- నాలుగైదు రోజుల్లో టిమ్స్లో ఓపీ ప్రారంభిస్తాం
- ప్రభుత్వంపై బురదజల్లే విధంగా దుష్ప్రచారం వద్దు
- మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణలో రోజుకు 6600 కొరోనా టెస్టులు చేసే స్థాయికి చేరుకున్నామనీ, ప్రైవేటుతో కలిపి 10 వేల పరీక్షలు చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించవద్దనీ, ప్రస్తుతం ఆరోగ్య రంగంలో కేరళ, తమిళనాడుతో తెలంగాణ పోటీ పడుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొరోనా పరిస్థితిపై బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొరోనా రోగులకు చికిత్సల విషయంలో గాంధీ దవాఖానాపై అనవరసరంగా బురదజల్లుతున్నారనీ, ప్రజలంతా గాంధీ, కింగ్కోఠి ఆసుపత్రులకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఎంత ఖర్చయినా భరించి ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తాం, కొరోనా పరీక్షలు, చికిత్సల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గాంధీ దవాఖానాలో వేలాది మందికి ఓపీ, వందలాది మంది ఇన్పేషెంట్లకు సేవలు అందిస్తున్నామనీ, కొందరు దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టకు మసిపూసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొరోనా లక్షణాలు ఉంటే పీహెచ్సీలలో సంప్రదిస్తే నమూనాలు సేకరిస్తారని తెలిపారు. అంతేగాని లక్షణాలు లేకుండా పరీక్షలు చేయించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలనీ, కొరోనా పాజిటివ్ వచ్చిన ఇంటిలోని వాళ్లపై సామాజిక బహిష్కరణ విధించడం సరికాదని పేర్కొన్నారు. అంతిమ సంస్కారాలను అడ్డుకోవడం సరికాదనీ, మనం మనుషులమా ? కాదా? అనే విషయాన్ని ఆలోచించుకోవాలన్నారు. మృతి చెందిన వ్యక్తుల్లో వైరస్ ఉండదని నిపుణులు చెబుతున్నారనీ, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.
త్వరలో టిమ్స్ను ప్రారంభిస్తాం:
త్వరలోనే గచ్చిబౌలిలోని టిమ్స్లో కొరోనా వైద్య చికిత్సలను ప్రారంభిస్తామని మంత్రి ఈటల వెల్లడించారు.బుధవారం ఆయన గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత అధునాతన సౌకర్యాలతో ఈ దవాఖానా సిద్ధమైందనీ, చండీఘడ్ పీజీ కళాశాల వైద్యులను అందిస్తున్న మాదిరిగానే టిమ్స్ కూడా భవిష్యత్తులో వైద్యులను అందించబోతున్నదని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ కోర్సులకు ఇది కేరాఫ్ అడ్రస్ కావాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అనీ, కార్పొరేట్ ఆసుపత్రిలో లేనన్ని హంగులు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. టిమ్స్లో మొత్తం 1224 బెడ్ల సామర్ధ్యం ఉండగా, 1000 బెడ్లకు ఆక్సీజన్, 50 బెడ్లకు వెంటిలేటర్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. మొత్తం 15 ఫ్లోర్లు సిద్ధమయ్యాయనీ, 2 రోజుల్లో స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తవుతుందని చెప్పారు.