సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి రోజున వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. అందుకే వైకుంఠ ఏకాదశి అని, ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైనందువల్ల ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.
హాలాహలం, అమృతం రెండూ ఈ రోజునే పుట్టయని, ఈదే రోజు శివుడు హాలాహలం మింగాడని భక్తుల విశ్వాసం. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు ‘మార్గళి’ మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్నదానం చేస్తే పుణ్యమని చెబుతారు.పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవునిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. దశమి రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. అబద్ధం ఆడకూడదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. అన్నదానం చేయాలి.
పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలను భవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట! మురాసురుడి కథ రెండోది. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించే విషయాన్ని దేవతలు విష్ణుమూర్తికి గోడు విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడని, సాగరగర్భంలో దాక్కున్న మురాసురుని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్న కల్పించగా, మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తగా మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు ‘ఏకాదశి’ అనే బిరుదునిచ్చాడు! ఇందులో తాత్త్విక సందేశం ఏమిటంటే, విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని. ఉపనిషత్తుల ప్రకారం ప్రతి మానవ హృదయ గుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం.
