ఐటిడిఏ ద్వారా గిరిజన సంక్షేమ అభివృద్ది పథకాలు గిరిజనులకు సకాలంలో అందేవిధంగా కృషి చేయాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటిడిఏ సమావేశ హాలులో ప్రజవాణి గిరిజన దర్బారు ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా మారుమూల ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై గిరిజనులు ఇచ్చిన అర్జీలను స్వీకరించి పరిష్కార దిశగా సంబంధిత యూనిట్ అధికారులకు ఎండార్స్ చేసారు. ఈ సందర్బంగా పిఓ మాట్లాడుతూ ప్రతీ సోమవారం గిరిజన దర్బారుకు యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని , గిరిజనులు అందించిన దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కారానికై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా అటవీ హక్కులు గిరి వికాసం పై అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తునందున సంబంధిత యూనిట్ అధికారులతో రెండు కౌంటర్స్ ఏర్పాటు చేసి గిరిజనులు అందించిన దరఖాస్తులను స్వీకరించి వారికి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేసవికాలం దగ్గర పడుతున్నందున సంబంధిత అర్డబ్ల్యూఎస్ అధికారులు గిరిజన గ్రామాలలో పర్యటించి గిరిజన గ్రామాలలో తగొట్టపు బావులు చేతి పంపులు మరమత్తులు చేపట్టి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
విద్య, వైద్యం, పోడు భూములు ట్రైకార్ , విద్యుత్, గిరి వికాసం , వ్యవసాయం ఉద్యానవసం పై గిరిజనులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిడి జహీరుద్దీన్, ఏఓ భీమ్, ఏడియం హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎస్ఓ సురేష్ బాబు, ఆర్సిఓ బురాన్, జిసిసి డియం కుంజా వాణి, ఏపిఓ పవర్ అనురాధ, ఏడి అగ్రికల్చర్ సుజాత, పియంఆర్సి రమణయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.