Take a fresh look at your lifestyle.

త్యాగాలు, సమరాల ఫలంగా తరతరాల రాజరికం తలవంచిన వేళ…

‘‘‌భారత యూనియన్‌’ ‌నిజామ్‌ ‌రాజు యధాతధ ఒప్పందం (స్టాండ్‌ ‌స్టిల్‌ అ‌గ్రిమెంట్‌) ‌కుదుర్చుకోకుండా రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అడ్డుపడ్డారు. చివరికి ఆ ఒప్పందం కుదిరినా అది అమలు కాలేదు. పర్యవసానంగా హైదరాబాద్‌ ‌సంస్థానంలో అరాజక పరిస్థితి అదుపు తప్పడం, వేలాది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడడం, పోలీసు చర్య అనివార్యం కావడం అనంతర పరిణామాలు. హైదరాబాద్‌ ‌సంస్థానంలోని నిజామ్‌ ‌నిరంకుశ రాజరిక వ్యవస్థ శృంఖలాల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛావాయువులు పీల్చడానికి కొనసాగిన ఒక్కొక్క సామాజిక, రాజకీయ ఉద్యమం చరిత్ర ఒక బృహద్గ్రంథమవుతుంది. ’’

సమీర్‌ ‌చక్రవర్తి
డెబ్బై నాలుగు  సంవత్సరాల కిందట హైదరాబాద్‌• ‌సంస్థానంలో, విశేషించి తెలంగాణంలో అదొక  చరిత్రాత్మక, మహత్తర సంఘటన..!
దాదాపు మూడు శతాబ్దాల  కిందట 1724వ సంవత్సరంలో అవతరించిన ఆసఫ్‌ ‌జాహి రాజ్యం అంతరించింది.. ఏడు తరాల ఆసఫ్‌ ‌జాహి పాలన అంతమయింది. హైదరాబాద్‌ ‌సంస్థానంపై 1948 సెప్టెంబర్‌ 13‌వ తేదీన నాలుగు దిశల నుంచి ప్రారంభమయిన ఆపరేషన్‌ ‌పోలో ( పోలీస్‌ ‌చర్య) ఎవరూ ఊహించని విధంగా అయిదు రోజులలో, 17వ తేదీనాటికే విజయవంతంగా ముగిసింది.

ఆపరేషన్‌ ‌పోలో

భారత యూనియన్‌ ‌సైన్యం లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌మహారాజ్‌ ‌శ్రీ రాజేంద్ర సింఘ్‌ ‌జీ మార్గదర్శకత్వంలో ఆపరేషన్‌ ‌పోలోను 13వ తేదీ సోమవారం సూర్యోదయానికి ముందే ప్రారంభించింది. మేజర్‌ ‌జనరల్‌ ‌జయంత్‌ ‌నాధ్‌ ‌చౌదరి  నాయకత్వంలో ప్రధాన సైనిక దళాలు షోలాపూర్‌ – ‌హైదరాబాద్‌ ‌మార్గంలో (186 మైళ్ల మార్గం) పురోగమించాయి. బొంబాయి సెక్టారు నుంచి కదిలిన దళాలకు మేజర్‌ ‌జనరల్‌ ‌డి.ఎస్‌. ‌జార్‌, ‌మద్రాసు సరిహద్దుల నుంచి ముందుకు వచ్చిన దళాలకు మేజర్‌ ‌రుద్ర, బెరార్‌- ‌సెంట్రల్‌ ‌ప్రావిన్సెస్‌ ‌దిశ నుంచి రంగంలో ప్రవేశించిన దళాలకు బ్రిగేడియర్‌ ‌శివదత్త సింగ్‌ ‌నాయకత్వం వహించారు. వైమానిక బలంతో ఏర్‌ ‌వైస్‌ ‌మార్షల్‌ ‌ముఖర్జీ అండగా నిలిచారు. భారత సైనిక దళాల దాడి గురించి తెలియగానే నిజామ్‌ ‌ప్రభుత్వ హైదరాబాద్‌ ‌లో భారత ప్రభుత్వ ఏజెంటు జనరల్‌ ‌గా ఉన్న కె.ఎమ్‌. ‌మున్షీ  లేక్‌  ‌వ్యూ గెస్ట్ ‌హౌస్‌ ‌లో  నిర్బంధించింది ‘‘ భారత సైనిక దళాల పురోగమనాన్ని ‘‘నిజామ్‌ ‌ప్రభుత్వ సైన్యం, మతోన్మాది• – ఖాసిమ్‌ ‌రజ్వీ రజాకార్‌ ‌మూకలు ఎంత మాత్రం ప్రతిఘటించ లేకపోయాయి.. సెప్టెంబర్‌ 17‌వ తేదీ నాటికి నిజామ్‌ ‌సైన్యం కుప్పకూలి ప్రతిఘటనను నిలిపివేసింది. ‘మహాఘనత వహించిన హైదరాబాదు ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలని ఎన్నో కలలుగన్న ఏడవ ఆసఫ్‌ ‌జాహి నిజామ్‌ ‌మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌బహద్దుర్‌ ‌గత్యంతరం లేక తలవంచి ఆ రోజు లొంగి పోయాడు.
