- రాజ్యసభ తొలిదశ బడ్జెట్ సెషన్ నెలపాటు వాయిదా
- మార్చి 13న ప్రారంభం కానున్నట్లు ఛైర్మన్ ప్రకటన
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 13 : రాజ్యసభ తొలి విడుత బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్.. సభను మార్చి 13వ తేదీకి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు అదానీ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. ఈ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. విపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి నిరనసకు దిగడంతో సభా కార్యక్రమాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతుండగా అధికార పక్ష ఎంపీలు సైతం మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఛైర్మన్ ఇరుపక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన.. సభను మార్చి 13కు వాయిదా వేశారు. చివరి రోజు కూడా అదానీ స్టాక్స్ మోసాలపై చర్చ చేపట్టాని, ఆ అంశంపై దర్యాప్తునకు జేపీసీ వేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాలు ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడంతో తొలుత సభను 11.50 నిమిషాల వరకు వాయిదా వేశారు. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రసంగం నుంచి కొన్ని భాగాలను తొలగించడాన్ని కూడా విపక్షాలు తప్పుపట్టాయి. ఈ అంశంపైన కూడా సభలో ఆందోళన చేపట్టాయి. కొందరు ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లారు. రాఘవ చడ్డా, సంజయ్సింగ్, ఇమ్రాన్ ప్రతాప్గిరి, శక్తి సింగ్ గోహిల్, సందీప్ పాఠక్, కుమార్ కేట్కర్లు వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు.
కావాలనే సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, సభను నడిపించే తీరు ఇది కాదు అని, ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేశామని, హౌజ్లో ఇలాంటి గందరగోళం సరికాదు అని, ప్రజల ఆశయాలకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ తెలిపారు. వత్తిడిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను చైర్మెన్ ఖండించారు. బడ్జెట్ సెషన్కు చెందిన రెండో దఫా సమావేశాలు మార్చి 13వ తేదీన ప్రారంభంకానున్నాయి.