నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగే వాహనాలు సీజ్ చేస్తాం
సిపి జోయల్
సిద్ధిపేట, మే 22 (ప్రజాతంత్ర బ్యూరో): సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ను మరింత కఠినతరం చేసినట్లు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. శనివారంతో లాక్డౌన్ విధించి 11వ రోజుకు చేరడంతో సిపి సిద్దిపేట పట్టణంలో ని ముస్తాబాద్ ఎక్స్రోడ్, నర్సాపూర్ ఎక్స్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ఎల్లమ్మ టెంపుల్, సుభాష్ రోడ్, గాంధీ రోడ్, రంగధాంపల్లి చౌరస్తా, రాజీవ్ రహదారి, మెదక్ రోడ్డు, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా, ఎన్సాన్పల్లి చౌరస్తా-కోమటి చెరువు, ప్రభుత్వ ఆసుపత్రి, భారత్నగర్, కరీంనగర్ రోడ్, పొన్నాల చౌరస్తా తదితర ప్రదేశాలను సందర్శించి లాక్డౌన్ జరుగుతున్న తీరును పర్యవేక్షణ చేశారు.
పట్టణంలో కమిషనర్ స్వయంగా మూడు నాలుగు ప్రదేశాలలో వాహనాలు తనిఖీ చేసి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న వాహనాలు సీజ్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్కు పంపించామన్నారు. పటిష్టమైన బందోబస్తు గురించి పోలీస్ అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలనీ, కొరోనా వ్యాధి నివారణకు 24/7 విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. లాక్డౌన్, కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ సిపి జోయల్ హెచ్చరించారు.
కోవిడ్ ఐసోలోషన్ బ్లాక్ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు…
పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ శనివారం సాయంత్రం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానను సందర్శించి భద్రతాపరంగా ఏర్పాట్ల గురించి సమీక్షించారు. కోవిడ్ ఐసోలోషన్ బ్లాక్ వద్ద 24/7 నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశారు. కోవిడ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వారి బంధువులు ఒకరిని మాత్రమే లోపలికి అనుమతించాలని సూచించారు. విధులు నిర్వహించే సమయంలో ఏమైనా ఇబ్బందులు జరిగితే వెంటనే సిద్దిపేట ఏసిపి ఇంచార్జి, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్కు తెలపాలని సూచించారు. అలర్ట్ గా ఉండి విధులు నిర్వహించాలనీ, విధులు నిర్వహించే సమయంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. పోలీస్ సిబ్బందితో పాటు దవాఖాన సిబ్బంది, ఆశా వర్కర్ ఒక ప్రజా ప్రతినిధి కూడా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసిపి ఇంఛార్జి, అడిషనల్ ఎస్పి రామేశ్వర్, విధులు నిర్వహించే డాక్టర్లు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.