తన ప్రధాన మంత్రి లాయక్‌ అలీ చేత రాజీనామా చేయిస్తున్నట్లు, భద్రతా మండలి నుంచి తన ఫిర్యాదును ఉపసంహ రిస్తున్నట్లు నిజామ్‌ ‌తక్షణమే తన సైన్యాధిపతి మేజర్‌ ‌జనరల్‌ ఎల్‌. ఎ‌డ్రూస్‌ ‌ద్వారా కె.ఎమ్‌. ‌మున్షీ కి ఒక సందేశం పంపించాడు. విచిత్రమయిన విషయం ఏమిటంటే మోయిన నవాజ్‌ ‌జంగ్‌ ‌ద్వార నిజామ్‌ ‌భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంపిన ఫిర్యాదును భద్రతా మండలి (ఐక్య రాజ్యసమితి) సెప్టెంబర్‌ 16‌వ తేదీన స్వీకరించింది. ఆపరేషన్‌ ‌పోలో ప్రారంభించడానికి ముందు భారత యూనియన్‌ ‌గవర్నర్‌ ‌జనరల్‌ ‌సి. రాజగోపాలచారి 1948 ఆగస్టు 31 వ తేదీన ఒక లేఖ రాసి నిజామ్‌కు చివరి అవకాశం ఇవ్వడం జరిగింది. రజాకార్‌ ‌సంస్థను రద్దు చేసి సంస్థానంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని రాజగోపాలచారి ఆ లేఖలో చేసిన సూచనను నిజామ్‌ ‌తిరస్కరించాడు! ఈ తిరస్కరణకు ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది. సెప్టెంబర్‌ 17 ఉదయం లాయక్‌ అలీ రాజీనామా ఇచ్చాడు. మధ్యాహ్నం ఒంటి  గంటకు నిజామ్‌ ‌హుటాహుటిన మున్షీ ద్వారా భారత ప్రభుత్వానికి సందేశం  పంపించాడు. యుద్ధ విరమణకు, రజాకార్‌ ‌సంస్థ రద్దుకు తాను ఆదేశించినట్లు తెలియ జేస్తూ..! నిజానికి నిజామ్‌ ‌సైన్యం భారత సైన్యంతో ఏ రంగంలోను గట్టిగా ప్రతిఘటించలేకపోయింది.. 17వ తేదీ సాయంత్రం నిజామ్‌ ‌రేడియోలో ప్రసంగిస్తూ తాను లొంగిపోయినట్లు ప్రకటించాడు. అదే రోజు సాయంత్రం ఎడ్రూస్‌ ‌నాయకత్వాన గల నిజామ్‌ ‌సైన్యం లొంగిపోయింది. 1948 సెప్టెంబర్‌ 18 ఉదయం భారత సైనిక దళాలు మేజర్‌ ‌జనరల్‌ ‌జె.ఎన్‌. ‌చౌదరి  నాయకత్వాన హైదరాబాద్‌ ‌నగరంలో విజయోత్సా హంతో ప్రవేశించాయి. సెప్టెంబర్‌ 18 ‌సాయంత్రం 4 గంటలకు మేజర్‌ ‌జనరల్‌ ఎల్‌ ఎ‌డ్రూస్‌ ‌బేషరతుగా భారత సైన్యపు మొదటి సాయుధ డివిజన్‌ ‌కమాండర్‌ ‌మేజర్‌ ‌జనరల్‌ ‌చౌదరి  ముందు లొంగిపోయాడు. మేజర్‌ ‌జనరల్‌ ‌చౌదరి హైదరాబాద్‌ ‌సంస్థాన మిలటరీ గవర్నర్‌గా నియుక్తులయ్యారు. 1949 డిసెంబర్‌ ‌వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. తరువాత 1950 జనవరి 26వ తేదీన హైదరాబాద్‌ ‌సంస్థానం భారత యూనియన్‌లో విలీనమయింది.
