వోడినా, గెలిచినా మేమెప్పుడూ ప్రజలవైపే..

ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాం..
లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం చెప్పాలి..
పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన బిజెపి
వారికి చెపుకోవడానికి పథకాలు లేవు..
అందుకే చీరలు, చిత్రపటాలు, అక్షింతల పంపిణీ
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ రావు

కొడంగల్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : ఎన్నికల్లో వోడినా, గెలిచినా తాము నిరంతరం ప్రజల వైపే ఉన్నామని, ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికల హామీల అమలు చేసేవారకు పోరాడాల్సిన బాధ్యత తమపైన ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు.  సోమవారం కొడంగల్‌ కోస్గిలో నిర్వహించిన మహబూబ్‌ నగర్‌ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం లో హరీష్‌ రావు మాట్లాడుతూ.. ప్రజల కష్టాల గురించి రాస్తున్న కొడంగల్‌ జర్నలిస్టులకు బెదిరింపులు వొస్తున్నాయని అన్నారు. పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి వంద పథకాలను అమలు చేసిందని, మరి బీజేపీ చేసింద ేమిటని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందని మండిపడ్డారు.

20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి 6 లక్షలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.  చెప్పుకోడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, అక్షింతలు, చీరలు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు, నోవదయ స్కూళ్లు ఇవ్వకుండా మొండిచేయి చూపించారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, కరువు కాటకాలతో అల్లాడే ఈ ప్రాంతానికి కేసీఆర్‌ నీళ్లు ఇచ్చారని, ఆరునెలల్లో పూర్తికావాల్సిన కరివెన ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్‌ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వంద రోజులు దాటినా ఆ ఊసే మరిచిపోయిందన్నారు.

సీఎం నియోజకవర్గంలోనే 2 లక్షల రుణమాఫీ కాలేదని, రైతులకిచ్చిన 15 వేల రైతు బంధు, వడ్లకు, మక్కలకు 500 బోనస్‌ ఇవ్వలేదని, రైతులు చేసేదేం లేక 1700లకు అమ్ముకుంటున్నరని తెలిపారు. కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ఇవ్వని హామీలను కూడా అమలు చేశారని, 24 గంటల ఉచిత కరెంట్‌, రైతు బీమా, రైతు బంధు ఇచ్చారని తెలిపారు. ఆసరా పింఛన్‌ 4 వేలు ఇస్తామని రేవంత్‌ అవ్వా తాతలను కూడా మోసం చేశాడని, నెలకు 2500 ఇస్తామని మహిళలను మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్‌ వోట్లడగడానికి వొస్తే నాలుగు నెలలకు కలిపి 10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయాలని కోరారు. నిరుద్యోగులకు 4 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, రేవంత్‌  అసలు ఆ హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని తెలిపారు.

కల్యాణలక్ష్మి కింద ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టారని,  కేసీఆర్‌ కిట్లు బంద్‌ అయ్యాయని, కొత్త పథకాలు లేవని, పైగా కోత పథకాలు వొస్తున్నాయని హరీష్‌ రావు ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయడం చేతకాక ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.  రైతులు, పేదలు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులను..అన్ని వర్గాలను కాంగ్రెస్‌ మోసం చేసిందని అన్నారు. హకీంపేట, ఎర్రంపల్లి వంటి నాలుగు గ్రామాల రైతుల భూములను ఫార్మా కంపెనీ కోసం లాక్కుంటున్నారని తెలిపారు. పొల్యూషన్‌ కంపెనీ మాకొద్దని ప్రజలు అంటున్నారని, తాము రైతులకు అండగా ఉండి పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మెడలు వంచి హామీలను అమలు చేయాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వోటు వేసి మన్నె శ్రీనివాస్‌ రెడ్డిని గెలిపించుకోవాలని హరీష్‌ రావు పిలుపునిచ్చారు.

Breaking News Nowfarmer minister mla harees raoprajatantra newstelangana updatestelugu kavithaluToday Hilights
Comments (0)
Add Comment