- సంతోషం వ్యక్తం చేసిన మాజీ సీజే ఎన్వీ రమణ
- ఇళ్ల స్థలాల తీర్పుపై జర్నలిస్టుల హర్షాతిరేకాలు
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్
కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్(టీయుడబ్ల్యుజె), ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) నాయకులు కలిసి హైదరాబాద్ జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
శనివారం నాడు ఎన్వీ రమణను ఢిల్లీలోని క్రిష్ణ మీనన్ మార్గ్ లో గల ఆయన నివాసంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు కలుసుకొని కృతజ్ఞతలు తెలపడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి భోజనం చేసి వెళ్లాలని కోరారు. అంతే కాకుండా శనివారం ఎన్వీ రమణ జన్మదినం కావడంతో టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.