- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- కొరోనా కట్టడికి వ్యాక్సినేషనే వజ్రాయుధం
- ప్రముఖ వైద్యులతో ప్రధాని మోడీ సమిక్ష
దేశంలో కొరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. వ్యాక్సినేషన్ మూడో దశలో భాగంగా స్పీడు పెంచాలని ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ అడ్డూ అదుపూ లేకుండా విజృంభిస్తున్న తరుణంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. దేశంలో కొరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో సోమవారం మోదీ దేశంలోని ప్రఖ్యాతి గాంచిన వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశాల్లోనే 18 ఏళ్ల పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. కొరోనా కట్టడికి వ్యాక్సినేషనే వజ్రాయుధమని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ వైపు ప్రజల్ని మరింత ప్రోత్సహించాలని వైద్యులను మోదీ అభ్యర్థించారు. కోవిడ్ చికిత్స విషయంలో కొన్ని పుకార్లు వొచ్చాయని, వాటికి వ్యతిరేకంగా ప్రజలందర్నీ చైతన్యపరచాలని మోదీ కోరారు. ఈసారి కొరోనా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ విజృంభిస్తుందని, అలాంటి ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాట్లు చేయాలని మోదీ ఆదేశించారు.