- రాష్ట్రాన్ని బర్బాత్ చేసి దేశంలో ఏం చేస్తావ్?
- నీ బిడ్డకు లిక్కర్ కేసుతో సంబంధం లేదని యాగం సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు
- సమైక్యాంధ్ర చిచ్చును మళ్ళీ రగిలించి యువతను ఆత్మహత్యలకు పురిగొల్పే యత్నం
- ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : తెలంగాణ రాష్ట్రంలో మొఖం చెల్లక బిఆర్ఎస్ పార్టీ పేరుతో దేశంలో రాజకీయ పబ్బం గడపాలని కేసీఆర్ చూస్తున్నారని, ఇక్కడి చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా? అని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ను తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఏం చేసినావ్.. ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినావు? తెలంగాణ ప్రజలను బిచ్చగాళ్ళుగా ఎందుకు చేసినావ్? వాళ్ల జీవితాలను ఎందుకు బర్బాత్ చేసినవ్? రాష్ట్రాన్ని ఎందుకు అప్పులపాలు చేసినవ్? ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి..పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు తెచ్చినవ్? ఒక్కొక్కరి పేరు మీద రూ.1,20,000 అప్పు ఎందుకు చేసినావ్? ఇక్కడ ఒక రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించలేని నువ్ దేశంలో ఏదో చేస్తా అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించారు. అంతకు ముందు బండి సంజయ్ జగిత్యాల సమీపంలోని చల్గల్ గ్రామం వద్ద విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖాయన మాట్లాడుతూ..బిఆర్ఎస్ గురించి చర్చ జరగడంలేదని దిల్లీ పోయి రాజశ్యామల యాగం చేసి, ప్రజల దృష్టిని మరలించేందుకు వృథా ప్రయాసకు కెసిఆర్ పాల్పడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. లిక్కర్ కేసు గురించి ఎందుకు స్పందించడం లేదని..అందులో తన బిడ్డ పాత్ర గురించి ఎందుకు మాట్లాడటం లేదని సంజయ్ ముఖ్యమంత్రిని నిలదీశారు. నీ బిడ్డను కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజలు బలి కావాల్నా అన్నారు. అదే రాజ శ్యామల యాగం సాక్షిగా ప్రమాణం చేసి తన బిడ్డకు లిక్కర్ కేసుతో సంబంధం లేదని కెసిఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్ కేస్ విషయంలో ఎందుకు స్పందించడం లేదని, కనీసం ఖండించడం కూడా లేదని నిలదీశారు. బిఆర్ఎస్ అంటే అది కూడా మద్యపానం జిన్ అని సంజయ్ ఎద్దేవా చేశారు.
రాజశ్యామల యాగంలో ప్రమాణ పూర్వకంగా మైక్ పట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినవ్.. ఎంత మంది రైతులకు రుణమాఫీ చేసినవ్.. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చేయలేకపోయినవు? దళిత బంధు ఎంతమందికి ఇచ్చినావు.. ఎంతమంది దళితులకు మూడు ఎకరాలు ఇచ్చినవు? ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడానికి కారణమేంటి? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో ఎంత కమిషన్లు తీసుకున్నవ్.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎందుకు నీరుగార్చి అమలు చేయలేక పోయినావు? కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించినవ్? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆకాంక్ష, తపన ఉన్నా.. ఎందుకు అభివృద్ధి చేయించలేక పోతున్నావు? ఈ ప్రశ్నలన్నిటికీ రాజ శ్యామల యాగం సాక్షిగా ప్రమాణ పూర్వకంగా సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ బహిరంగ సభను విజయవంతం చేసి కేసిఆర్కు సవాల్ను విసరబోతున్నాం.. కెసిఆర్ బిఆర్ఎస్ పెట్టిన తర్వాత బిజెపి మొట్టమొదటి బహిరంగ సభ ఇది. బిఆర్ఎస్ తెలంగాణ సమాజాన్ని పట్టించుకోదు. కెసిఆర్ మాటలను మోసపూరిత విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
