Take a fresh look at your lifestyle.

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు

“వీటి వాదనలు, ప్రతివాదనలు చాలానే ఉంటాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను మాత్రం ఈ చర్చలన్నింటికి అతీతంగా చూడాలి. ఎందుకంటే ఇది తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. కేవలం ఆర్ధిక కోణాలే, అంకెల లెక్కలే ఇక్కడ సరిపోవు. వీటిన్నింటికి మించి ఈ పరిశ్రమకు ఉన్న చారిత్రక నేపథ్యం, పోరాట స్ఫూర్తిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.”

rehana pendriveమరోసారి రాష్ట్రంలో కార్మికుల పిడికిలి బిగుస్తోంది. రాష్ట్రానికే తలమానికమైన విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం నిర్ణయించటంతో ఆవేదన, ఆందోళన గళమెత్తుతున్నాయి. కేంద్రం చేయాలనుకుంటున్న పెట్టుబడుల ఉప సంహరణ ఇవాళ కొత్తది కాదు. ఆర్ధిక సంస్కరణలు దేశంలోకి అడుగు పట్టినప్పటి నుంచి పెట్టుబడుల ఉపసంహరణ అనే పదం పుట్టుకు వచ్చింది. అనేక ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్నాయి. ఆ యా సంస్థలు ఖాయిలా పెడితే తప్పనిసరైన పరిస్థితుల్లో వెళుతున్నాయా…లేక ఖాయిలా పడే విధంగా వ్యూహంతో ఆ మార్గంలోకి ఆ యా సంస్థలు నెట్టబడుతున్నాయా అనేది మరో చర్చ. ఇవేమి లేకుండా లాభాల బాటలో ఉన్న సంస్థలను కూడా పెట్టుబడులను ఉపసంహరించుకుని ప్రభుత్వం గల్లాపెట్టే నింపుకుంటంన్న తీరూ కనిపిస్తూనే ఉంది. వీటి వాదనలు, ప్రతివాదనలు చాలానే ఉంటాయి. విశాఖ ఉక్కు పరిశ్రమను మాత్రం ఈ చర్చలన్నింటికి అతీతంగా చూడాలి. ఎందుకంటే ఇది తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. కేవలం ఆర్ధిక కోణాలే, అంకెల లెక్కలే ఇక్కడ సరిపోవు. వీటిన్నింటికి మించి ఈ పరిశ్రమకు ఉన్న చారిత్రక నేపథ్యం, పోరాట స్ఫూర్తిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ప్లాంట్‌- ‌చారిత్రక నేపథ్యం
సరిగ్గా 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఇస్పత్‌ ‌నిగమ్‌ ‌లిమిటెడ్‌- ‌స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన అంత తేలిగ్గా రాలేదు. దానికి నాలుగేళ్ల కిందట అంటే 1966లో ఆంగ్లో-అమెరికన్‌ ‌కన్సార్టీయమ్‌ ఇచ్చిన సూచనలను కూడా పక్కన పెట్టి విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇందిర నిర్ణయం తీసుకున్నారు. దీనితో విశాఖ వేదికగా విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు తెలుగోడి ఆత్మగౌరవ నినాదంగా మారింది. 66 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్పీలు రాజీనామా చేశారు. విద్యార్ధులు, కార్మికులు, రాజకీయ నాయకులు, సాధారణ వ్యక్తులు అందరూ రోడ్ల మీదకు వచ్చారు. 32 మంది అసువులు బాసారు. దీనితో అదే ఇందిరా విశాఖలో ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు. ఈ ప్లాంట్‌ ‌కోసం అప్పట్లో 64 గ్రామాలను ఖాళీ చేయించి సుమారు 22 వేల ఎకరాల భూ సేకరణ చేశారు. తీర ప్రాంతంలో ఏర్పడిన మొదటి స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌మన దేశంలో ఇదే. అప్పటి నుంచి ఈ పరిశ్రమకు, తెలుగువారికి ఓ భావోద్వేగ బంధం ఏర్పడింది. ఈ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పై ప్రత్యక్షంగా 20 వేల మంది ఆధారపడి బతుకుతున్నారు. పరోక్షంగా వేలాది మందికి ఈ పరిశ్రమ జీవనోపాధి కల్పిస్తోంది.

