- ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కెసిఆర్ సందేశం
- ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1వ తేదీన హెచ్ఐసిసిలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేసారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ…ఈ వజ్రోత్సవ ముగింపు ఉత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పిటిసిలు, మండల పరిషద్ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితిల అధ్యక్షులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారని వివరించారు.
ఈ కార్యక్రంలో భాగంగా దాదాపు గంటసేపు దేశ భక్తి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించే పలు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని, అనంతరం ముఖ్యమంత్రి సందేశం ఉంటుందని వెల్లడించారు. వేడుకలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సంబంధిత అధికారులందరూ విస్తృత స్థాయిలో ఏర్పాట్లను చేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కేవీ రమణ చారి, దేశపతి శ్రీనివాస్, డీజీపీ అంజనీ కుమార్ లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, సందీప్ సుల్తానియా, జితేందర్, కార్యదర్శులు శ్రీనివాస రాజు, ఎస్.ఏ.ఎం. రిజ్వి, బుద్ధా ప్రకాష్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జలమండలి ఎండి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, సమాచార పౌర సంబంధాల స్పెషల్ సెక్రెటరీ అశోక్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండి నర్సింహా రెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ పమేలా సత్పతి, పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ హనుమంత రావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు హజరయ్యారు.