- దీనిపై సిఎం ఎందుకు స్పందించడం లేదు
- కెసిఆర్ ప్రతి మాట ప్రజల్ని తప్పుదోవ పట్టించేదే
- ధాన్యం కొనుగోలుపై కెసిఆర్ రాజకీయం
- తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం
- బిజెపిలో టిఆర్ఎస్ నేత బిక్షమయ్య గౌడ్ చేరిక సందర్భంగా బండి సంజయ్
- బీజేపీ గెలుపు కోసం నా వంతు కృషి చేస్త : భిక్షమయ్యగౌడ్
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : కెసిఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, ఆయన వల్ల తెలంగాణలో రైతులు ఇబ్బంది పడుతున్నరని, ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెబుతున్నా వినకుండా కెసిఆర్ రాజకీయం చేస్తున్నరని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలన కొనసాగుతుందని, ఈ అరాచక పాలనను చూసి ప్రజలు విసిగిపోయారని అన్నారు. టీఆర్ఎస్ పాలనను అంతం చేసేందుకు ఇదే ఆఖరి పోరాటం కావాలని, అందుకోసం బీజేపీ చేపడుతున్న పోరాటానికి ప్రజలంతా అండగా నిలిచారని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించే ఇతర పార్టీల నేతలంతా కేసీఆర్ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతోపాటు బీజేపీ గెలుపు కోసం తమవంతు క్రుషి చేయాలనే సంకల్పంతో పార్టీలోకి వొస్తున్నారని, వారందరికీ హృదయ పూర్వకంగా బీజేపీలోకి స్వాగతిస్తున్నామని బండి సంజయ్ అన్నారు.
ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ సహా ఆయన అనుచరులు మంగళవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. భిక్షమయ్యకు తరుణ్ చుగ్ కాషాయం కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..ఆలేరు భిక్షమయ్య గౌడ్ సహా ఆయన అనుచరులంతా బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణలో బీజేపీ గెలవాలని కార్యకర్తలంతా పోరాడుతున్నరని అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏం తప్పు చేశారని అయన మీద ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారని మీడియా బండి సంజయ్ను ప్రశ్నించగా …టీఆర్ఎస్ నేతలే తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, సీఎం నోటి నుండి వొచ్చిన హామీలేవీ నెరవేరలేదని, ఆయన ఏం హామీలిచ్చారో ప్రగతి భవన్ ముందు ప్రొజెక్టర్ పెట్టి చూపాలని అన్నారు.
రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వ నాశనం చేసిండని బండి సంజయ్ మండిపడ్డారు. ఐతే అసలు ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. కెడుకు సీఎం సీటు కోసం డాడీ డాడీ అంటుంటే….కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ధాన్యం పేరుతో డ్రామాలాడుతున్నరని బండి సంజయ్ పాత పాటే పాడారు. ప్రజల చర్చలను దారి మళ్లించేందుకే ధాన్యం పేరుతో నాటకాలు ఆడుతున్న కెసిఆర్ తెరాస నాయకులు..జంతర్ మంతర్లో కాదు విదేశాల్లో ధర్నాలు చేసుకున్నా వొచ్చే ఇబ్బందేమీ లేదని, తాము ధాన్యం కొనబోమని చెబితే కదా సమస్య ….కేంద్రం ఎంత రారైస్ ఇచ్చినా కొనేందుకైనా సిద్ధంగా ఉందని పీయూష్ గోయల్ కూడా పార్లమెంట్లో ప్రకటించారని చెప్పిందే మళ్ళీ చెప్పారు.
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతున్నా కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదు
తెలంగాణాలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా కొనసాగుతుందని, దీని గురించి సీఎం కెసిఆర్ ఎందుకు స్పందించడం దని బండి సంజయ్ ప్రశించారు. డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలేవని ప్రశ్నింయారు. మొక్కుబడిగా సమావేశాలు పెట్టి హడావుడి చేయడం తప్ప అసలు సమస్యను పరిష్కరించిన దాఖాలాల్లేవనివాయన విమర్శించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ బాటే తమ బాటన్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బాబూ జగ్జీవన్ రామ్ నాడు అంటరానితనానికి వ్యతిరేకంగా, సామాజిక సమానత్వానికి మద్దతుగా పోరాటాలు చేయడమే కాకుండా సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న దళిత దీన జనుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడని బండి సంజయ్ కొనియాడారు. సామాజిక న్యాయం సాధించాలంటే ముందుగా కుల వివక్షకు అడ్డుకట్టవేయాలని నమ్మడమే కాకుండా ఆ దిశగా ఎనలేని కృషి చేసిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు.
జనతా పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రామ్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా జనతా పార్టీ ఆనాడే ప్రకటించి దళితుల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని అన్నారు. అందరితోనూ ఆప్యాయంగా బాబూజీ అని పిలిపించుకున్న డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ నడిచిన బాట.. అనుసరించిన ఆదర్శాలు..చూపిన సంస్కరణ మార్గాలను అనుసరించడమే ఆయనకు మనం అందించే ఘనమైన నివాళి అని మీడియా సమావేశాన్ని బండి సంజయ్ ముగించారు. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ….తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉందని అన్నారు. మాజీ ఎంపీపీలు, ముఖ్య కార్యకర్తలతో కలిసి తాను బీజేపీలో చేరానని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉంటదనే ఉద్దేశంతో 2018లో టీఆర్ఎస్ లో చేరానని కానీ నాటి నుండి బడుగు, బలహీనవర్గాలకు ఆత్మగౌరవం లేకుండా తెరాస చేసిందని, బలమైన నాయకులను బలహీనపర్చి వాళ్ల కాళ్లకు బంధాలు వేస్తున్నరని ఆయన ఆరోపించారు.
రెండున్నరేళ్లుగా తాను టీఆర్ఎస్లో అనేక ఇబ్బందులను ఎదుర్కున్నానని, మోదీ నాయత్వంలో దేశంలో అద్భుతమైన పాలన సాగుతుందని, తెలంగాణలో కూడా బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నరని బిక్షమయ్య గౌడ్ అన్నారు. బీజేపీ గెలుపులో భాగస్వాములం కావాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరానని తెలిపారు. తరుణ్ చుగ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తరుణ్ చుగ్, బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్, పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు సంకినేని వెంకటేశ్వర్ రావు, శ్యాంసుందర్, దాసరి మల్లేశం తదితరులు హాజరయ్యారు.