ఆకుపచ్చ తెలంగాణ కెసిఆర్ లక్ష్యం
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 24, 27, 31వ డివిజన్లలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని స్త్రీ శిశు సంక్షేమశాఖ మాత్యులు సత్యవతి రాథోడ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్లు ప్రారంభించారు. వార్డులలో స్వచ్ఛత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రతతో పాటు ఆకుపచ్చ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి డివిజన్లోని ప్రతి వీధి శుభ్రంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అందుకోసం పట్టణ ప్రణాళిక ప్రత్యేకంగా రూపొందించి నగర అభివృద్ధికి కృషి చేస్తున్నాడని పది రోజుల్లో క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని 11వ రోజు నుండి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తుందన్నారు. పట్టణాల రూపురేఖలు మార్చేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఖాళీ స్థలాలను గుర్తించి చెత్తా చెదారం లేకుండా చూడాలని, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, గుంతలు లేని రహదారులు, పచ్చదనం, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్, స్మశాన వాటికల నిర్మాణం పట్టణ పరిధిలో భాగంగా పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రగతి పనులు సమీక్షించేందుకై ప్రతి డివిజన్కి స్పెషల్ ఆఫీసర్ల్ నియమించడం జరిగిందని తెలిపారు.
చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి మొదటిరోజులో భాగంగా పాతబడిన విద్యుత్ స్థంభలను మూకుమ్మడి విద్యుత్ తీగలను డ్రైనేజీలను గుర్తించి వాటిని పరిశుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. డివిజన్లలో పేరుకుపోయిన సమస్యలను సేకరించి పట్టణ ప్రగతిలో భాగంగా వాటిని పరిష్కారం అయ్యేలా చేస్తామన్నారు.అభివృద్ధి అంటే కేవలం నిధులు మంజూరు చేయడమే కాదని ప్రజలకు తగిన మౌలిక వసతులు కల్పించి తద్వారా సుపరిపాలన అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. కొత్త మున్సిపల్ చట్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రివర్యులు కేటీఆర్ రూపొందించనున్నారని, ప్రజా ప్రతినిధులు అధికారులు చిత్తశుద్ధితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తే నగరం మరింత సుందరీకరణంగా ఉంటుందన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా వరంగల్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాలని, ఇండ్లపై నుండి వెళ్తున్న విద్యుత్ లైన్లను రోడ్డు మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలు గుర్తించి తొలగించాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, మాజీ రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు వద్దిరాజు గణేష్, గుండు అశ్రిత రెడ్డి, నయీమ్, డివిజన్ ప్రెసిడెంట్లు పులి రజినీకాంత్, సురేందర్, సదాంత్, అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రగతి సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.