ఉద్యమాల నేపధ్యం
image.png
ఈ విలీనానికి, హైదరాబాద్‌ ‌విముక్తికి క్రమంగా దారి తీసిన నేపధ్యాన్ని, దాదాపు నూటా యాభయి సంవత్సరాల వెనుకటి చరిత్రను ఈ సందర్భాన విస్మరించడానికి  వీలు లేదు. పందొమ్మిదవ శతాబ్దం ప్రారంభం నుంచే నిజామ్‌ ‌రాజులు తిరుగుబాటుదారులను ఎదుర్కోవలసి • వచ్చిందనడానికి పలు చారిత్రక సాక్ష్యాధారాలున్నాయి. తమ రాజ్యాన్ని, అధికారాన్ని కాపాడుకోవడానికి నిజామ్‌ ‌రాజులు పలు సందరా••లలో ఫ్రెంచి, బ్రిటిష్‌ ‌సైనిక బలగాల మీద ఆధార పడ్డారు. 1857లో ఉత్తర భారత దేశంలో ప్రథమ స్వాతంత్య్ర సమరం జరిగినప్పుడు దాని ప్రభావం హైదరాబాద్‌ ‌సంస్థానంలో, ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగరంలో గూడ కన్పించింది. 1857 జూలై 17వ తేదీన హైదరాబాద్‌ ‌నగరంలో వందల మంది రోహిలాలు చెలరేగి తుర్రేబాజ్‌ ‌ఖాన్‌, ‌మౌల్వీఅల్లా ఉద్దీన్‌ ‌నాయకత్వంలో సుల్తాన్‌ ‌బజార్‌లోని బ్రిటిష్‌ ‌రెసిడెంట్‌ ‌మీద దాడి చేసారు. 1857 నుంచి 1859 . వరకు హైదరా బాద్లో కొందరు ఉత్తర భారత దేశంలో స్వాతంత్య్ర సమర నాయకులలో ఒకరయిన తాంతియాతో పేతో సంబం ధాలు పెట్టుకున్నారు.
నిజామ్‌ ‌ప్రభుత్వం ఎన్ని ఆంక్షలను పెట్టి నిర్బంధ చర్యలను అమలు జరిపినా ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి, పౌరసత్వాలను కోరడానికి గొంతు విప్పిన నాయకులు కొందరు లేక పోలేదు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిధ్వనించడానికి కొందరు సాహసవంతంగా ప్రయ త్నించారు. నిజామ్‌ ‌ప్రభుత్వం రూపొం దించిన చాందా రైల్వే పథకానికి వ్యతిరేకంగా 1883లో డాక్టర్‌ అఘోరనాథ్‌ ‌చటోపాధ్యాయ (సరోజనీ నాయుడు తండ్రి), ముల్లా అబ్దుల్‌ ‌ఖయ్యూమ్‌, ‌దస్తూ ఆసగి హోషాంగ్‌ ‌తదితరులు ఒక ఉద్యమం నడిపారు. ఈ పథకం ప్రజల ప్రయో జనాలకు భంగం కల్గిస్తుందని ఈ మేధా వులు భావించారు. నిజామ్‌ ‌ప్రభుత్వం ఆగ్రహించి చటోపాధ్యాయను, హోషాం గను సంస్థానం నుంచి కొంత కాలం పాటు బహిష్కరించింది. వారిద్దరు రెండు సంవత్సరాల తరువాత తిరిగి హైదరాబాద్‌ ‌నగరానికి వచ్చి వివిధ కార్యకలాపాలు నిర్వహించారు. బొంబాయిలో 1885లో భారత జాతీయ కాంగ్రెసు స్థాపనను హైదరాబాద్‌ ‌మేధావులు చటోపాధ్యాయ తదితరులు హర్షించారు. జాతీయ భావాలను ప్రచారం చేస్తూ హైదరాబాలోని బ్రిటిష్‌ ‌రెసిడెంట్‌ను లోకల్‌ ‌సీజర్‌ అని విమర్శించినందుకు ‘హైదరాబాద్‌ ‌రికార్డ్’ ‌పత్రికను 1892లో నిజామ్‌ ‌ప్రభుత్వం నిషేధించింది. షాకతుల్‌ ఇస్లామ్‌’ అన్న పత్రిక నిజామ్‌ ‌ప్రభుత్వ నిర్బంధ చర్యలను ప్రతిఘటించింది.
