- గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో వైద్య ఆరోగ్య శాఖ ఆరా
- జీహెచ్ఎంసీ సర్వేపై అనుమానాలు
- గ్రేటర్లో గత వారం రోజుల్లో 292 కేసులు
- మూడు జిల్లాల్లో సర్వే ప్రారంభించిన ఐసీఎంఆర్
- యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై మంత్రి ఈటల సమీక్ష
రాష్ట్రంలో కొరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసులలో 80 శాతానికి పైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటంతో వైద్య ,ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గత వారం రోజులలో ఇక్కడ 292 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదవుతున్న ఎల్బీనగర్, మలక్పేట, వనస్థలిపురం, చార్మినార్, కార్వాన్, జియాగూడ ప్రాంతాలను ఇప్పటికే కంటైన్మెంట్జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల నుంచి ఎవరూ బయటికి రాకుండా ఇతర ప్రాంతాల నుంచి బయటి వ్యక్తులు ప్రవేశించే వీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ సైతం గ్రేటర్ హైదరాబాద్లో పెరుగుతున్న కొరోనా కేసులపై ప్రత్యేకంగా పలుమార్లు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కేవలం గ్రేటర్పైనే ప్రత్యేక దృష్టి సారించి కొరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని ఆదేశించారు. అయినప్పటికీ ముఖ్యంగా గత వారం రోజులుగా గ్రేటర్ పరిధిలో ప్రతీ రోజూ 30కి పైగానే కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అసలు లోపం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని అంశాలపై దృష్టి సారించారు. గతంలో హాట్స్పాట్ కేంద్రాలుగా గుర్తించిన, ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలలో జీహెచ్ఎంసి వైద్య సిబ్బంది సర్వే నిర్వహించారు. అసలు ఈ సర్వే ప్రణాళికాబద్దంగా ఉందా లేదా అన్న కోణంలో విచారిస్తున్నారు. గతంలో జీహెచ్ఎంసి సిబ్బంది ఈ ప్రాంతాల్లో ర్యాండమ్ సర్వే నిర్వహించినట్లుగా గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇకపై తామే స్వయంగా మరోమారు సర్వే నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
హాట్స్పాట్ కేంద్రాలు, కంటైన్మెంట్ జోన్లలో పాజిటివ్గా నిర్ధారణ అయిన వారు ఎక్కడెక్కడ సంచరించారు ? వారి వల్ల ఎంతమందికి వైరస్ వ్యాప్తి చెందింది అనే సమాచారాన్ని ప్రధానంగా సేకరిస్తున్నట్లు సమాచారం. అలాగే, సెకండరీ కాంటాక్ట్లపై కూడా ఆ శాఖ అధికారులు సమగ్రంగా పరీక్షలు జరుపుతున్నారు. కొరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ద్వారా సంక్రమించిన మరికొందరు ఇంకా ఎంతమందితో సన్నిహితంగా మెలిగారు అనే అంశాలను ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా, ఐసీఎంఆర్ సైతం రాష్ట్రంలో సర్వే చేపట్టింది. ఎంపిక చేసిన మూడు జిల్లాలలో రెండు బృందాలుగా విడిపోయి సర్వే నిర్వహిస్తున్నారు. జనగామ, కామారెడ్డి, నల్లగొండ జిల్లాలలోని 30 గ్రామాలలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. 0 నుంచి 5 సంవత్సరాలు, అలాగే, 18 ఏళ్లు పైబడిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు జలుబు, దగ్గు, జ్వరం వంటి కొరోనా లక్షణాలు ఉన్న వారికి శ్వాబ్ నమూనాలు సేకరించడం ద్వారా వ్యాధిని నిర్ధారిస్తుండగా, ఐసీఎంఆర్ ఈ లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపిస్తున్నట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ హేమలత వెల్లడించారు.
యాక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాలపై మంత్రి ఈటల ఆరా హైదరాబాద్లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పనిచేస్తున్న నోడల్ అధికారులు, వైద్యులతో మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితిని సమీక్షించారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వల్లనే గత వారం రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు వారు మంత్రికి వివరించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామనీ, ఒకవేళ లక్షణాలు ఎక్కువ ఉన్న, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు మాత్రం ఆసుపత్రులలో ఉంచి చికిత్స అందించాలన్న ఐసీఎంఆర్ సూచనల మేరకు వ్యవహరిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ తాజాగా పలు కీలక మార్పులతో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ విడుదల చేసిందనీ వీటి ప్రకారం డిశ్చార్జ్ పాలసీ, హోమ్ ఐసోలేషన్, డెత్ గైన్లైన్స్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని మంత్రి ఈటల చెప్పారు.