‘‘ఉద్యోగుల,ఉపాధ్యాయుల పోరాటం వల్ల సి పి యెస్ రద్దు అంశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.మొదట ఛత్తీస్ఘడ్, తరువాత రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ప్రస్తుతం కర్ణాటక ఇలా ఒకటి తరువాత మరొక రాష్ట్రం సిపిఎస్ రద్దు పల్లవి అందుకొని ఓ పి ఎస్ వైపు వెళ్తున్నాయి. తమిళనాడు,కేరళ,ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు సిపిఎస్ ని రద్దు చేసే ప్రయత్నంలో ఉన్నాయి.’’
ఈ మధ్య దేశవ్యాప్తంగా ఉద్యోగ,ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ గా వినిపిస్తున్న అంశం సిపిఎస్ రద్దు.సిపిఎస్ రద్దు ఇటు ఉద్యోగ,ఉపాధ్యాయుల డిమాండ్ గానే కాక అటు రాజకీయ విషయంగా కూడా మారిపో యింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో సిపిఎస్ రద్దు అంశం ప్రధాన ప్రభావం చూపి ఆయా రాష్ట్రంలో సిపిఎస్ రద్దుకై హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలు విజయం సాధించాయి. గత వారంలో కర్ణాటక ఎన్నికల్లో సైతం సి పి యెస్ రద్దుని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
దేశ వ్యాప్త ఉద్యమంగా మారి
ఎన్డీయే ప్రభుత్వం 2001-02 బడ్జెట్ లో పేర్కొన్నట్లు ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం ఇచ్చే పెన్షన్ లో మార్పులు చేయడానికి బి.కె. భట్టాచార్య నేతృత్వంలో హైపవర్ కమిటిని ఏర్పాటు చేసింది. వారి ప్రతిపాదనలను 23.08.2003 రోజున ఆమోదించి తేదీ 01.01.2004 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు సి.పి.యెస్ ని స్వచ్చందంగానే స్వీకరించటానికి అవకాశం ఇచ్చినప్పటికి చాలా రాష్ట్రాలు పోటీపడి ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.నూతన పెన్షన్ విధానంలో ఉద్యోగికి ఎంత పెన్షన్ వస్తుందనే విషయంపైన స్పష్టత లేదు.పి.ఎఫ్.ఆర్.డి ఎ యాక్ట్ 2013లో సెక్షన్ 20 లో పెన్షన్ ఎంత వస్తుందో మార్కెట్ నిర్ణయిస్తుందని పేర్కొనబడింది.అంటే ఈ సీ.పీ.ఎస్ విధానం మార్కెట్ శక్తుల కుట్రల నుంచి పుట్టిన ఒక నయా ఉదారవాద విష వృక్షం అని అర్థము అవుతుంది.
ఇది వృద్ధాప్యం లో ఉద్యోగ,ఉపాధ్యాయుల పాలిట యమపాశం గా మారింది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి నెలనెలా పెన్షన్ మారుతూ వృధ్యాప్యం లో వారి ఆర్థిక భద్రతను గాలిలో దీపంగా మార్చుతుంది.ప్రారంభంలో సిపిఎస్ రద్దు గురించి ప్రధాన ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే సిపిఎస్ రద్దు ప్రధాన ఎజెండాగా సిపిఎస్ సంఘాలు ఆవిర్భవించావో సిపిఎస్ రద్దు అంశం విస్తృతంగా ఉద్యోగుల్లోకి చేరిపోయింది.ప్రధాన సంఘాలు కూడా తమ మొదటి డిమాండ్ గా సిపిఎస్ రద్దుని పెట్టడం ప్రారంభించాయి.ఇప్పటివరకు సిపిఎస్ అమలుచేయని ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్.దేశంలో అన్ని రాష్ట్రాలు సీపీఎస్ ని అమలు చేసినప్పటికి ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాలు ఓపిఎస్ వైపు అడుగులు వేస్తున్నాయి.ఉద్యోగుల,ఉపాధ్యా