ముఖ్య ఘటన
సంస్థానం ప్రజలలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యం  కల్గించడానికి, నిజామ్‌ ‌నిరంకుశత్వానికి – వ్యతిరేకంగా గొంతు విప్పడానికి గత శతాబ్ది చివరనే, అనగా వంద సంవత్సరాల కిందటనే కొందరు ప్రయత్నించారు. హైదరాబాద్‌ ‌నగరంలో 1892వ సంవత్సరంలో ఆర్య సమాజ్‌ ‌స్థాపన ఒక ముఖ్య ఘటన. క్రమంగా ఆర్య సమాజ్‌ ‌ప్రభావం సంస్థానమంతట ప్రసరించింది. పందొమ్మిదవ శతాబ్ది ప్రారంభంలో తెలంగాణంలో గ్రంథాలయోద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు ప్రారంభమయినాయి. విద్యా సంస్థల స్థాపనతో విద్యా వ్యాప్తి కృషి ప్రారంభ . మయింది. మొదటి హైదరాబాద్‌ ‌విద్యా మహాసభ 1915లో జరిగింది. తత్ఫలితంగా 1919 ఆగస్టు 28వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపితమయింది. వరంగల్లు, నల్లగొండ నగరాలనుంచి తెలుగు పత్రికల ప్రచురణ ప్రారంభమయింది. – హైదరాబాద్‌ ‌నగరం నుంచి గోలకొండ – పత్రిక వెలువడింది. అప్పటికే గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం ప్రభావం, ఖిలాఫత్‌ ఉద్యమ ప్రభావం హైదరాబాద్‌ ‌సంస్థానంలో స్పష్టంగా కన్పించాయి.
ఆంధ్ర మహాసభ అంకురార్పణ
హైదరాబాద్‌ ‌నగరంలో 1921 నవంబర్‌ 11, 12 ‌తేదీలందు మహర్షి కార్వే అధ్యక్షతన జరిగిన సాంఘిక సంస్కరణల మహాసభలో ఒక తెలుగు తీర్మానం ప్రతిపాదనకు అనుమతించక పోవడంతో, తెలుగు వక్తను అవమా నించడంతో అదే రోజు రాత్రి మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, మందుముల నరసింగరావు, ఆదిరాజు వీరభద్రరావు తదితరులు ‘ఆంధ్ర జనసంఘం’ ఏర్పాటు చేసారు. ఆ సంఘం మొదటి సమావేశం 1922 ఫిబ్రవరి 14వ తేదీన హైదరాబాద్‌ ‌నగరంలో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ‘నిజామ్‌ ‌రాష్ట్ర ఆంధ్ర జనసంఘ్‌’ ‌గా దాని పేరు మార్చి మాడపాటి హనుమంతరావును కార్యదర్శిగా నియమిం చారు. తెలంగాణ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవనం, పునర్వికాసం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సంస్థ ప్రోత్సాహంతో 1930 సంవత్సరంలో వరంగల్లులో కాకతీయుల చరిత్ర పై ఒక మహాసభ ఏర్పాటయింది. ఆంధ్ర జనసంఘ్‌ ‌పుస్తక ప్రచురణను గూడ ప్రారంభించింది. అనతి కాలంలోనే తెలంగాణ అంతట పలు కార్యక్రమాలతో విస్తరించిన ఆంధ్ర జనసంఘ్‌ 1930‌లో, మెదక్‌ ‌జిల్లా జోగిపేటలో నిర్వహించిన మహాసభతో తెలంగాణ ఆంధ్ర మహా సభగా అవతరించింది. ఆంధ్ర మహాసభ తీవ్ర రాజకీయ పరిణామాలకు దారితీస్తుందని నిజామ్‌ ‌ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధి కారులు, 1927లో స్థాపితమయిన ఇత్తెహాదుల్‌ ‌ముసల్మీన్‌ ‌నాయకులు అనుమానించారు. తరువాత సంవత్సరా లలో వారి అనుమానం నిజమయింది.
1937లో నిజామాబాద్లో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశం మొదటిసారి రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు కావాలని నిజామాబాద్‌ ఆం‌ధ్రమహాసభ తన ఈ రాజకీయ తీర్మానంలో డిమాండు చేసింది. 1930 నుంచి 1947 వరకు పదిహేడు సంవత్సరాల కాలంలో తెలంగాణంలోని తొమ్మిది జిల్లాలలో ఏడింటిలో మొత్తం పదమూడు ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభల నిర్వహణతో తెలంగాణంలో కలిగిన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యం అపారమయినది. నిజామ్‌ ‌ప్రభుత్వం ఆంధ్ర మహాసభల నిర్వహణకు, దాని కార్యకలాపాలకు అనేక అవరోధాలు కల్గించింది. 1944లో భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన పదకొండవ ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టులు ప్రాబల్యం వహించడంతో చీలిక ఏర్పడింది. కాంగ్రెసు వాదుల ప్రాబల్యంలో గల ఆంధ్ర మహాసభ 1946లో హైదరా బాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెసులో విలీనం కావడానికి నిర్ణయించింది.
