గత సంవత్సర కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలలో పదిరోజులైనా వేతనాలు అందుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ శాఖల పరిధిలో గెజిటెడ్ ఉద్యోగులు 30,403 మంది, నాన్ గెజిటెడ్ రెండు లక్షల 46 వేల 608 మంది, క్లాస్ 4 ఉద్యోగులు ముప్పే వేల మంది, మొత్తం ఉద్యోగులు మూడు లక్షల ఏడు వేల ఇరవై మూడు మంది ఉద్యోగులున్నారు. రెండు లక్షల మంది పింఛన్ దారులు ఉన్నారు. ఉద్యోగులకు చాలా నెలలుగా జీతాలు ఆలస్యంగా అకౌంట్ లో జమ అవుతున్నవి.
ఈ కుబేర్ తో ఇక్కట్లు
గతంలో ఒకటో తారీకు జీతాలు బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యేవి. ఈ- కుబేర్ విధానము ప్రవేశపెట్టిన తర్వాత నేరుగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా వేతనాలు వస్తాయని భ్రమలు కల్పించారు. ఎస్ టి ఓ సిబ్బందిని అడిగితే బిల్లులు ఈ కుబేర్ లో అప్లోడ్ చేశామని మా చేతిలో ఏమీ లేదని అంటున్నారు. గతంలో ఖజానా అధికారుల ద్వారా వేతన బిల్లులు మంజూరయ్యి బ్యాంకుల ద్వారా ఉద్యోగుల వ్యక్తిగత అకౌంట్లలో జమ అయ్యేవి. ప్రస్తుతం ఈ కుబేర్ ద్వారా వేతనాలు సకాలంలో జమ కావడం లేదు.
అప్పుల కుప్పగా రాష్ట్రం
అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడం, నెలనెలా వస్తున్న ఆదాయంలో సగం కు పైగా పైసలు వడ్డీలు కట్టేందుకే సరిపొతుంది అంటున్నారు ఉద్యోగులు. నెల తిరిగే సరికి జీతాలు కావాల్సిన డబ్బులను సరిచేసే సరికి ఆర్ధిక శాఖ అధికారులకు తల ప్రాణం తోక కు వస్తుందని అంటున్నారు ఆర్ధిక శాఖ అధికారులు.
అప్పులకు ఒప్పుకోని కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ రాష్ట్రం కావడంతో స్థూల ఆదాయంలో 3.5 శాతం వరకు అప్పులు తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.ఈ వెసులుబాటు ను వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బహిరంగ మార్కెట్ నుంచి 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. బహిరంగ మార్కెట్ల నుంచి తెచ్చిన అప్పులు చాలకపో వడంతో అదనంగా అప్పు చేయడానికి ప్రయత్నించింది.కానీ కేంద్రం నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అయోమయ స్థితిలో ఉంది.రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండేందుకు కేంద్రం ఎఫ్ ఆర్ బి ఎం చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలు తమ స్థూల ఆదాయానికి మించి అప్పులు చేయరాదు.
తగ్గుతున్న సిబిల్ స్కోర్
గత సంవత్సరకాలంనుంచి వేతనాలు సక్రమంగా అందకపోవడంతో హౌసింగ్ లోన్ లు, పర్సనల్ లోన్ లు, ఎడ్యుకేషన్ లోన్ లు మరియు ఇతర లోన్లు తీసుకున్న ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు నెలవారి ఈఎంఐలు సక్రమంగా కట్ట లేకపోవడం వలన వారి వ్యక్తిగత సిబిల్ స్కోర్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. మెజారిటీ ఉద్యోగస్తులు అద్దె ఇంట్లో ఉంటూ మొదటి వారంలో రకరకాల చెల్లింపులు జరుపుతారు వీటన్నిటి పైన జీతాల ఆలస్యము ప్రభావం పడుతుంది.
సప్లిమెంటరీ బిల్లుల పరిస్థితి అధోగతే
ఉద్యోగుల జీతాల పరిస్థితి ఇలా ఉంటే వారికి రావలసిన సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ లీవ్ బిల్లులు, ఇతర ఏరియర్స్, జిపిఎఫ్, సిపిఎస్ ఏరియర్స్ మరియు లోన్లు ఇతర సప్లిమెంటరీ బిల్లులు సకాలంలో అందడం లేదు. నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగులంతా వేయికళ్ళతో ఎదురు చూసిన పిఆర్సి బకాయిలకు నేటికీ మోక్షం లేదు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల మరియు రెండు లక్షల పెన్షన్ దారుల కుటుంబీకుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మొదటి తారీఖున జీతాలు వ్యక్తిగత ఖాతాలలో జమ అయ్యేలా చూడాలని ఉద్యోగస్తులందరూ కోరుతున్నారు.
– పిన్నింటి బాలాజీ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టి పి యు ఎస్)
9866776286