నష్టాల ఊబి-నిజమేనా?
విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల ఊబిలో ఉంది అన్న వాదనలో వాస్తవం ఎంత… చూడాల్సిన కోణం ఏంటి అనేది చర్చనీయాంశం. ఒకవేళ సంస్థకు నష్టాలు వస్తుంటే కారణాలేమిటి… పరిష్కారం ఏంటి అనేవి కీలకమైన అంశాలవుతాయి. లోతుగా తరచి చూస్తే ఈ పరిశ్రమ వల్ల కేంద్రం ప్రభుత్వ వేలా కోట్ల రూపాయల లాభాలు ఆర్జించింది. అప్పట్లో కేవలం 5వేల కోట్ల పెట్టుబడితో విశాఖ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఈ సంస్థకి ఆర్ధిక తోడ్పాటు అందించ లేదు. కేంద్రం విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌కు సొంత ఇనుప ఖనిజం మైనింగ్‌ ‌ను కేటాయించలేదు. సొంతంగా క్యాప్టివ్‌ ‌మైనింగ్‌ ఉం‌టే టన్ను ఇనుప ఖనిజం సగటున 500 నుంచి 600 వరకు ఖర్చు అవుతుంది. క్యాప్టివ్‌ ‌మైనింగ్‌ ‌లేకపోవటం వల్ల విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌బైలదిల్లా గనుల నుంచి దాదాపు టన్ను ముడి ఖనిజాన్ని రూ. 5,260 చొప్పున కొనుగోలు చేస్తోంది. అంటే ఒక్క ముడి ఖనిజం విషయంలోనే విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌పై ఎన్ని వేల కోట్లు అదనపు భారం పడుతుందో అర్ధం అవుతుంది. ఇక స్టీల్‌ ‌ప్లాంట్‌ ఎదుర్కోంటున్న మరో కీలక సమస్య అధిక వడ్డీ భారం. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండి కూడా 14 శాతం అధిక వడ్డీ రేట్లను చెల్లించాల్సి వస్తోంది.

పరిష్కారం లేదా?
ఇక సంస్థ పని తీరును కూడా ఒక సారి చూద్దాం. విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ 1.2 ‌మిలియన్‌ ‌మెట్రిక్‌ ‌టన్నుల సామర్థ్యం నుంచి 7.3 మిలియన్‌ ‌టన్నుల సామర్థ్యానికి విస్తరించిందీ అంటే సంస్థ సమర్థవంతంగా పని చేస్తున్నట్లా… విఫలమైనట్లా? విస్తరణ చేసుకునే క్రమంలో అప్పులు తీసుకోవటం కూడా సాధారణ విషయమే. 2001లో నాలుగువేల కోట్ల అప్పుల భారం సంస్థ మీద ఉండేది. 2008 నాటికి 10వేల 500 కోట్ల లాభాల్లోకి వెళ్లింది. ఇప్పుడు ఉన్న 7.3 మిలియన్‌ ‌టన్నుల సామర్థ్యం విస్తరణకు వెళ్లే క్రమంలో రెండు దఫాలుగా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు వడ్డీలతో కలిపి 22 వేల కోట్లకు చేరింది. వడ్డీ రేట్లను కేంద్రం తగ్గిస్తే ఆ మేరకు ప్లాంట్‌ ‌కు కొంత ఊరట లభిస్తుంది. లేదంటే ఈక్విటీల రూపంలో మార్చినా రుణ భారం నుంచి సంస్థ బయటపడుతుంది. 5వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ డివిడెండ్లు, పన్నుల రూపంలో అక్షరాల 42వేల కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించింది. ఉత్పత్తి ఖర్చు ఎక్కువ అవటం వల్ల 7.3 మిలియన్‌ ‌టన్నుల సామర్ధ్యం ఉన్నా…ఇవాళ కేవలం 6.3 మిలియన్‌ ‌టన్నుల ఇనుమే ఉత్పత్తి చేయగలుగుతోంది.

గత ఏడాది కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడింది. ఆ మేరకు స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌కు కూడా ప్రభావం పడుతుంది కదా. అయినా గత ఏడాది- డిసెంబర్‌ 2020‌లో రూ.200 కోట్ల లాభం సంస్థ తన ఖాతాలో వేసుకుంది. అంటే కేంద్ర తోడ్పాటు లేకుండానే సంస్థ తన ఆర్ధిక పరిస్థితిని తనే మెరుగుపరుచుకుంటున్నట్లే కదా. ఈ దశలో ఏ మాత్రం చిన్న తోడ్పాటు అందించినా వేల కోట్లు లాభాలు సంపాదిస్తుంది. ఆర్ధికంగా చేయూత ఇవ్వకపోయినా కనీసం సొంతంగా గనుల ఉన్న మరో ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌ ‌తో కన్సార్టియం చేయటమో, ఆ గనులను విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌కూడా ఉపయోగించుకునే విధంగా ఏర్పాటో చేస్తే ప్రైవేటీకరణ అనే ప్రతిపాదన చేయాల్సిన పరిస్థితే రాదు. ఇప్పటికే ప్రత్యేక హోదా హామీని కేంద్రం నెరవేర్చలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. విశాఖ రైల్వే జోన్‌ అం‌శం కూడా మరొకటికి. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో అందరూ తెలుగోడి హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉంది.

 

Leave a Reply