అపూర్వ చైతన్యం
హైదరాబాద్‌ ‌సంస్థానంలో, 1938వ సంవత్సరంలో నిర్వహించిన సత్యాగ్రహాలు, వందేమాతరం ఉద్యమం గణనీయ మయినవి. అదే సంవత్సరం హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెసు ఏర్పాటు కాగానే నిజామ్‌ ‌ప్రభుత్వం దానిని నిషేధించింది. 1938లో నిర్వహించిన మొదటి సత్యాగ్రహ ఉద్యమంతో హైదరాబాద్‌ ‌సంస్థాన మంతట అపూర్వమయిన రాజకీయ చైతన్యం ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్లలో వందేమాతరం గీతాలాపన పై నిజామ్‌ ‌ప్రభుత్వం నిషేధం విధించింది. అదే సంవత్సరం జూలో లాతూర్‌ ‌నుంచి హైదరాబాద్‌ ‌నగరం వచ్చిన స్వామి రామానంద తీర్థ కాంగ్రెసు కార్యకలాపాలను ప్రారంభించారు. 1942 ఆగస్టులో, బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెసు క్విట్‌ ఇం‌డియా తీర్మానాన్ని ఆమోదించడానికి ఒక రోజు ముందు స్వామి రామానంద తీర్థ ప్రత్యేకంగా గాంధీజీతో మాట్లాడారు. హైదరాబాద్‌ ‌సంస్థానంలో గూడ క్విట్‌ ఇం‌డియా ఉద్యమం నిర్వహించడానికి గాంధీజీ అనుమతి ఇచ్చారు.
బొంబాయి నుంచి హైదరాబాద్‌ ‌రాగానే నిజామ్‌ ‌ప్రభుత్వం స్వామిరామానందతీర్థను అరెస్టు చేసింది. 1947 మే నెలలో హైదరాబాద్‌ ‌వచ్చిన జయప్రకాష్‌ ‌నారాయణన్‌ను నిజామ్‌ ‌ప్రభుత్వం బహిష్కరించింది. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో స్టేట్‌ ‌కాంగ్రెసు సరిహద్దు శిబిరాలను నిర్వహించింది. ఆంధ్ర మహాసభను కైవసం చేసుకున్న కమ్యూనిస్టులు 1945 నుంచి నిజామ్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం  ప్రారంభించారు. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యాన 1951 వరకు ఆరు సంవత్సరాల పాటు తీవ్రస్థాయిలో కొనసాగిన సాయుధ పోరాటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. రాజరికపు నియంతృత్వాన్ని, భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం కొనసాగిన ఆ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది ప్రాణాలర్పించారని అంచనా. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన కొందరికి నిజామ్‌ ‌ప్రభుత్వం విధించిన ఉరిశిక్షలు 1952 వరకు రద్దు గాకుండా కొనసాగడం విచిత్రం. 1927లో స్థాపితమయిన ఇతైహాదుల్‌ ‌ముసల్మీన్‌ ‌ఖాసిం రజ్వీ నాయకత్వంలో నిజామ్‌ ‌రాజును కీలుబొమ్మగా మార్చి సంస్థానమంతట, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అరాజ కత్వాన్ని సృష్టించింది. రజ్వీ నాయకత్వంలో రజాకార్లు నరరూప రాక్షసులుగా ప్రవర్తించారు.
భారత యూనియన్‌’ ‌నిజామ్‌ ‌రాజు యధాతధ ఒప్పందం (స్టాండ్‌ ‌స్టిల్‌ అ‌గ్రిమెంట్‌) ‌కుదుర్చుకోకుండా రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అడ్డుపడ్డారు. చివరికి ఆ ఒప్పందం కుదిరినా అది అమలు కాలేదు. పర్యవసానంగా హైదరాబాద్‌ ‌సంస్థానంలో అరాజక పరిస్థితి అదుపు తప్పడం, వేలాది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడడం, పోలీసు చర్య అనివార్యం కావడం అనంతర పరిణామాలు. హైదరాబాద్‌ ‌సంస్థానంలోని నిజామ్‌ ‌నిరంకుశ రాజరిక వ్యవస్థ శృంఖలాల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛావాయువులు పీల్చడానికి కొనసాగిన ఒక్కొక్క సామాజిక, రాజకీయ ఉద్యమం చరిత్ర ఒక బృహద్గ్రంథమవుతుంది.

Leave a Reply