ప్రపంచ దేశాలపై ఉక్రెయిన్ పరోక్ష నిందలు
కీవ్, ఫిబ్రవరి 25 : తమ దేశాన్ని ఒంటరిగా వొదిలివేశారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శుక్రవారం చెప్పారు. రష్యా పెద్ద ఎత్తున దాడి ప్రారంభించిందని, ఒక్కరోజులోనే 130 మంది ఉక్రేనియన్లు మరణించారని అన్నారు. తమ దేశాన్ని రక్షించుకోవడానికి తాము ఒంటరిగానే పోరాటం చేస్తున్నామని వోలోడిమిర్ జెలెన్స్కీ గురువారం అర్థరాత్రి అనంతరం దేశాన్ని ఉద్దేశించిన వీడియో ప్రసంగంలో పేర్కొన్నారు. తమతో కలిసి పోరాడటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎవరూ కనిపించడంలేదని, ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం హా ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు ఎవరికివారు మిన్నకుండి పోవడాన్ని ఆయన పరోక్షంగా ప్రకటించారు.
అందరూ భయపడుతున్నారని అన్నారు. సైనికులు, సాధారణ పౌరులు కలిపి 137 మంది ఉక్రేనియన్లు మరణించగా, 316 మందికి గాయాలయ్యాయని అన్నారు. అయితే రష్యన్ విధ్వంసక బృందాలు రాజధాని కీవ్లోకి ప్రవేశించాయని, పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని, కర్ఫ్యూను పాటించాలని జెలెన్స్కీ చెప్పారు. రష్యా తనను టార్గెట్గా గుర్తించినప్పటికీ తాను, తన కుటుంబం ఉక్రెయిన్లోనే ఉన్నామని అన్నారు. వారు అధ్యక్షుడిని తొలగించడం ద్వారా ఉక్రెయిన్ను రాజకీయంగా కూడా నాశనం చేయాలనుకుంటున్నారని అన్నారు.