కేంద్రం కమిటీ వేయడం నాటకం
దేశవ్యాప్తంగా సిపిఎస్ రద్దు ఉద్యమం ఉదృతం కావడం,రాజకీయంగా నష్టం జరుగుతుండడం వల్ల కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. కేవలం కంటితుడుపు చర్యల్లో భాగంగా సిపిఎస్ ని మెరుగుపరిచే అంశాన్ని పరిశీలించుటకు కేంద్ర ఆర్థిక కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని వేసింది. కమిటీ వేయడం అంటేనే కాలా యాపన అని అందరికీ తెలుసు.ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆడుతున్న నాటకం.రాష్ట్రాలు సిపిఎస్ ని రద్దుచేసి ఓపిఎస్ వైపు వెళ్తుంటే కేంద్రం మోకాలు అడ్డుతూ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎట్టి స్థితుల్లో వెనక్కి ఇవ్వవడానికి పి ఎఫ్ ఆర్ డి ఎ చట్టం ఒప్పుకోదని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. సీపీఎస్ ని రద్దు చేయమని ఉద్యోగులు కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ మెరుగు పరిచే అంశంపై కమిటీ వేయడం అంటే సిపిఎస్ పై కేంద్ర వైఖరి ఎలాంటిదో ఉద్యోగ,ఉపాధ్యాయులు అర్థము చేసుకోవాలి.
సిపిఎస్ రద్దన్న పార్టీలకె మద్దతు
సిపియెస్ రద్దు చేస్తామని పేర్కొన్న పార్టీలకే ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తుంది.ఉద్యోగుల ఓట్లు గంపగుత్తగా పడటం వల్ల ఆయా పార్టీలు ఘన విజయం సాధిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్,కర్ణాటక ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. కర్ణాటక ఎన్నికల్లో సి పి యెస్ రద్దుని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో సైతం మెజార్టీ కనభరిచింది.గతంలోకంటే కేవలం ఐదు శాతం ఓట్లతోనే గతం కంటే సుమారు 56 స్థానాలను ఎక్కువగా గెల్చుకుంది.సుమారు ఐదు లక్షలు గా ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాల మొత్తం 35 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకే గంపగుత్తాగా పడ్డాయని ఉద్యోగ వర్గాల అభిప్రాయం.
పోరాడడానికి సరైన సమయం
మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఈ విధానాన్ని ఎంపిక చేసుకొని 2004 సెప్టెంబర్ 1నుంచి జీ.ఓ.ఎం.యెస్ నెంబర్స్ 653,654,655 ల ద్వారా అమల్లోకి తేవడం జరిగింది.ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న రెవిజేడ్ పెన్షన్ రూల్స్-1980,653 జీవో ద్వారా వర్తించకుండా పోయి ఉద్యోగ,ఉపాధ్యాయులు గ్రాట్యుటీ కోల్పోయారు.654 జీ ఓ ద్వారా జీ పి ఎఫ్ రోల్స్ -1935 వర్తించకుండా పోయి పాత పింఛన్ కోల్పోయారు.655 జీఓ ద్వారా ఉద్యోగి జీతం నుండి సి.పి.యెస్ చందా వసూళ్లు చేసుటకు అధికారం ఇవ్వబడింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త తెలంగాణ ప్రభుత్వం కూడా జీ.ఓ.ఎం.ఎస్ నెంబర్ 28 డేటెడ్ 23/ 8/ 2014 ద్వారా కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కిం ను(నూతన పెన్షన్ విధానాన్ని) అంగీకరిస్తూ కొనసాగించడానికి ఒప్పుకుంది. ప్రారంభంలో మన రాష్ట్రంలో సిపియెస్ ని ప్రధాన సంఘాలు పట్టించుకోలేవు.
