- నాలుగేండ్లలోనే కాళేశ్వరం పూర్తి చేశాం
- ఇంటింటికీ మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించిన కెటిఆర్
మెదక్,ప్రజాతంత్ర,జనవరి30: నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని మన రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని వెల్లడించారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని నాలుగేండ్లలోనే పూర్తి చేశామన్నారు. 10 టీఎంసీల కాళేశ్వరం నీటిని పరిశ్రమలకు అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. మిషన్ కాకతీయతో 46 వేల చెరువులను బాగుచేశామని, దీంతో వ్యవసాయ స్థిరీకరణ, సాగుపెంపు సాధ్యమైందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులతో సాగువిస్తీర్ణం రెట్టింపయిందని చెప్పారు.
అనతి కాలంలోనే మిగులు విద్యుత్ సాధించామన్నారు. రైతులకు 24 గంటల కరెంటు అందిస్తున్నామని చెప్పారు. మెదక్ జిల్లా మనోహరాబాద్లో రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీసీ అతిపెద్ద పేపర్ మిల్లు తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణపై ఐటీసీ చైర్మన్ సంజీవ్పురి ప్రశంసలు సంతోషం కలిగించాయని చెప్పారు. ఈ ప్లాంటులో గోధుమ పిండి, చిప్స్, బిస్కెట్లు, నూడుల్స్ తయారు చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గొర్రెలు, మేకల సంఖ్య రెట్టింపయిందన్నారు. వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. విదేశాల నుంచి నూనెల దిగుమతిని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఐటీసీకి ఆసక్తి ఉంటే ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పెట్టాలని సూచించారు.
ములుగు జిల్లా కమలాపురంలో రేయాన్స్ ఫాక్టరీని టేకప్ చేయాలని కోరారు. పరిశ్రమల వల్ల స్థానికులు పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు. ప్రైవేటు రంగంలో వచ్చే పెట్టుబడులకు ప్రజలు సహకారం అందించాలన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఐటీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానికంగా వైద్యారోగ్య, విద్యా రంగంలో ఐటీసీ సహకారం అందించాలని, స్థానిక రైతుల నుంచి ముడి పదార్థాలు కొనాలని కోరారు. భూమి కోల్పోయినవారిని ఆదుకునే బాధ్యతపై అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలు ఎంపి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా పాల్గొన్నారు.
గాంధీ ఆశయాలను ఆచరిద్దాం: కెటిఆర్ ట్వీట్
భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. 75 ఏండ్ల క్రితం స్వతంత్ర భారతదేశంలో ఇదే రోజున గాంధీని గాడ్సే చంపారని, అప్పుడే ఈ దేశంలో ఉగ్రవాదం తన క్రూర రూపాన్ని చూపిందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. గాంధీజీ 75వ వర్ధంతి సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. జాతిపిత సేవలను
గుర్తు చేసుకున్నారు. గాంధీ ఆశయాలను ఆచరిద్దామని, శాంతి, మత సామరస్యాన్ని కాపాడటమే గాంధీకి అందించే నిజమైన నివాళి అని కేటీఆర్ అన్నారు.