ప్రపంచవ్యాప్తంగా..70,00,000 కొరోనా పాజిటివ్ కేసులు
- రోజురోజుకు విజృంభిస్తున్న వైరస్
- అమెరికా, దక్షిణాసియా దేశాల్లోనే 75 శాతం కేసులు
- తీవ్ర నిర్లక్ష్యమే కారణమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రపంచవ్యాప్తంగా కొరోనా కేసులు తీవ్ర మవుతున్నా యని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. ఆదివారం ఒక్కరోజే ప్రపంచంలో 1,36,000 కరోనా కేసులు పెరిగినట్లు వెల్లడించారు. ఇందులో అమెరికా, దక్షిణాసియాలోని పది దేశాల్లోనే 75 శాతం కేసులు ఉన్నాయని చెప్పారు. గత తొమ్మిది రోజుల్లో లక్ష మందికి వైరస్ సోకినట్లు తెలిపారు. ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పటివరకు 4,03,000 మందిని పొట్టనపెట్టుకుందని, 70 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. చైనా తర్వాత తూర్పు ఆసియా కరోనాకు కేంద్రంగా మారిందని, అనంతరం అది యూరప్ ఖండానికి విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం కరోనాకు ప్రధాన కేంద్రంగా ఉన్న అమెరికా వాటిని అధిగమించిందని తెలిపారు. అమెరికాలో జరుగుతున్న జాతివ్యతిరేక ఆందోళనలతో వైరస్ మరింతగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కొన్ని దేశాల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నదని, మరికొన్ని దేశాల్లో కేసుల సంఖ్య వెయ్యిలోపే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయని, అయితే నిర్లక్ష్యమే వారికి ముప్పుగా మారే అవకాశం ఉందన్నారు. ఐరోపాలో పరిస్థితి మెరుగు పడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇది మరింత దిగజారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి మరింత దిగజారుతోందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు70 లక్షలను మించడంతో ఆందోళన వ్యక్తం చేసిన సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు. అమెరికా, దక్షిణ ఆసియాలోని 10 దేశాలనుంచి 75శాతం కేసులు నమోదయ్యాయంటూ విలేకరుల సమావేశంలో టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 రోజులలో తొమ్మిది రోజుల కాలంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఆఫ్రికాలో చాలా దేశాలలో 1,000 కంటే తక్కువ కేసులు ఉన్నప్పటికీ, చాలా దేశాల్లో కొత్త ప్రాంతాల్లో విస్తరణ సహా కేసుల పెరుగుదల నమోదవుతోందని టెడ్రోస్ చెప్పారు. అదే సమయంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని టెడ్రోస్ చెప్పారు. అయితే ఈ దేశాలలో అతిపెద్ద ముప్పు నిర్లక్ష్యమేనని టెడ్రోస్ పేర్కొన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది.