‘‘భారత యూనియన్’ నిజామ్ రాజు యధాతధ ఒప్పందం (స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్) కుదుర్చుకోకుండా రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అడ్డుపడ్డారు. చివరికి ఆ ఒప్పందం కుదిరినా అది అమలు కాలేదు. పర్యవసానంగా హైదరాబాద్ సంస్థానంలో అరాజక పరిస్థితి అదుపు తప్పడం, వేలాది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడడం, పోలీసు చర్య అనివార్యం కావడం అనంతర పరిణామాలు. హైదరాబాద్ సంస్థానంలోని నిజామ్ నిరంకుశ రాజరిక వ్యవస్థ శృంఖలాల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛావాయువులు పీల్చడానికి కొనసాగిన ఒక్కొక్క సామాజిక, రాజకీయ ఉద్యమం చరిత్ర ఒక బృహద్గ్రంథమవుతుంది. ’’
సమీర్ చక్రవర్తి
డెబ్బై నాలుగు సంవత్సరాల కిందట హైదరాబాద్• సంస్థానంలో, విశేషించి తెలంగాణంలో అదొక చరిత్రాత్మక, మహత్తర సంఘటన..!
దాదాపు మూడు శతాబ్దాల కిందట 1724వ సంవత్సరంలో అవతరించిన ఆసఫ్ జాహి రాజ్యం అంతరించింది.. ఏడు తరాల ఆసఫ్ జాహి పాలన అంతమయింది. హైదరాబాద్ సంస్థానంపై 1948 సెప్టెంబర్ 13వ తేదీన నాలుగు దిశల నుంచి ప్రారంభమయిన ఆపరేషన్ పోలో ( పోలీస్ చర్య) ఎవరూ ఊహించని విధంగా అయిదు రోజులలో, 17వ తేదీనాటికే విజయవంతంగా ముగిసింది.
ఆపరేషన్ పోలో
ఈ విలీనానికి, హైదరాబాద్ విముక్తికి క్రమంగా దారి తీసిన నేపధ్యాన్ని, దాదాపు నూటా యాభయి సంవత్సరాల వెనుకటి చరిత్రను ఈ సందర్భాన విస్మరించడానికి వీలు లేదు. పందొమ్మిదవ శతాబ్దం ప్రారంభం నుంచే నిజామ్ రాజులు తిరుగుబాటుదారులను ఎదుర్కోవలసి • వచ్చిందనడానికి పలు చారిత్రక సాక్ష్యాధారాలున్నాయి. తమ రాజ్యాన్ని, అధికారాన్ని కాపాడుకోవడానికి నిజామ్ రాజులు పలు సందరా••లలో ఫ్రెంచి, బ్రిటిష్ సైనిక బలగాల మీద ఆధార పడ్డారు. 1857లో ఉత్తర భారత దేశంలో ప్రథమ స్వాతంత్య్ర సమరం జరిగినప్పుడు దాని ప్రభావం హైదరాబాద్ సంస్థానంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గూడ కన్పించింది. 1857 జూలై 17వ తేదీన హైదరాబాద్ నగరంలో వందల మంది రోహిలాలు చెలరేగి తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీఅల్లా ఉద్దీన్ నాయకత్వంలో సుల్తాన్ బజార్లోని బ్రిటిష్ రెసిడెంట్ మీద దాడి చేసారు. 1857 నుంచి 1859 . వరకు హైదరా బాద్లో కొందరు ఉత్తర భారత దేశంలో స్వాతంత్య్ర సమర నాయకులలో ఒకరయిన తాంతియాతో పేతో సంబం ధాలు పెట్టుకున్నారు.
సంస్థానం ప్రజలలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యం కల్గించడానికి, నిజామ్ నిరంకుశత్వానికి – వ్యతిరేకంగా గొంతు విప్పడానికి గత శతాబ్ది చివరనే, అనగా వంద సంవత్సరాల కిందటనే కొందరు ప్రయత్నించారు. హైదరాబాద్ నగరంలో 1892వ సంవత్సరంలో ఆర్య సమాజ్ స్థాపన ఒక ముఖ్య ఘటన. క్రమంగా ఆర్య సమాజ్ ప్రభావం సంస్థానమంతట ప్రసరించింది. పందొమ్మిదవ శతాబ్ది ప్రారంభంలో తెలంగాణంలో గ్రంథాలయోద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు ప్రారంభమయినాయి. విద్యా సంస్థల స్థాపనతో విద్యా వ్యాప్తి కృషి ప్రారంభ . మయింది. మొదటి హైదరాబాద్ విద్యా మహాసభ 1915లో జరిగింది. తత్ఫలితంగా 1919 ఆగస్టు 28వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపితమయింది. వరంగల్లు, నల్లగొండ నగరాలనుంచి తెలుగు పత్రికల ప్రచురణ ప్రారంభమయింది. – హైదరాబాద్ నగరం నుంచి గోలకొండ – పత్రిక వెలువడింది. అప్పటికే గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం ప్రభావం, ఖిలాఫత్ ఉద్యమ ప్రభావం హైదరాబాద్ సంస్థానంలో స్పష్టంగా కన్పించాయి.
హైదరాబాద్ నగరంలో 1921 నవంబర్ 11, 12 తేదీలందు మహర్షి కార్వే అధ్యక్షతన జరిగిన సాంఘిక సంస్కరణల మహాసభలో ఒక తెలుగు తీర్మానం ప్రతిపాదనకు అనుమతించక పోవడంతో, తెలుగు వక్తను అవమా నించడంతో అదే రోజు రాత్రి మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, మందుముల నరసింగరావు, ఆదిరాజు వీరభద్రరావు తదితరులు ‘ఆంధ్ర జనసంఘం’ ఏర్పాటు చేసారు. ఆ సంఘం మొదటి సమావేశం 1922 ఫిబ్రవరి 14వ తేదీన హైదరాబాద్ నగరంలో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ‘నిజామ్ రాష్ట్ర ఆంధ్ర జనసంఘ్’ గా దాని పేరు మార్చి మాడపాటి హనుమంతరావును కార్యదర్శిగా నియమిం చారు. తెలంగాణ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పునరుజ్జీవనం, పునర్వికాసం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సంస్థ ప్రోత్సాహంతో 1930 సంవత్సరంలో వరంగల్లులో కాకతీయుల చరిత్ర పై ఒక మహాసభ ఏర్పాటయింది. ఆంధ్ర జనసంఘ్ పుస్తక ప్రచురణను గూడ ప్రారంభించింది. అనతి కాలంలోనే తెలంగాణ అంతట పలు కార్యక్రమాలతో విస్తరించిన ఆంధ్ర జనసంఘ్ 1930లో, మెదక్ జిల్లా జోగిపేటలో నిర్వహించిన మహాసభతో తెలంగాణ ఆంధ్ర మహా సభగా అవతరించింది. ఆంధ్ర మహాసభ తీవ్ర రాజకీయ పరిణామాలకు దారితీస్తుందని నిజామ్ ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధి కారులు, 1927లో స్థాపితమయిన ఇత్తెహాదుల్ ముసల్మీన్ నాయకులు అనుమానించారు. తరువాత సంవత్సరా లలో వారి అనుమానం నిజమయింది.
హైదరాబాద్ సంస్థానంలో, 1938వ సంవత్సరంలో నిర్వహించిన సత్యాగ్రహాలు, వందేమాతరం ఉద్యమం గణనీయ మయినవి. అదే సంవత్సరం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసు ఏర్పాటు కాగానే నిజామ్ ప్రభుత్వం దానిని నిషేధించింది. 1938లో నిర్వహించిన మొదటి సత్యాగ్రహ ఉద్యమంతో హైదరాబాద్ సంస్థాన మంతట అపూర్వమయిన రాజకీయ చైతన్యం ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్లలో వందేమాతరం గీతాలాపన పై నిజామ్ ప్రభుత్వం నిషేధం విధించింది. అదే సంవత్సరం జూలో లాతూర్ నుంచి హైదరాబాద్ నగరం వచ్చిన స్వామి రామానంద తీర్థ కాంగ్రెసు కార్యకలాపాలను ప్రారంభించారు. 1942 ఆగస్టులో, బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెసు క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించడానికి ఒక రోజు ముందు స్వామి రామానంద తీర్థ ప్రత్యేకంగా గాంధీజీతో మాట్లాడారు. హైదరాబాద్ సంస్థానంలో గూడ క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించడానికి గాంధీజీ అనుమతి ఇచ్చారు.