స్వాతంత్య్ర కాంక్షకు ఊపిరి పోసిన ‘‘క్విట్‌ ఇం‌డియా ఉద్యమం’’

అరాచకాలతో,అణచివేతతో తెల్లదొరలు భారతీయుల స్వేచ్ఛాకాంక్షను ఎంతో కాలం నిలువరించలేకపోయారు.
సహనానికి కూడా హద్దుంటుంది. ఆ హద్దు చెరిగిపోయిన నాడు, అప్పటివరకు సహనమనే తెరలమాటునున్న ఆవేశం బద్దలై, ప్రళయంలా ముంచుకొస్తుంది. అలాంటి ప్రళయానికి నాంది పలికిన క్విట్‌ ఇం‌డియా ఉద్యమ చరిత్రను ప్రతీ ఒక్కరూ సింహావలోకనం చేసుకోవాలి.క్విట్‌ ఇం‌డియా ఉద్యమాన్ని స్మరించుకోవడం మన కనీస బాధ్యత.స్వేచ్ఛ అనేది జన్మతః లభించిన హక్కు.అలాంటి స్వేచ్ఛ హరించబడితే మానవ హక్కులు హరించబడినట్టే. స్వేచ్ఛ లేని జీవితం జీవశ్ఛవంతో సమానం.ప్రజలను స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు దూరం చేసి,పీడించుకుతిని సాధించేదేమిటి?ఆంగ్లేయులు  వ్యాపారం పేరుతో దేశంలోకి అడుగు పెట్టి కోట్లాది మంది భారతీయులను స్వేచ్ఛకు దూరం చేసి అణగద్రొక్కడం జరిగింది. ప్రజలు ఎదురు తిరిగితే ఫలితం ఎలా ఉంటుందో ఆంగ్లేయులకు భారత విప్లవ యోధులు రుచి చూపించారు. స్వార్ధ మెరుగని త్యాగధనుల శ్రమ ఫలితమే భారతీయ స్వాతంత్య్రం.
ప్రతీ ఉద్యమం వెనుక ఎన్నో ఆశలు,ఆకాంక్షలు ఉంటాయి.ప్రతీ పోరాటంలో ఎన్నో కష్టాలుంటాయి. అణచివేతలు, అరెస్టులు,వేధింపులకు సిద్ధపడే ఉద్యమాల్లోకి రావాలి. ప్రతీ ఉద్యమం విజయవంతం కాబోదు. ఉద్యమాలు విఫలమైనా, అవి భవిష్యత్తు పోరాటాలకు ప్రేరణగా,సందేశంగా మిగులుతాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామం ఎన్నో పోరాటాల సమాహారం. స్వాతంత్య్రం కోసం జరిగిన  ఉద్యమాల్లో కొన్ని విజయవంతమయ్యాయి .మరికొన్ని విఫలమైనాయి. విఫలమైన ఉద్యమాలు కూడా చరిత్రలో  స్థానం సంపాదించుకున్న విషయాన్ని మరవరాదు. అలాంటి వాటిలో క్విట్‌ ఇం‌డియా ఉద్యమం ఒకటి.  క్విట్‌ ఇం‌డియా ప్రాధాన్యతను విస్మరించరాదు. ఉద్యమకారుల మధ్య సైద్ధాంతిక విబేధాలు, భిన్న వైరుధ్యాల వలన సమన్వయం కొరవడి క్విట్‌ ఇం‌డియా ఉద్యమం విఫలమైనది.ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆంగ్లేయులు అనుసరించిన కుటిల నీతి,అక్రమ నిర్బంధాలు స్వాతంత్య్ర కాంక్షను మరింతగా ప్రజ్వలింప చేసాయి. ఆంగ్లేయుల పాలన లో సాగిన అరాచకం దేశ ఆర్ధిక పునాదులను పెకలించింది.ఐక్యతా భావాన్ని  ప్రజల హృదయాల్లో చెరిపి వేయడానికి ఆంగ్ల పాలకులు ప్రయత్నించారు.భారతదేశం అనాదిగా విదేశీ దండయాత్రలతోనే నలిగిపోయింది.
