- అనేక రోడ్లకు నిధులు మంజూరు చేయించాం
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
ప్రజాతంత్ర, హైదరాబాద్ : నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘నగర వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. ఇక్కడికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా వొచ్చి జీవనం కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అందరం కృషి చెయ్యాల్సి ఉందన్నారు. గడిచిన 75 సంవత్సరాలలో ఎన్నో జాతీయ రహదారులు నిర్మించారు. అయితే గత ఏడు సంవత్సరాలలో అంతకన్నా ఎక్కువ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.
కేంద్ర ప్రభుత్వం..హైదరాబాద్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. కేంద్రమంత్రి నితన్ గడ్కరీని రప్పించి వాటిని ప్రారంభిస్తామని అన్నారు. అనేక రోడ్లను మంజూరు చేయిస్తామని అన్నారు. హైదరాబాద్ నగరంలో సైన్స్ సిటీ ఏర్పాటు చేయాలి. అందుకోసం 25 ఎకరాల భూమి అవసరం. అదేవిధంగా సెవెన్ టొంబ్స్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వదేశీ దర్శన్ పథకంలో నిధులు మంజూరు చేస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన భూమి త్వరగా సేకరిస్తే తొందరగా అందుబాటులోకి వొస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.