వలస పక్షులను నమ్మకుంటే మోసమే..
మల్కాజిగిరి ప్రచారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మేడ్చల్ మల్కాజ్గిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్ -1 అనే సినిమా చూపించిండని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు మోసం పార్ట్ -2 సినిమా చూపిస్తున్నాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిటిఆర్ ఎద్దేవా చేశారు. ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ల వి•ద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తా అంటున్నాడని, ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు అని, రెండో సారి మోసపోతే మోసపోయిన వారిదే తప్పు అని, ఇప్పుడు ప్రజలంతా కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వలస పక్షులకు వోట్లు వేస్తే గెలిచిన తర్వాత ప్రజలకు కనబడరని కేటీఆర్ పేర్కొన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి వోటు వేయాలన్నారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తూ…గత ఎన్నికల్లో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలిచారని కేటీఆర్ గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంతో ఇచ్చిందని, పీసీసీ, సీఎం పదవులు రావటానికి మల్కాజ్గిరి ప్రజలే కారణమని, అలాంటి రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలకు ఏం చేయలేదన్నారు. పార్లమెంట్లో పత్తా లేకుండా పోయిండని, ప్రజలకు కష్టం వొస్తే కనబడకుండా పోయిండని, ఈ వలస పక్షులకు వోట్లు వేస్తే గెలిచిన తర్వాత ప్రజలకు కనబడరని, 24 గంటలు అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించండని ప్రజలను కేటీఆర్ కోరారు. పదేళ్ల అభివృద్ధి కేసీఆర్ పాలన..వంద రోజులు అబద్ధపు రేవంత్ రెడ్డి పాలన అని కేటీఆర్ పేర్కొన్నారు. బడే భాయ్ మోదీ మనకు బడా మోసం చేసిండని, చోటా భాయ్ రేవంత్ రెడ్డి మనల్ని ఇక్కడ మోసం చేసిండని, వంద రోజుల్లో అందరికీ అన్ని చేస్తా అంటూ చోటా భాయ్ మోసం చేసిండని, గద్దెనెక్కిన వెంబడే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడని, రుణమాఫీ అయ్యిందా..తులం బంగారం వొచ్చిందా..మహిళలకు రూ. 2500 వొచ్చినయా..కెటిఆర్ ప్రశ్నల వర్షం కురిపించాడు.