కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకున్న కెసిఆర్
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 24 : దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్కు.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనం అందించారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఆయన కొల్హాపూర్ చేరుకున్నారు. సిఎం వెంట ఎంపి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
సాయంత్రం హైదరాబాద్కు బయలుదేరి వొచ్చారు. ‘లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమైంది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుని ఆమె దీవెనలను కోరుకుంటారు. చాలా రోజుల నుంచి నేను ఈ కోవెలకు వొద్దామని..అమ్మ ఆశీస్సులు తీసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. దేశం అభివృద్ధి పథంలో సాగాలని..రైతులు ఆనందంగా ఉండాలని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మను కోరుకున్నాను’ అని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అన్నారు.