కెసిఆర్ కుట్రను, కుతంత్రాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది. సమైక్యాంధ్ర చిచ్చును మళ్ళీ రేపి మళ్లీ తిరిగి తెలంగాణ సెంటిమెంటును రగిలించి రాజకీయ లబ్ది పొంది ఆ నేరాన్ని మళ్లీ భారతీయ జనతా జనతా పార్టీ వైపు నెట్టే విషయాన్ని ప్రజలు గ్రహించారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రహించలేదని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 వందల మంది బలిదానమయ్యారు. కేసీఆర్ ఈసారి మల్ల కుట్ర చేస్తున్నారు. సమైక్యవాదాన్ని మళ్లీ వాళ్లతో కాంప్రమైజ్ అయి, వాళ్లతో ఒప్పందం కుదుర్చుకొని సెంటిమెంటు రగిలించి ఆత్మహత్యలను మళ్ళీ ప్రోత్సహించేందుకు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని కాపాడుకోవడానికి.. ఆక్రమంగా ఆయన సంపాదించిన ఆస్తులను, అవినీతిని ప్రజల దృష్టిని దృష్టిని మరల్చడానికి, భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి సహించలేక కుట్రలు చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కెసిఆర్ మాటలను ఎవరు పట్టించుకోరని, ఆయన చెల్లని రూపాయని బండి సంజయ్ విమర్శించారు. రాజ శ్యామల యాగం చెయ్..ఇంకా ఏదైనా చెయ్ నీ స్వార్థపూరిత బుద్ధి, నీ కుట్రలు, కుతంత్రాలు మీ కుటుంబంలో అవినీతి ఇవన్నీ చూసిన తర్వాత ఏ దేవుడు నిన్ను కూడా క్షమించడని, నువ్వు ఏ యాగం చేసినా కూడా ఫలించదని, నీ స్వార్థం కోసమే యాగాలు చేస్తున్నావని, ప్రజల సంక్షేమం కోసం కాదని బండి సంజయ్ దుయ్యబట్టారు. ఇదివరకు తెలంగాణలో యాగం చేసినావ్ కానీ తెలంగాణ సమాజానికి ఏమి చేసినవ్, తెలంగాణకు పేద ప్రజల కోసం ఏం చేసినావ్ అని ప్రశ్నించారు. దిల్లీలో యాగం చేయడాన్ని విమర్శించడం లేదని, రాజశ్యామలయాగం నీ ఇంట్లో చేసుకో.. నీ ఫామ్ హౌస్లో చేసుకో.. నీ ప్రగతిభవంలో చేసుకో.. అని అన్నారు. సిబిఐ రాష్ట్రానికి వొస్తదా? అని అంటున్నాడని, సిబిఐ రాష్ట్రానికే కాదు.. నీ ఇంట్లోకి కూడా వొస్తదని బండి సంజయ్ అన్నారు. ఏ రాష్ట్రంలో అవినీతి జరిగినా ఆ రాష్ట్రానికి సిబిఐ వొస్తుందని, తెలంగాణ ఈ దేశంలో భాగమేనని బండి సంజయ్ అన్నారు. మోడీ వొచ్చే ముందు ఈడీ రాదని.. మోడీ వొచ్చే ముందు కేసీఆర్కు కోవిడ్ వొస్తుందని..ఆయన కొడుకు కుడికాలు నుండి ఎడమకాలకు పట్టి వేసుకున్నాడని..మోడీ వొచ్చి ముందు కేసీఆర్ బిడ్డ దుబాయ్కి పారిపోయిందని అన్నారు. కవిత ఇంట్లో సీసీ కెమెరాలును స్వాధీనం చేసుకొని ఎంక్వయిరీ చేయాలని అన్నారు. పేదలను కేసీఆర్ రాచిరంపాన పెడుతున్నారని..
కేంద్ర నిధులను దారి మళ్ళిస్తున్నారని.. పలు ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ను జైలుకు పంపాల్సిందేనని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. ఒకప్పుడు కారుకు లోను కట్టలేని వ్యక్తి ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ ధనవంతుడిగా ఎలా ఎదిగాడని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎవరిని ముంచి ఎదిగారని.. ఎన్ని కమిషన్లు తీసుకుని ఎదిగిండు అని అన్నారు. మునుగోడు లాంటి ఎన్నికల్లో ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెట్టారు.. ఇతర రాష్ట్రాల్లో బిజెపిని ఓడించడానికి వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం కవిత జోలికి వెళ్లదనే విమర్శలను ప్రస్తావించగా….మరెందుకు గులాబీ బోకే పట్టుకొని కవిత ఇంటికి సిబిఐ వాళ్ళు స్వాగతం పలికడానికి వొచ్చారా? టిఫిన్లు, ఛాయలు తాగడానికి సిబిఐ వాళ్ళు కవిత ఇంటికి వెళ్లారా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు ఎడమల శైలందర్ రెడ్డి, పన్నాల తిరుపతిరెడ్డి, చిలకమర్రి మదన్మోహన్, ముదుగంటి రవీందర్ రెడ్డి, నలువాల తిరుపతి, వీరబత్తిని అనిల్ తదితరులు ఉన్నారు.