పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం
టిఆర్ఎస్ సభ్యత్వమున్న ప్రతి కార్యకర్తలకు ప్రమాద బీమా: మంత్రి హరీష్రావు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం కలి ఉన్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందనీ, పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇలా ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఆనంతసాగర్ గ్రామానికి చెందిన పోత రాజు అఖిల్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. అఖిల్కు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో ప్రమాద బీమా వర్తించిందనీ, ఇందుకు సంబంధించి రెండు లక్షల చెక్కును మంత్రి హరీష్ రావు మృతుని కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి 2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు సిద్దిపేట నియోజకవర్గంలో 18 మంది కార్యకర్తల కుటుంబాలకు ఈ ఇన్సూరెన్స్ చెక్కులు అందించామని, కొత్తగా మరో ఒక కార్యకర్తకు బీమా మంజూరైందని హరీష్రావు అన్నారు.