ఎప్పుడైతే సిపిఎస్ సంఘాలు ఆవిర్భవించి ఉద్యమాన్ని ఉదృతం చేశాయో ప్రధాన సంఘాలు కూడా తమ డిమాండులలో మొదటి అంశంగా సీపీఎస్ రద్దు అంశాన్ని పెట్టడం ప్రారంభించాయి.దీనితో కోల్పోయిన గ్రాట్యూటీ మరియు ఫ్యామిలి పెన్షన్ సాధించగలిగారు. అయితే ఇప్పటివరకు రాష్టంలో సిపిఎస్ రద్దు చేస్తామని,కనీసం ఆలోచిస్తామని కూడా ఏ రాజకీయ పార్టీ ప్రకటించలేదు. కేవలం ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రద్దు చేయడానికి కృషి చేస్తామని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఇదే సరైన సమయం.సీపీఎస్ సంఘాలు ఉద్యమాన్ని ఉదృతం చేయాలి. ఏ పార్టీ అయితే సిపియెస్ ని రద్దు చేస్తామని మేనిపేస్టోల్లో పెట్టి గట్టి హామీ ఇస్తుందో ఆ పార్టీలకే ఉద్యోగుల వోటు అని తీర్మానాలు చేయాలి.అప్పుడైతేనే అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో సిపిఎస్ పై తమ వైఖరి చెప్పవలసి ఉంటుంది.ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది.ఈ ఆరు నెలల్లో దశాల వారీగా అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమ నిర్మాణాన్ని రూపొందించుకోవాలి.పంజాబ్,హిమా
పింఛన్ ఉద్యోగి హక్కు
దేవకినందన్,నకర కేసుల్లో సుప్రీంకోర్టు పెన్షన్ ప్రభుత్వాలిచ్చే బిక్షకాదని జీవితకాలం పనిచేసినందుకు పొందే ఉద్యోగి హక్కు అని పేర్కొంది. పెన్షన్ పై ఫోర్త్ పే కమిషన్ అనుకోకుండా(మరణం) జరిగే, అనుకోని(వృద్ధాప్యం)జరిగే సంఘటనలకు సామాజిక భద్రత కల్పించడంమే పెన్షన్ ముఖ్య లక్ష్యంగా పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 సామాజిక భద్రత కల్పించాలని పేర్కొంటోంది, ఆర్టికల్14 పౌరుల మధ్య సమానత్వం గురించి పేర్కొంటుంది. ఈ విధంగా రాజ్యాంగం లో పేర్కొన్న సామాజిక భద్రత, సమానత్వం అనే విషయాలను ఈ నూతన పెన్షన్ విధానం ఉల్లంగిస్తుంది. ఈ మధ్య కాలంలో అన్ని రాజకీయ పార్టీలు పౌరుల సామాజిక భద్రత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్,రైతు బీమా,రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి,కంటి వెలుగు.. ఇలా సంక్షేమ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.అయితే 30 సంవత్సరాలకు పైగా ప్రభుత్వం లో పని చేసిన ఉద్యోగికి ఇచ్చే సీపీఎస్ పింఛన్ ఆసరా పింఛన్ కన్నా అద్వనంగా ఉండి,సిపిఎస్ ఉద్యోగులను వృధ్యాప్యంలో అధోగతి పాలు చేస్తుంది.
సిపిఎస్ రద్దు ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ప్రయోజనకరమే.సీపీఎస్ రద్దు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్లు రూపాయలు కార్పస్ ఫండ్ రూపంలో ఖజానాలో జమఅయ్యే అవకాశం ఉంది.ప్రభుత్వం తన వాటా కింద నెల నెల చెల్లిస్తున్న సుమారు 200 కోట్ల రూపాయలు చెల్లించవలసిన అవసరం లేదు.జీపీఎస్ రూపంలో వందలకోట్లు ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి.తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రథమ డిమాండ్ అయిన సీపీఎస్ ని రద్దు చేసి ,ఓపిఎస్ పునర్ధరణ చేపట్టాలి.ఫ్రెండ్లీ ప్రభుత్వమనే మాటను నిలుపుకోవాలి.
జుర్రు నారాయణ యాదవ్
తెలంగాణ టీచర్స్ యూనియన్
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
మహబూబ్నగర్, 9494019270.