- పార్లమెంటులో చర్చకు టిఆర్ఎస్ పట్టు
- వాయిదా తీర్మానాల ప్రతిపాదన..స్పీకర్ తిరస్కరణ
- సభ నుంచి టిఆర్ఎస్ ఎంపిల వాకౌట్
- 8 ఏళ్లుగా వర్గీకరణను కేంద్రం తొక్కిపెట్టింది
- వి•డియా సమావేశంలో టిఆర్ఎస్ ఎంపిల విమర్శ
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 31 : ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా తీర్మానం చేసి 8 ఏళ్ళు అవుతున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. 2014లో అధికారంలోకి వొచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామంటూ చెప్పిన బీజేపీ చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు. ప్రతీ అంశంలో తమ పెత్తనం ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అన్ని విషయాల్లో ఇబ్బందులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై చర్చించాలని గురువారం పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అధికారం మాకివ్వండి…24 గంటల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. లోక్సభలో చర్చించేందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో వాకౌట్ చేసిన టీఆర్ఎస్ ఎంపీలు, పార్లమెంట్ నుండి నేరుగా తెలంగాణభవన్ చేరుకుని మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ..
గత 8 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వం ఎస్సీలను అణగదొక్కింది. 2006లో అద్వానీ, 2010లో నితిన్ గడ్కరీలు ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ అప్పటి ప్రధాని మన్మోహన్కు లేఖలు రాశారు. అయితే అధికారంలోకి వొచ్చిన తర్వాత మాత్రం అణగారిన కులాలను అణగదొక్కుతున్నారు. రాజ్యాంగ సవరణ చేసే అధికారం కేంద్రం దగ్గరే ఉంది. లేదంటే ఆ అధికారం రాష్ట్రాలకు అప్పగించండి. 24 గంటల్లో ఈ అంశాన్ని పరిష్కరించుకుంటాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీలకు మాయమాటలు చెప్పి ఆడుకుంటున్నారు. ఎస్సీల మేలుకోరి తెలంగాణలో ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలి. అణచివేత, అంటరానితనం, వివక్షకు గురైన ఎస్సీలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీ రాములు మాట్లాడుతూ…షెడ్యూల్డ్ కులాల్లో ఒక వర్గమే ప్రయోజనం పొందింది. మిగతా కులాలకు ప్రయోజనాలు దక్కలేదు. దామాషా ప్రకారం షెడ్యూల్డ్ కులాల్లో అందరికీ సమన్యాయం జరగాలి. 15 శాతం ఉన్న ఎస్సీ కోటాను ఏబీసీడీగా వర్గీకరిస్తూ 1, 7, 6, 1 శాతంగా కేటాయింపులు జరిపింది. వర్గీకరణ కోసం ఆర్టికల్ 341ను సవరణ చేయాల్సి ఉంటుందని సూచించారు.
అధికారంలోకి వొచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేపడతామన్న బీజేపీ ఇన్నేళ్లు గడిచినా స్పందించట్లేదు. అసెంబ్లీ తీర్మానం మాత్రమే కాదు, వర్గీకరణ చేయాలంటూ తెలంగాణ సీఎం రెండు సార్లు ప్రధానికి లేఖ కూడా రాశారు. కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని సవరించిన కేంద్రం, ఈ విషయంలో ఎందుకు చేయడం లేదు? తెలంగాణ రాష్ట్రంలోని దళితులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి దళితుల్లో అసమానతలను తొలగించే చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు స్థాయిని మించి మాట్లాడుతున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసినప్పుడు ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసెంబ్లీలోనే ఉన్నారని, ఆయనకు మొత్తం విషయాలు తెలిసినా ఏమాత్రం సహకరించట్లేదని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలు తెలంగాణ బీజేపీ ఎంపీలను గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకొని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.
బీజేపీ నేతలు స్థాయిని మించి మాట్లాడుతున్నారని, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వెంటిలేటర్పైకి ఎక్కారని ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. అయితే నిన్న, మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వొచ్చిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ చరిత్ర గురించి చెప్పడం హాస్యాస్పదమని ఎంపీ రంజిత్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమా లేక షీ టీమా అనేది తేల్చుకోవాలన్నారు. కాగా చారిత్రక కారణాల వల్ల ఎస్సీల్లో మాలలు ముందంజలో ఉన్నారని, పెద్ద సంఖ్యలో ఉన్న మాదిగలు సహా ఇంకా అనేక ఎస్సీ కులాలకు ప్రయోజనాలు అందడం లేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు అన్నారు. అందుకే ఏబీసీడీ వర్గీకరణ చేసి సమన్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నామని తెలిపారు. తాము ఏది అడిగినా కేంద్రం సరే అనటమే తప్ప చర్యలు మాత్రం చేపట్టడం లేదని కేకే మండిపడ్డారు.