భారత దేశం శాంతి కాముకదేశం కావడం,విలువలతో మనుగడ సాగించే తత్వం వలన, భారతీయులంతా వివేకమనే విశిష్ఠగుణం కలిగి ఉండడం, ఇతర దేశాలను ఆక్రమించాలనే దుగ్ధ లేకపోవడం, హిత ప్రవచనాలతో ప్రజలంతా శాంతి,సామరస్యాలతో జీవించడాన్ని అసమర్ధత గా భావించి పాశ్చాత్యులు తమ దమన నీతితో భారతదేశాన్ని ఆక్రమించుకుని ప్రజా కంటకపాలన కొనసాగించారు. శతాబ్ధాల తరబడి కొనసాగిన విదేశీ పాలన వలన భారతీయ సంపద,మేథస్సు కొల్లగొట్టబడింది. కుట్రలను,కుయుక్తులను,విభజన రాజకీయ రణతంత్రపు కుటిల నీతిని భారతీయులకు పరిచయం చేసి, ప్రజల్లో చీలికి తెచ్చిన ఘనత పాశ్చాత్యులదే. ప్రాచీన కాలం నుండి విదేశాలకు భారత్‌ ‌తో వర్తక వాణిజ్య సంబంధాలుండేవి. అయితే ఎప్పుడైతే యూరోపియన్లు  దేశం లోకి ప్రవేశించారో ఆనాటి నుంచి భారత దేశం పలు ఆక్రమణలకు, దౌర్జన్యాలకు గురైనది. సుగంధ ద్రవ్యాల వ్యాపారం పేరుతో పోర్చుగీసు,డచ్‌, ‌ఫ్రెంచ్‌ ‌వారు దేశంలోకి అడుగుపెట్టారు. తర్వాత ఆంగ్లేయులు భారత్‌ ‌కు వచ్చి సూరత్‌ ‌లో వర్తక కేంద్రాన్ని స్ధాపించారు. ఈస్ట్ ఇం‌డియా కంపెనీ పేరుతో భారత్‌ ‌లో వలస పాలన సాగించారు.
ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇం‌డియా కంపెనీ వారి ఆగడాలు మితిమీరిపోయాయి.  బెంగాల్‌,‌బీహార్‌ ‌లను  ఆక్రమించుకుని, తర్వాత సిక్కు యుద్దం ద్వారా పంజాబ్‌ ‌ను  ,బక్సర్‌ ‌యుద్ధం తో ఒడిస్సాలను ఆంగ్లేయులు  ఆక్రమించుకోవడం జరిగింది. ఈస్ట్ ఇం‌డియా కంపెనీ ఆగడాలను ఎదురించిన  వీరులను పాశవికంగా ఉరితీసారు. స్వాతంత్య్ర పోరాటంలో భగత్‌ ‌సింగ్‌,‌రాజ్‌ ‌గురు,సుఖ్‌ ‌దేవ్‌,‌ఖుదీరాం బోస్‌ ‌వంటి విప్లవ వీరులు ఉరికంబమెక్కారు.అల్లూరి సీతారామరాజు లాంటి వారెందరో తెల్లదొరల తుపాకీ గుళ్ళకు బలైపోయారు.మనకోసం వారు చేసిన రక్తతర్పణం చిరస్మరణీయం.బ్రిటీషు పాలకుల దమన నీతిని ఎదురించడానికి భారత్‌ ‌లో ఎన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఒక వైపు సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌సారధ్యంలో సాయుధ పోరాటం,మరో వైపు  దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగిన విప్లవ పోరాటాలు బ్రిటీషు సామ్రాజ్యపు పునాదులను కదిలించాయి. భారత స్వాతంత్య్రం కోసం బెంగాల్లో కొనసాగిన జాతీయోద్యమం,బెంగాల్‌ ‌ప్రజల చైతన్యం,స్వాతంత్య్ర కాంక్ష అక్కడి మేథావుల ఆలోచనలు బ్రిటిషు వారికి కంటగింపుగా మారాయి.
బెంగాల్‌  ‌విభజనకు వ్యతిరేకంగా ఉధృతంగా ఉద్యమాలు సాగాయి.బెంగాల్‌ ‌లో ఈస్ట్ ఇం‌డియా కంపెనీకి  వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలు  స్వాతంత్య్ర సంగ్రామంలో మలుపురాయి.గాంధీ,బోస్‌,‌భగత్‌, అల్లూరి,లాలా లజపతిరాయ్‌, ‌బాలగంగాధర తిలక్‌, ‌నౌరోజీ సురేంద్రనాథ్‌  ‌బెనర్జీ వంటి వారు ఈస్ట్ ఇం‌డియా కంపెనీ కి వ్యతిరేకంగా పోరాడుతుండగా మరోవైపు భారతీయ సమాజంలో పేరుకుపోయిన రుగ్మతలను పారద్రోలి ప్రజలను ఐక్యపరచేందుకు,  రాజా రామ్మోహన్‌ ‌రాయ్‌,ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌,‌జ్యోతీరావ్‌ ‌ఫూలే,సావిత్రీ బాయ్‌ ‌ఫూలే వంటివారు కుల మతాలకతీతంగా సమభావం కోసం కృషి చేసారు. బ్రిటీషు వారు యథాశక్తి భారతీయుల మనోభిప్రాయాలతో చెలగాడమాడి,కుల,మత పరమైన ద్వేషాలను రగిలించారు. సిపాయిల మధ్య చిచ్చుపెట్టారు. మతాల మధ్య చిచ్చు పెట్టడం వంటి చర్యల ద్వారా  మనలోని అనైక్యత ను వాడుకోవాలని ప్రయత్నించారు. 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటు తెల్లదొరల మత్తును వదిలించి,ఉలిక్కిపడేలా చేసింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటీషు వారికి అన్ని విధాలా సాయం చేసి,స్వాతంత్య్రం పొందాలనే భారతీయుల ఆశ నిరాశగా మారింది.ఆంగ్లేయుల అహం చావలేదు. జనరల్‌ ‌డయ్యర్‌ ‌పాశవిక హత్యాకాండకు సజీవ సాక్ష్యం ‘‘జలియన్‌ ‌వాలా బాగ్‌’’ ‌దురంతం. ఈ దురాగతం తర్వాత  తెల్లదొరల పై ఆగ్రహం పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో సహాయం కోసం అర్ధించినా తెల్లదొరలను ఎవరూ నమ్మలేదు. ఒక వైపు క్విట్‌ ఇం‌డియా ఉద్యమం మరోవైపు బోస్‌ ‌సాయుధ పోరాటం ఆంగ్లేయులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.బోస్‌,‌భగత్‌  ‌లు సాయుధ పోరాటం వైపు చేయగా, గాంధీ అహింస ద్వారా ఉద్యమాన్ని  నడిపించారు.అతివాదులు,మితవాదుల మధ్య కాంగ్రెసు చీలింది. కవులు,సంఘసంస్కర్తలు, కళాకారులు తమ పరిధిలో స్వాతంత్య్ర సాధనకోసం కృషిచేసారు.స్వయం పాలన కోసం సాగిన ఉద్యమం భారతీయ సమాజంలోని వివిధ వర్గాలను కలుపుకుని సాగింది.సరోజినీ నాయుడు మహిళా స్వేచ్ఛకోసం,హక్కుల కోసం,అంబేడ్కర్‌  అణగారిన ప్రజలకోసం పోరాడారు.
గాంధీ ఆధిపత్యం లో భారతీయ కాంగ్రెసు నడిచినా సుభాష్‌ ‌చంద్రబోస్‌  ‌కాంగ్రెసు కు  అధ్యక్షుడిగా ఎన్నిక కావడం కాంగ్రెస్‌ ‌లో విబేధాలు రావడానికి కారణమయ్యాయి. సైద్ధాంతిక విబేధాలతో  సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీని విడిచిపెట్టి ‘‘ఆల్‌ ఇం‌డియా ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌పార్టీ’’ ని  స్థాపించారు. ‘‘అజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌’’ ‌ద్వారా స్వాతంత్య్ర కదనరంగంలో స్వైరవిహారం చేసారు. జపాన్‌, ‌జర్మనీ, రష్యాల సహాయంతో బోస్‌ ఉద్యమించాడు. ఇది చాలా మందికి నచ్చలేదు. మార్గాలు వేరైనా గమ్యం మాత్రం దేశ స్వాతంత్య్రం.ఒక వైపు గాంధీ శాంతి ఉద్యమాలు,మరో వైపు బోస్‌ ‌మిలటెంట్‌  ఉద్యమాలు,వివిధ ప్రాంతాల్లో సాగిన  సాయుధ పోరాటాలు తెల్లదొరలను ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఈ ఉద్యమాలన్నీ  భారత స్వాతంత్య్రోద్యమం తీవ్రరూపం దాల్చడానికి  దోహదం చేసాయి.
బ్రిటీషు వలస పాలనకు చరమగీతం పాడాయి.భారత స్వాతంత్య్ర  పోరాటం అనేక దేశాల్లో తెల్లదొరల దురహంకారాన్ని అణచి వేసి,రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యపు పునాదులను కదిలించింది. భారత దేశంలో శతాబ్ధాల ఆంగ్లేయుల అరాచకం  భారతీయ వీరుల ప్రాణ త్యాగాలతో 1947 లో ముగిసింది. ఎట్టకేలకు సుదీర్ఘ కాలం సాగిన బ్రిటీషు వలస పాలన అంతమై భారత దేశం స్వేచ్ఛా వాయువులను ఆస్వాదించింది.అయితే నాటి వీరుల త్యాగాలను నాటి వీరుల త్యాగాల కారణంగా సిద్ధించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకుని, కుల,మత,వర్గ ,రాజకీయ వైషమ్యాలను విడనాడి భారత సార్వభౌమత్వాన్ని,సమగ్రతను కాపాడుతూ, దేశ పురోభివృద్దికి కృషి చేయడమే స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన భారతీయ వీరులకు నిజమైన నివాళి.

– సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు)
మొ:9704903463.
తూ.గో.జిల్లా (ఆం.ప్ర)
Comments (0)
Add Comment