పెగాసస్పై వెనక్కి తగ్గని విపక్షాలు
పార్లమెంటును చేపల బజారుగా మార్చకండి : ప్రతిపక్షాలను కోరిన కేంద్ర మంత్రి నక్వీ
న్యూఢిల్లీ, ఆగస్ట్ 4 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉభయ సభల్లో వాయిదాల పర్వం యథావిధిగా కొనసాగింది. పెగాసస్ స్పైవేర్ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనతో ఉభయసభల్లోనూ కార్యక్రమాలు సరిగా జరగడం లేదు. రెండు వారాల నుంచి పార్లమెంట్లో ఇదే సీన్ కొనసాగుతుంది. ప్రభుత్వం కొన్ని బిల్లులను పాస్ చేసినా..ఏ అంశంపైనా రెండు సభల్లోనూ చర్చలు మాత్రం సాగడం లేదు. బధువారం కూడా లోక్సభ, రాజ్యసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. రాజ్యసభలో సాగు చట్టాల అంశంపై రూల్ 267 కింద చర్చ చేపట్టేందుకు అంగీకరిస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఇది చాలా కీలకమైన అంశమని, అందుకే అవకాశం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కానీ విపక్ష సభ్యులు మాత్రం వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళన చేపట్టారు. పెగాసస్ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే వెల్లోకి వొచ్చే ఎంపీలను సస్పెండ్ చేస్తానని చైర్మన్ హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. విపక్ష సభ్యులు ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో సభను వాయిదా వేశారు. లోక్సభ కూడా పలుమార్లు వాయిదా పడింది.
పార్లమెంటును చేపల బజారుగా మార్చకండి : ప్రతిపక్షాలను కోరిన కేంద్ర మంత్రి నక్వీ
పార్లమెంటును చేపల బజారుగా మార్చొద్దని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రతిపక్షాలను కోరారు. పార్లమెంటు గౌరవాన్ని మంట కలుపుతున్నారని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పప్రి చాట్ ఇష్టపడకపోతే చేపల కూర తినొచ్చని ఆయనకు సలహా ఇచ్చారు. ఒబ్రెయిన్ ఇటీవల ఇచ్చిన ఓ ట్వీట్లో మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి 10 రోజుల్లో మోదీ-షా 12 బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదం పొందారని తెలిపారు. ఒక్కొక్క బిల్లును సగటున ఏడు నిమిషాల్లోనే ఆమోదించుకుంటున్నారని దుయ్యబట్టారు. చట్టాలను ఆమోదించుకుం టున్నారా? పప్రి చాట్ తయారు చేస్తున్నారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందిస్తూ, డెరెక్ ఒబ్రెయిన్కు పప్రి చాట్ అంటే ఎలర్జీ అయితే, చేపల కూర తినొచ్చన్నారు. పార్లమెంటును చేపల బజారుగా మార్చకూడదని హితవు పలికారు. దురదృష్టవశాత్తూ, పార్లమెంటు గౌరవాన్ని దిగజార్చే కుట్రతో జరుగుతున్న కార్యక్రమాలు గతంలో ఎన్నడూ కనిపించలేదన్నారు. జూలై 19న పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పెగాసస్ స్పైవేర్ ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందుతున్నాయి.