సూర్యాపేట, ఏప్రిల్ 25, ప్రజాతంత్ర ప్రతినిధి):విపత్తు సంభవించినప్పుడు స్వచ్ఛంద సంస్థలు సేవలందించేందుకు విధిగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.కరోనా మహమ్మారి ప్రబలి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సమయంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నాయని ఆయన అభినందించారు. శనివారం పురపాలక సంఘం కార్యాలయంలో ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బత్తాయి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు కరోనా వైరస్ నిర్మూలనకు నిరోదమే మందన్నారు.
అందుకు మనం మనిషికి మనిషికి సామాజిక దూరం పాటించాలని అభిప్రాయపడ్డారు. వైరస్ను తట్టుకునే శక్తి సి విటమిన్లో ఉందని, బత్తాయి, నిమ్మలను తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని అన్నారు. అందులో భాగంగా ఎస్ ఫౌండేషన్ బత్తాయిల వితరణకు ముందుకు రావడం ఆహ్వానించదగ్గదని ఆయన కొనియాడారు. పట్టణ ప్రజలతోపాటు,1600మంది ప్రభుత్వ ఉద్యోగులకు బత్తాయిలను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు గుంటకండ్ల మహేష్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, కమిషనర్ పి.రామాంజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.