- సాయం కోసం అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి
- విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా వెల్లడి
మన దేశంలో ప్రస్తుత పరిస్థితులు మునుపెన్నడూ లేవని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా అన్నారు. కోవిడ్-19 రెండో ప్రభంజనం విజృంభించడంతో 40కి పైగా దేశాలు మనకు సాయపడేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. గతంలో ఈ దేశాలకు మనం సాయపడ్డామని, ఇప్పుడు అవి తిరిగి మనకు సహాయపడుతున్నాయని అన్నారు. ఇది మునుపెన్నడూ లేని పరిస్థితి. ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. మనం చాలా దేశాల నుంచి ఆక్సిజన్, ఔషధాలు వంటివాటిని సేకరిస్తున్నాం. మనకు సహాయపడేందుకు చాలా దేశాలు తమంతట తాము ముందుకు వస్తున్నాయి. మనం అందించిన సాయం విలువైనదని, తాము తిరిగి ఇస్తున్నామని ఆ దేశాలు చెప్తున్నాయి‘ అని హర్షవర్ధన్ చెప్పారు. శుక్రవారం, రాబోయే రెండు రోజుల్లో అమెరికా నుంచి మూడు విమానాలు మన దేశానికి వస్తాయన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడారని, విస్తృత స్థాయిలో సహాయపడతామని చెప్పారని తెలిపారు.
వెంటిలేటర్లు, ఫవిపిరవిర్ ఔషధాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి గురువారం రాత్రి ఓ విమానం వస్తోందని చెప్పారు. ఐర్లాండ్ నుంచి 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వస్తున్నాయన్నారు. ఫ్రాన్స్ నుంచి ఓ విమానం శనివారం వస్తుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే కాకుండా మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మారిషస్, భూటాన్ వంటి దేశాలు కూడా మనకు సాయపడేందుకు ముందుకు వచ్చాయన్నారు. లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ను తయారు చేసే పరికరాలు, ఆక్సిజన్ జనరేటర్లు, కాన్సంట్రేటర్లు, క్రయోజనిక్ ట్యాంకర్లు, రవాణా పరికరాలు వంటివాటికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
రెమ్డెసివిర్, టొసిలిజుమబ్ వంటి ఔషధాలు అత్యవసరమని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో రోజుకు 67 వేల డోసుల రెమ్డెసివిర్ ఉత్పత్తి అవుతోందని, ప్రస్తుతం రోజుకు రెండు నుంచి మూడు లక్షల డోసుల వరకు అవసరమని చెప్పారు. ఉత్పత్తిదారులు వీటి ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిపారు. రెమ్డెసివిర్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి పదార్థాల సరఫరాకు అమెరికా హావి• ఇచ్చిందని, ఈజిప్టు, ఇతర దేశాల్లోని మాన్యుఫ్యాక్చరర్లను కూడా సంప్రదిస్తున్నామని తెలిపారు.