- చిత్రహింసలతో నరకయాతన
- మహిళా పైలట్ దంపతుల ఘాతుకం
- ర్తించి చితకబాదిన బంధువులు
న్యూ దిల్లీ, జూలై 19 : ఇంట్లో పని చేస్తున్న బాలికకు మహిళా పైలట్, ఆమె భర్త చిత్రహింసలు పెడుతున్నారు. ఈ విషయం తెలియడంతో బాలిక బంధువులు, స్థానికులు వారిద్దరిని చితకబాదారు. ఈ వీడియో క్లిప్ సోషల్ డియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మహిళా పైలట్, విమాన సంస్థలో పని చేసే ఆమె భర్త కలిసి ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో నివసిస్తున్నారు. రెండు నెలల కిందట పదేళ్ల బాలికను ఇంట్లో పనికోసం పెట్టుకున్నారు. అయితే ఆ పాపను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. దొంగతనం ఆరోపణలపై ఆ బాలిక చేతులు, ముఖంపై వాతలు పెట్టారు. బాలిక శరీరంపై కాలిన, ఇతర గాయాలు ఉండటాన్ని ఆమె బంధువు చూశాడు. బుధవారం దీని గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అలాగే ఈ విషయం తెలియడంతో బాలిక బంధువులు, స్థానికులు ఆ భార్యాభర్తల ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొందరు మహిళలు మహిళా పైలట్ జుట్టుపట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కొట్టారు. భార్యను కాపాడుకునేందుకు ప్రయత్నించిన భర్తపై మరికొందరు దాడి చేశారు. మరోవైపు బాలిక శరీరంపై కాలిన, ఇతర గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. పదేళ్ల బాలికతో ఇంటి పనులు చేయించడం నేరమని చెప్పారు. ఆ పాప స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు వెల్లడించారు. బాలికను చిత్రహింసలకు గురి చేసిన మహిళా పైలట్, ఆమె భర్తపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా, జనం ఆ దంపతులపై దాడి చేసి కొట్టిన వీడియో క్లిప్ షోషల్ డియాలో వైరల్ అయ్యింది.