన్నారు.