Take a fresh look at your lifestyle.

ఉగాది పండుగ విశిష్టత

ఉగస్య ఆది అనేదే ఉగాది. ‘‘ఉగ’’ అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.  అదే సంవ త్సరాది. ఉగాది  – వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతు వులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యవతారిదారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యప రాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం.

ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’ శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.’’ఉగాది పచ్చడి’’ ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది..

ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, ‌కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో ‘గుడిపాడ్వా’ పేరుతో పిలుస్తారు. తమిళులు ‘‘పుత్తాండు’’ అనే పేరుతో, మలయాళీలు ‘‘విషు’’ అనే పేరుతోను, సిక్కులు ‘‘వైశాఖీ’’ గానూ, బెంగాలీలు ‘‘పొయ్‌లా బైశాఖ్‌’’ ‌గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును. ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను, స్ధూలంగా తమ భావిజీవిత క్రమం తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు. ఈరకంగా ఉగాది పండుగను జరుపుకుంటారు.ఉగాది సంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ ఉగాది-పర్వదినం.

ఉగాది పచ్చడ లో ఉన్న శాస్త్రీయత
ఉగాది పచ్చడితో ఆధ్యాత్మిక తత్వంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. ఉగాది పచ్చడకు ఒక విశిష్టత ఉంది, శాస్త్రీయ బద్ధంగా కూడా, అందరి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉగాది పచ్చడిని షడ్రుచులతో తయారు చేయడం జరుగుతుంది. ఉగాది పచ్చడి సేవించడం కారణంగా ఆరోగ్య సమస్యలు దరిచేరవని వైద్య నిపుణులు కూడా ధృవీకరించడం జరిగింది. ఉగాది పచ్చడిని వేపపువ్వు, చింతపండు, మామిడి కాయలు, బెల్లం, మిరియాలు, ఉప్పు, వేసి తయారు చేస్తారు. వేపపువ్వు జ్యోతిష్యం ప్రకారం బుధగ్రహం తో సంబంధం ఉంది. ఇందులో రోగ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఋతువుల్లో వచ్చే మార్పుల వల్ల పిల్లలకు సోకే ఆకల్మ, స్పొటకం, కలరా, మలేరియా, మొదలగు వ్యాధులకు నిరోధకంగా పనిచేస్తుంది. గుమ్మానికి వేపాకులు కట్టడంవల్ల స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వేపాకులతో వచ్చే స్వచ్ఛమైన గాలి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లం ఇది గురు గ్రహానికి సంబంధించిన వస్తువు. బెల్లం లో ఔషధ గుణాలు ఎక్కువే కాబట్టి ఆయుర్వేదంలో చాలా మందులకు బెల్లాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక గర్భిణీ మహిళలు బెల్లం తింటే రక్త ప్రసరణ బాగా జరిగి శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా లభిస్తుంది. దీంతో రక్తహీనత సమస్య నుండి బయటపడతారు. అజీర్తి, పొడి దగ్గు, లాంటివి దూరం చేస్తుంది. బెల్లం తీసుకోవడం వల్ల కలిసిమెలిసి ఉండే గుణాన్ని గురుడు మనసులో పెంపొందిస్తాడు అని మన పెద్దలు అంటారు. మామిడికాయ, మామిడి లో పులుపు, తీపి, తో పాటు వగరు గుణం కూడా ఉంది. ఈ గుణం సౌందర్యానికి ప్రతీక అయిన శుక్ర గ్రహానికి ప్రతీక. మామిడి కాయ వల్ల చర్మం నిగారింపు, సౌందర్యం మెరుగు పడుతుంది. విపరీతమైన చలి తర్వాత వచ్చే వేడిమీ వల్ల వచ్చే పగుళ్లను మామిడికాయ నివారిస్తుంది. ఇందులోని విటమిన్‌ ‌సి వ్యాధినిరోధక శక్తిని పెంపొందించి చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. చింతపండు, చింతపండుతో శుక్రునికి సంబంధం ఉంది మామిడి ముక్కలు చింతపండు పులుపు కలిపి మనలో ఆలోచనా శక్తి మరింత పెంచి, సన్మార్గంలో నడవడానికి దోహదం చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి దూరం అవుతుంది. ఈ పులుపు వేసవిలో వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

చింతపండు మనలో చింతలను దూరంచేసి మానసిక అనారోగ్యాల బారిన పడకుండా చేస్తుంది. మిరియాలు, ఇవి హైగ్రీఉనికి ప్రీతికరమైనవి దీనిలోని వగరు, లేదా కారం గుణం, తలనొప్పి, కండరాలు, నరాల నొప్పులను నివారిస్తుంది. చిటికెడు మిరియాల పొడి తీసుకుంటే అజీర్తి సమస్యలు మాయమైపోతాయి, ముఖంపై మొటిమలు తగ్గించడానికి యాంటీబయటిక్లా అధిక వేడికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. ఉప్పు, ఇది రవి చంద్రుని లక్షణాలను కలిగి ఉంటుంది. రవి ఆరోగ్యానికి చంద్రుడు మనశ్శాంతికి సంకేతం, కాబట్టి మానసిక శారీరక రుగ్మతలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి, అంతే కాదు ఉప్పు లక్ష్మీ స్వరూపం అక్షయ తృతీయ రోజున బంగారం కొనే స్తోమత లేని వారు కనీసం ఉప్పు అయినా కొనాలి అని పండితులు చెబుతారు. ఈ రకంగా పేద, మధ్యతరగతి, ధనిక, సమస్త మానవాళికి ఉగాది పచ్చడి అనేది మానవ జాతికి మన సాంప్రదాయం, సనాతన ధర్మం, అందించినటువంటి ఒక చక్కటి ఔషధం, వరం.ఒక్క మాటలో చెప్పాలంటే హిందువులు ఆచరించే ప్రతి ఒక్క పండుగ వెనుక ఒక శాస్త్రీయత ఖచ్చితంగా ఉంటుంది. హిందుత్వం అనేది మతం కాదు, హిందూ ధర్మం అనేది జీవన విధానం. ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలు. ప్రపంచం మొత్తం హిందూ ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో రోజులు దూరంగా లేవు. ఇన్ని విషయాల రీత్యా, ప్రపంచ దేశాలు కూడా హిందూ ధర్మం పట్ల మొగ్గు చూపుతున్నారు. కొలది కాలం తర్వాత ప్రపంచం మొత్తం హిందూ ధర్మం విస్తరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో హైందవ ధర్మం, హైందవ సంస్కృతి  రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే హిందూ ధర్మం అనేది మతం కాదు జీవన విధానం అన్న విషయాన్ని వారు గ్రహించారు .ఈ సారి శుభకృత్‌ ‌నామ సంవత్సరం ఉగాది జరుపుకుంటున్న వేళ అందరం ఆనందము గా జరుపుకుని సంతోషం గా వుంధాము.
– చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్‌,‌మొగుళ్ల పల్లి,జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా.

Leave a Reply