- జీతాలు పెంచాలంటూ విధులు బహిష్కరణ
- చర్చలు జరుపుతున్న ఏజెన్నీ సంస్థ
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి3: హైదరాబాద్ మెట్రోకు కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె సెగ తగిలింది. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ మెట్రో రైలు టికెట్ కౌంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. వెంటనే జీతాలుపెంచాలని డిమాండ్ చేశారు. మెట్రోస్టేషన్ల వద్ద టికెటింగ్ ఉద్యోగులు ధర్నాలకు దిగి.. తమ నిరసన తెలిపారు. ఇటు అర్ పేట లోని మైత్రివనం వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. గత ఐదేళ్లుగా ప్రతి నెల 11 వేల రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారని.. వేతనాలు పెంచమంటే పట్టించుకోవడం లేదని సమ్మె చేపట్టిన కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొరోనా ప్రభావంతో ఐదేళ్లలో అన్ని ధరలు పెరిగినా తమకు జీతాలు మాత్రం పెరగకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కనీస వేతనం రూ.15 వేల నుండి రూ.18 వేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్లుగా కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ కియోలిస్ హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు, స్టేషన్స్ బాధ్యతలు చూస్తోంది.
ఈ బాధ్యతలను ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ.. సబ్ కాంట్రాక్టు ద్వారా కియోలిస్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థే ఉద్యోగ నియమాకాలు చేపట్టింది. అయితే.. జీతాల విషయంలో మాత్రం కియోలిస్ సంస్థ నిరక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఇటు అర్ పేట్ మెట్రోస్టేషన్ లో కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన చేపట్టారు. హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్ట్ లో పని చేస్తున్న 300 మంది కాంట్రాక్టు ఉద్యోగులు తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్రోస్టేషన్స్ లో టికెటింగ్, మెయింటెనెన్స్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల విషయంలోనూ తమకు చాలా సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరో రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదంటున్నారు. మరోవైపు అర్ పేట, మియాపూర్ మెట్రోస్టేషన్లలో ప్రయాణికులు టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మరోవైపు మెట్రో కాంట్రాక్టు సిబ్బంది ఆందోళనలపై కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ కియోలిస్ స్పందించింది. కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి..హైదరాబాద్ మెట్రో ట్రైన్ కార్యకలాపాలకు అవాంతరాలు కలిగించారని హెచ్ఎంఆర్ మేనేజ్మెంట్ ఆరోపించింది. మెట్రోట్రైన్ ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని పేర్కొంది. సిబ్బందికి తగిన వసతులు, ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపింది. ధర్నా చేస్తున్న ఉద్యోగులతో కాంట్రాక్టు సంస్థ చర్చలు జరపనుంది. మెట్రో ట్రైన్ కార్యకలాపాలు నిర్ధేశిత సమయానికే నడుస్తున్నాయని తెలిపింది. మెట్రో టికెటింగ్ సిబ్బందితో కియోలిస్ ఏజెన్సీ ప్రతినిధుల చర్చలు జరుపుతున్నారు. మరోవైపు మెట్రోస్టేషన్ కింద కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.