- దర్యాప్తు సంస్థలను మాపై ఆయుధాలుగా ఉపమోగిస్తున్నారు
- పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య పునాదులపై ప్రతికూల ప్రభావం
- భారత ప్రధాన న్యాయమూర్తికి పలు మీడియా సంస్థల లేఖ
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 5 : ప్రభుత్వం దేశంలోని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ తమపై దాడులు చేయిస్తూ వాటిని ఆయుధాలుగా ఉపమోగించుకుంటున్నదని ఆరోపిస్తూ పలు మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంస్థలు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్కు లేఖ రాశాయి. దర్యాప్తు సంస్థలు జర్నలిస్టులను విచారించడంలో భాగంగా వారి నుంచి పత్రాలు, హార్డ డిస్క్లు, ఫోన్లు, ల్యాప్ టాప్లు వంటి వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక విధివిధానాలను రూపొందించాలని కోరుతూ మీడియా సంస్థలు సీజేఐకి లేఖ రాశాయి. జర్నలిస్టులపై ప్రతీకార దాడులు జరుగకుండా వారు నిజాలు మాట్లాడగలిగితేనే దేశంలో స్వేచ్ఛ మనగలుగుతుందని మీడియా సంస్థలు తమ లేఖలో పేర్కొన్నాయి. ఇటీవల దిల్లీ పో•లీసులు న్యూస్ క్లిక్ ఆన్లైన్ పోర్టల్లో పని చేసే 46 మంది సిబ్బంది ఇళ్లలో సోదాలు చేసి, పోర్టల్ వ్యవస్థాకుడు ప్రబీర్ పుర్కాయస్థను అరెస్టు చేసిన అంశాన్ని కూడా మీడియా సంస్థలు తమ లేఖలో ప్రస్తావించాయి.
దర్యాప్తు సంస్థలను తమపై ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని లేఖలో ఆరోపించాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి జర్నలిస్టులు రాసే వార్తలు ప్రభుత్వం అంగీకరించడం లేదు కనుకనే రాసిన జర్నలిస్టులను కట్టడి చేసేందుకు సోదాల పేరిట ప్రతీకార దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని పేర్కొన్నాయి. జర్నలిస్టులు చట్టానికి అతీతులేమీ కారని, అలా తాము కోరుకోవడం లేదని, అయితే పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే మాత్రం అది మన ప్రజాస్వామ్య పునాదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నాయి. అయితే జర్నలిస్టులుగా ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని సిజెఐకి రాసిన లేఖలో మీడియా సంస్థలు స్పష్టం చేశాయి. ఇక మీడియా క్లిప్పై దాడులకు సంబంధించి ప్రపంచ దేశాలు కూడా తమ స్పందన ద్వారా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న సందర్భంలో మీడియా సంస్థలు సీజేఐకి రాసిన లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది.




